Kavitha: ఆరుగురు ఎమ్మెల్యేలను తెస్తా.. మంత్రి పదవి ఇస్తారా ?
ABN, Publish Date - May 29 , 2025 | 03:28 AM
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత.. కాంగ్రెస్లో చేరేందుకు ఆ పార్టీతో రాయబారం నెరపిన అంశానికి సంబంధించి మరింత సమాచారం వెలుగులోకి వచ్చింది. కాంగ్రెస్లో తాను చేరడంతోపాటు, ‘‘బీఆర్ఎస్ నుంచి ఆరుగురు ఎమ్మెల్యేలను తీసుకొని వస్తా.
కాంగ్రెస్ అధిష్ఠానానికి కవిత ప్రతిపాదన.. టీపీసీసీ సుముఖత
గ్రీన్సిగ్నల్ ఇచ్చేందుకు సిద్ధమైన హైకమాండ్
రేవంత్ సన్నిహితుల వ్యతిరేకతతో బ్రేక్
‘ఆంధ్రజ్యోతి’కి అందిన పక్కా సమాచారం
జర్నలిజం కాదు శాడిజం అని కవిత రుసరుస
కొంతకాలంగా బీఆర్ఎస్ లైన్కు భిన్నంగా వైఖరి
జైలు నుంచి బయటకొచ్చాక స్వరంలో మార్పు
‘సామాజిక తెలంగాణ’ రాలేదంటూ గత కేసీఆర్ పాలనకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు
పర్యటనలతో సొంత అడుగులు నిజం కాదా?
హైదరాబాద్, మే 28 (ఆంధ్రజ్యోతి): బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత.. కాంగ్రెస్లో చేరేందుకు ఆ పార్టీతో రాయబారం నెరపిన అంశానికి సంబంధించి మరింత సమాచారం వెలుగులోకి వచ్చింది. కాంగ్రెస్లో తాను చేరడంతోపాటు, ‘‘బీఆర్ఎస్ నుంచి ఆరుగురు ఎమ్మెల్యేలను తీసుకొని వస్తా. నాకు మంత్రి పదవి ఇస్తారా?’’ అని కాంగ్రెస్ అధిష్ఠానం ముందు కవిత ప్రతిపాదన పెట్టినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఇందుకు సంబంధించి ‘ఆంధ్రజ్యోతి’కి పక్కాగా సమాచారం అందింది. కాంగ్రెస్ అధిష్ఠానం ముందు తన ప్రతిపాదనను పెట్టి చర్చించే విధంగా పావులు కదిపారు. మంత్రి పదవికి సంబంధించి తన అభిమతాన్ని కాంగ్రెస్ పెద్దల ముందు ఉంచారు. కాంగ్రెస్ అధిష్ఠానం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేందుకు సిద్ధమైందని తెలిసింది. టీపీసీసీ స్థాయిలో కవిత చేరికపై సుముఖత కూడా వ్యక్తమైంది. ఈ మేరకు అధిష్ఠానానికి సమాచారం ఇచ్చింది. కానీ, సీఎం రేవంత్రెడ్డి సన్నిహిత వర్గాలు మాత్రం కవిత చేరికకు అభ్యంతరం చెప్పాయి. కేసీఆర్ కుటుంబాన్ని చీల్చిన అపవాదును మూటగట్టుకోవాల్సి వస్తుందని, అది ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు తీసుకెళుతుందని అధిష్ఠానానికి చెప్పారు. దాంతో కాంగ్రె్సలో కవిత చేరికకు బ్రేక్ పడింది. కవిత కాంగ్రె్సతో రాయబారం జరిపిన విషయాన్ని మంగళవారం ‘ఆంధ్రజ్యోతి’ ప్రముఖంగా ప్రచురించిన విషయం తెలిసిందే. ‘ఆంధ్రజ్యోతి’ కథనం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది. రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. అయితే గత రెండు రోజులుగా ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురితమైన కథనాలపై కవిత రుసరుసలాడారు. కనీసం తనను సంప్రదించకుండా వార్తలు ఇచ్చారని, ఇది జర్నలిజమా, శాడిజమా? అంటూ ‘ఎక్స్’ వేదికగా ఓ పోస్టు పెట్టారు. కాంగ్రె్సతో రాయబారం నెరిపిన విషయంపై కవితతో మాట్లాడేందుకు మంగళవారం ‘ఆంధ్రజ్యోతి’ ప్రతినిధి ఫోన్లో సంప్రదించగా ఆమె స్పందించలేదు. దీంతో కీలక అంశంపై వివరణ ఇవ్వాల్సి వస్తుందనే ఆమె స్పందించలేదనే విషయం స్పష్టమవుతోంది. జరిగింది ఇదైతే ఆమె అసంబద్ధమైన వ్యాఖ్యలతో పోస్టులు పెట్టారు.
కొంత కాలంగా ఉక్కపోత..
