CM Revanth Reddy: కాళేశ్వరం కేసులో సీబీఐ విచారణ ఎందుకు జరిపించట్లేదు.. బీజేపీపై సీఎం రేవంత్ ప్రశ్నల వర్షం
ABN, Publish Date - Nov 05 , 2025 | 09:21 PM
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక బరిలో అసలు బీజేపీనే లేదని సీఎం రేవంత్రెడ్డి ఎద్దేవా చేశారు. ఇక్కడ బీఆర్ఎస్ పేరుతో బీజేపీ ఓట్లు అడుగుతోందని విమర్శించారు. ముస్లింలను బీఆర్ఎస్ మోసం చేస్తోందని ఆరోపించారు సీఎం రేవంత్రెడ్డి.
హైదరాబాద్, నవంబరు 5 (ఆంధ్రజ్యోతి): కాళేశ్వరం కేసు (Kalesh waram Case)లో సీబీఐ (CBI) విచారణ ఎందుకు జరిపించడం లేదని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి (CM Revanth Reddy) ప్రశ్నల వర్షం కురిపించారు. మాజీ మంత్రి కేటీఆర్ (KTR) హైదరాబాద్ అభివృద్ధిపై చర్చలకు రావాలని సవాల్ విసిరారని.. ఆయనకు సవాల్ విసరడం, పారిపోవడం అలవాటేనని సెటైర్లు గుప్పించారు. కేంద్రమంత్రి కిషన్రెడ్డికి తాను సవాల్ విసిరితే ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నల వర్షం కురిపించారు. మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి కేటీఆర్లను ఎందుకు అరెస్ట్ చేయడం లేదని.. ఈ విషయాన్ని ఢిల్లీలో కిషన్రెడ్డి తేల్చుకోవాలని ఛాలెంజ్ చేశారు. మూసీ రివర్ ఫ్రంట్ ఎందుకు కట్టకూడదో కిషన్రెడ్డి చెప్పాలని నిలదీశారు సీఎం రేవంత్రెడ్డి.
ఇవాళ(బుధవారం) షేక్పేట డివిజన్లో సీఎం రేవంత్రెడ్డి రోడ్ షో, కార్నర్ మీటింగ్ నిర్వహించారు. అనంతరం ముఖ్యమంత్రి ప్రసంగించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, మాజీ సీఎం కేసీఆర్లు ఇద్దరు ఒక్కటేనని ఎద్దేవా చేశారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నిక బరిలో అసలు బీజేపీనే లేదని దెప్పిపొడిచారు. ఇక్కడ బీఆర్ఎస్ పేరుతో బీజేపీ ఓట్లు అడుగుతోందని విమర్శించారు. ముస్లింలను బీఆర్ఎస్ మోసం చేస్తోందని ఆరోపించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో సెంటిమెంట్ పనికి రాదని విమర్శించారు. ఒకవేళ సెంటిమెంట్ అయితే పీజేఆర్పై పోటీ పెట్టింది బీఆర్ఎస్ కాదా..? అని ప్రశ్నల వర్షం కురిపించారు సీఎం రేవంత్రెడ్డి.
పదేళ్లుగా బీఆర్ఎస్ జూబ్లీహిల్స్కి ఏం ఇచ్చిందని నిలదీశారు. తాను మొదటి నుంచి సెక్యులర్ భావాలు ఉన్న వ్యక్తినని ఉద్ఘాటించారు. కాంగ్రెస్ పాలనలోనే మైనార్టీలకు అనేక అవకాశాలు వచ్చాయని నొక్కిచెప్పారు. అజారుద్దీన్కు మంత్రి పదవి ఎలా ఇచ్చారని కిషన్రెడ్డి అడుగుతున్నారని అన్నారు. అజారుద్దీన్కు మంత్రి పదవి ఎందుకు ఇవ్వకూడదో కిషన్రెడ్డి చెప్పాలని ప్రశ్నించారు. కాంగ్రెస్ అంటే ముస్లిం.. ముస్లిం అంటే కాంగ్రెస్ అని అభివర్ణించారు సీఎం రేవంత్రెడ్డి.
తాను మూడుసార్లు ఆయా ఎన్నికల్లో గెలవడానికి మైనార్టీల సహకారం ఉందని గుర్తుచేశారు. జూబ్లీహిల్స్లో సమస్యలకు కారణం బీఆర్ఎస్, బీజేపీ కాదా..? అని ప్రశ్నించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల కాంగ్రెస్ అభ్యర్థి నవీన్యాదవ్ను గెలిపిస్తే మరిన్ని అభివృద్ధి పనులు చేస్తామని ఉద్ఘాటించారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 4 వేల ఇందిరమ్మ ఇళ్లను నిర్మిస్తామని మాటిచ్చారు. జూబ్లీహిల్స్లో రూ.400 కోట్లతో అభివృద్ధి పనులు చేస్తున్నామని సీఎం రేవంత్రెడ్డి పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి...
బీజేపీలో బీఆర్ఎస్ విలీనం.. సీఎం రేవంత్రెడ్డి షాకింగ్ కామెంట్స్
హైదరాబాద్ అభివృద్ధిపై చర్చకు రా.. సీఎం రేవంత్కి కేటీఆర్ సవాల్
Read Latest Telangana News And Telugu News
Updated Date - Nov 05 , 2025 | 09:43 PM