CM Revanth Reddy: ఎవరికోసమో తెలంగాణ హక్కులు వదులుకోం: రేవంత్రెడ్డి
ABN, Publish Date - Jun 20 , 2025 | 05:59 PM
కృష్ణా, గోదావరి జలాల విషయంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం తప్పు చేసిందని సీఎం రేవంత్రెడ్డి మండిపడ్డారు. గతంలో ఏపీకి అన్ని హక్కులు రాసిచ్చారని ఆరోపించారు.
ఢిల్లీ: గోదావరి - బనకచర్ల ప్రాజెక్ట్పై (Banakacharla Project) ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో (CM Chandrababu Naidu) చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి (CM Revanth Reddy) అన్నారు. తాము ఎవరితో వివాదాలు కోరుకోవడం లేదని స్పష్టం చేశారు. ఈ నెల(జూన్) 23వ తేదీ తెలంగాణ కేబినెట్ సమావేశం జరుగుతుందని... ఈ భేటీలో చర్చించిన తర్వాత చంద్రబాబును చర్చలకు ఆహ్వానిస్తామని తెలిపారు. బనకచర్ల ప్రాజెక్ట్పై తెలంగాణని ఏపీ మొదట ఎందుకు సంప్రదించలేదని ప్రశ్నిచారు. కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదించడమే తమ అభ్యంతరమని తెలిపారు. ఏపీ విభజన చట్టంలోని అంశాలను పరిష్కరించుకునేందుకు అధికారులు, మంత్రుల స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేశామని వివరించారు. ఢిల్లీలో ఇవాళ(శుక్రవారం) ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మీడియాతో చిట్చాట్ చేశారు.
ఎవరితోనూ తాము వివాదం కోరుకోవడం లేదని.. ఎవరికోసమో తెలంగాణ హక్కులు వదులుకోమని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి స్పష్టం చేశారు. కృష్ణాజిల్లాలో 500 టీఎంసీలకు బ్లాంకెట్ ఎన్ఓసీకి తాను అడిగినందుకు మాజీ మంత్రి హరీష్రావు తప్పుపడుతున్నారని.. ఆయన వాదనలో పస లేదని చెప్పారు. 2023లో కేంద్రానికి హరీష్రావు రాసిన లేఖలో కేవలం 405 టీఎంసీలు మాత్రమే తెలంగాణకు అడిగారని గుర్తుచేశారు. తెలంగాణలో తమ ప్రాజెక్ట్లు పూర్తయి, పూర్తిస్థాయిలో నీటిని వినియోగించుకున్న తర్వాతే ఆంధ్రప్రదేశ్ వారి ప్రాజెక్ట్ల గురించి ఆలోచించాలని కోరారు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి.
నీళ్లు, నిధుల పేరిట మోసపూరిత సెంటిమెంట్ని గతంలో బీఆర్ఎస్ నేతలు అడ్డుపెట్టుకున్నారని.. ఇప్పుడు జలాలను సంజీవని అని భావిస్తున్నారని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. కృష్ణా, గోదావరి జలాల విషయంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం తప్పు చేసిందని మండిపడ్డారు. గతంలో ఏపీకి అన్ని హక్కులు రాసిచ్చారని ఆరోపించారు. రాయలసీమను రత్నాలసీమ చేస్తానని మాజీ సీఎం కేసీఆర్ అన్నారని చెప్పుకొచ్చారు. గోదావరి జలాలను ఏపీ ఉపయోగించుకుంటే తప్పేంటని కేసీఆర్ అనలేదా అని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా 50 వేల ఎకరాలకు మాత్రమే నీరు అందించారని చెప్పారు. ఈ ఏడాదిలో తెలంగాణలో పండిన అత్యధిక పంటలకు కాళేశ్వరం నీళ్లకు సంబంధం లేదని తేల్చిచెప్పారు. కృష్ణా, గోదావరి జలాలపై తెలంగాణ హక్కులను ఏపీకి రాసిచింది కేసీఆర్, హరీష్రావులే అని సీఎం రేవంత్రెడ్డి ఆరోపణలు చేశారు.
తెలంగాణ ధాన్యాగారంగా మారేందుకు కాళేశ్వరం ప్రాజెక్ట్తో సంబంధం లేదని సీఎం రేవంత్రెడ్డి చెప్పారు. కృష్ణా, గోదావరి జలాల హక్కులను కేసీఆర్, హరీష్రావే ఏపీకి రాసిచ్చారని ఆరోపించారు. జలవివాదాలు పెట్టుకోవడం తమ విధానం కాదని స్పష్టం చేశారు. చర్చలతోనే సమస్యలు పరిష్కరించుకుంటామని అన్నారు. జూలై 6, 7 తేదీల్లో మరోసారి ఢిల్లీలో పర్యటిస్తామని తెలిపారు. తెలంగాణకు అన్యాయం చేసింది కేసీఆర్, హరీష్రావే అని ఆరోపించారు. అధికారం కోల్పోయిన అసహనంలో హరీష్రావు ఉన్నారని విమర్శించారు. తాను కేంద్రమంత్రులను కలిసే ఒకరోజు ముందే కిషన్రెడ్డి కలిశారని చెప్పారు. కేటీఆర్కు కిషన్రెడ్డి లైజనింగ్ అధికారిగా పనిచేస్తున్నారని విమర్శించారు. కేసీఆర్కు కాళేశ్వరం ఏటీఎంలా మారిందని మోదీ, అమిత్షా అన్నారని గుర్తుచేశారు. కేబినెట్ నిర్ణయం తర్వాతే కాళేశ్వరం కట్టారని ఎంపీ ఈటల రాజేందర్ చెబుతున్నారని అన్నారు. ఏది నిజమో కేంద్రమంత్రి కిషన్రెడ్డి చెప్పాలని సీఎం రేవంత్రెడ్డి పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి:
విద్యార్థిపై దాడి దృశ్యాలు సోషల్ మీడియాలో వరల్..
రాష్ట్రపతికి సీఎం చంద్రబాబు బర్త్డే శుభాకాంక్షలు
భువనేశ్వరికి చంద్రబాబు బర్త్డే విషెస్
Read Latest Telangana News And Telugu News
Updated Date - Jun 20 , 2025 | 07:35 PM