PM Narendra Modi: ఈనెల 20, 21న మూడు రాష్ట్రాల్లో ప్రధాని మోదీ పర్యటన
ABN, Publish Date - Jun 19 , 2025 | 06:56 PM
భారతదేశ ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈనెల 20, 21 వ తేదీల్లో మూడు రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. బీహార్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో పర్యటించనున్నట్లు అధికారికంగా ప్రధాని కార్యాలయం ప్రకటించింది.
ఢిల్లీ: భారతదేశ ప్రధానమంత్రి నరేంద్రమోదీ (PM Narendra Modi) ఈనెల(జూన్) 20, 21వ తేదీల్లో మూడు రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. బీహార్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో పర్యటించనున్నట్లు అధికారికంగా ప్రధాని కార్యాలయం ప్రకటించింది. బీహార్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని మోదీ ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేయనున్నారు. ఒడిశాలో కొత్త ప్రభుత్వం ఏర్పాటై ఏడాది పూర్తైన సందర్భంగా నిర్వహిస్తున్న కార్యక్రమానికి ప్రధానమంత్రి హాజరవుతున్నారు.
21వ తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా విశాఖపట్నంలో నిర్వహించే కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ పాలుపంచుకోనున్నారు. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవానికి విశాఖ కేంద్రంగా ప్రధాని మోదీ నేతృత్వం వహించనున్నారు. 21వ తేదీన ఉదయం 6.30గంటలకు యోగా అనంతరం మోదీ ప్రసంగించనున్నారు. విశాఖ బీచ్ రోడ్డులో నిర్వహించే యోగా కార్యక్రమానికి సామాన్య ప్రజలతో కలిసి మోదీ పాల్గొంటారని ప్రధాని కార్యాలయం ప్రకటించింది. ఈ కార్యక్రమానికి సుమారు 5 లక్షల మంది హాజరవుతారని ప్రధాని కార్యాలయం తెలిపింది.
దేశవ్యాప్తంగా 3.5లక్షలకు పైగా ప్రాంతాల్లో అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుగుతోందని పేర్కొంది. 'యోగా ఫర్ వన్ ఎర్త్ వన్ హెల్త్' ఇతివృత్తంతో అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహిస్తున్నట్లు ప్రధాని కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. 2015లో ఐక్యరాజ్యసమితి జూన్ 21వ తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రకటించిన నాటి నుంచి ఢిల్లీ, ఛండీఘడ్, లక్నో, మైసూరు, న్యూయార్క్, శ్రీనగర్ వంటి పలు ప్రదేశాల్లో నిర్వహించిన వేడుకలకు ప్రధాని మోదీ హాజరయ్యారని ప్రధాని కార్యాలయం పేర్కొంది.
ఈ వార్తలు కూడ చదవండి..
విశాఖ తీరంలో చేపల వేటపై ఆంక్షలు.. ఎందుకంటే..
For National News And Telugu News
Updated Date - Jun 19 , 2025 | 07:05 PM