బీఆర్ఎ్సలో కవిత గత కొంతకాలంగా ఉక్కపోతకు గురవుతున్నారు. బీఆర్ఎ్సలో తనకు తగిన ప్రాధాన్యం దక్కడం లేదన్న అసంతృప్తితో ఉన్నారు. ప్రధానంగా ఢిల్లీ మద్యం పాలసీ కేసులో అరెస్టయి.. బెయిల్పై విడుదలైన తరువాత రాజకీయంగా ఆమె ఆశించిన విధంగా రాజకీయ పరిణామాలు లేవు. కేసీఆర్ చుట్టూ దయ్యాలున్నాయంటూ కవిత వ్యాఖ్యానించడమే ఇందుకు నిదర్శనం. పైగా సొంత పార్టీలో తీవ్ర వివక్ష, నిరాదరణకు గురవుతున్నానన్న అభిప్రాయం ఆమెలో నెలకొంది. గతంలో ఉన్నంత ప్రాధాన్యం కూడా పార్టీ వర్గాలు, శ్రేణులు ఇవ్వడం లేదని అసంతృప్తితో రగిలిపోతున్నారు. దీనికితోడు బీఆర్ఎస్ రజతోత్సవ సభ అనంతరం ఆమె రాసిన లేఖకు పార్టీ పెద్దల నుంచి ఎటువంటి స్పందన రాలేదు. ఆమె అమెరికా పర్యటన నుంచి వచ్చే ఒకరోజు ముందు లేఖ బయటకు రావడంతో బీఆర్ఎ్సలో కలకలం రేగింది. ఆ లేఖ తానే రాసినట్లు చెబుతూ కవిత కొన్ని తీవ్రమైన, సంచలన వ్యాఖ్యలు చేశారు. లేఖను ఎవరు బయట పెట్టారో చెప్పాలంటూ డిమాండ్ చేశారు. కేసీఆర్ దేవుడంటూనే.. ఆయన చుట్టూ దయ్యాలున్నాయని ఆరోపించారు. పాతికేళ్ల పార్టీలో కుటుంబం నుంచే తొలిసారి ధిక్కార స్వరాన్ని వినిపించారు. దీంతో పార్టీలో ఆమె తీవ్ర అసంతృప్తితో ఉన్నారన్న విషయం స్పష్టంగా వెల్లడైంది. అనంతరం కవిత వద్దకు.. పార్టీ అధినేత కేసీఆర్ సూచనల మేరకు ఇద్దరు దూతలు వెళ్లి రాయబారం నెరిపారు. ఆ సందర్భంగా పార్టీలో తన ప్రాధాన్యంపై స్పష్టత ఇవ్వాలని ఆమె పట్టుబట్టారు. ఇందుకు అధినేత నుంచి సానుకూలత వ్యక్తం కాకపోవడంతో రాయబారం విఫలమయింది. ఆ మరుసటి రోజే సింగరేణి కార్మికుల కోసం ‘సింగరేణి జాగృతి’ అనుబంధ సంఘాన్ని కవిత ఏర్పాటు చేశారు.
బీఆర్ఎస్ లైన్కు భిన్నంగా...
కవిత గత కొంతకాలంగా సొంత పార్టీ లైన్లో నడవడం లేదని స్వయంగా ఆ పార్టీ వర్గాలే ఆరోపిస్తున్నాయి. ఆమె అడుగులు భిన్నంగా పడుతున్నాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆమె జైలు నుంచి బెయిల్పై బయటకు వచ్చిన తర్వాత కొద్దిరోజులపాటు ఇంటికే పరిమితమయ్యారు. అనంతరం సొంతంగా కార్యక్రమాలు చేపట్టారు. తొలుత జాగృతి ద్వారా కొన్ని కార్యక్రమాలు నిర్వహించారు. అయితే ఆమె వేసిన అడుగులు, తీసుకున్న నిర్ణయాలు బీఆర్ఎస్ అఽధిష్ఠానానికి ఏమాత్రం మింగుడుపడలేదు. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కులగణన సర్వేలో కవిత పాల్గొన్నారు. సామాన్య ప్రజల మాదిరిగానే ఆమె కూడా సర్వేలో తన కుటుంబ వివరాలన్నింటినీ సర్కారుకు తెలియజేశారు. కానీ, కేసీఆర్, కేటీఆర్, హరీశ్రావు కుటుంబాలు మాత్రం కులగణన సర్వేలో పాల్గొనలేదు. కవిత సర్వేలో పాల్గొనడం బీఆర్ఎ్సలో చర్చనీయాంశమైంది. అలాగే బీసీలకు రాజకీయంగా రిజర్వేషన్లు కల్పించాలంటూ ఆమె బీసీ సంఘాలను కూడగట్టుకొని ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. అప్పటికే కాంగ్రెస్ సర్కారు కులగణన పూర్తి చేసి, బీసీ రిజర్వేషన్లపై కసరత్తు మొదలుపెట్టింది. దీని కోసం డెడికేటెడ్ కమిషన్ను ఏర్పాటు చేసింది. అయితే బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసిన తరువాత తన పోరాటం వల్లనే ఇది సాధ్యమైందంటూ కవిత వ్యాఖ్యానించారు. ఆ తర్వాత ఒక కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ, ‘తెలంగాణ ఏర్పాటైనప్పటికీ.. సామాజిక తెలంగాణ రాలేదు’ అని వ్యాఖ్యానించారు. అలాగే భూములున్న రైతులకు రైతుబంధు ఇచ్చారని, భూములు లేని రైతు కూలీలకు ఏ సాయమూ చేయలేదని అన్నారు. ఈ వ్యాఖ్యలు పరోక్షంగా కేసీఆర్ పాలనకు వ్యతిరేకంగా చేసినవే కావడంతో అటు బీఆర్ఎ్్సలోనూ, ఇటు యావత్ తెలంగాణ సమాజంలోనూ తీవ్ర చర్చకు దారి తీశాయి. కేసీఆర్కు రాసిన లేఖలో బీజేపీ గురించి రెండు నిమిషాలు కూడా మాట్లాడలేదంటూ అధినేత తీరును తప్పుబట్టారు. ఇలా గత కొంతకాలంగా కవిత చేపట్టే కార్యక్రమాలు, వ్యాఖ్యలు, నిర్ణయాలు అన్నీ బీఆర్ఎస్ పార్టీ లైన్కు పూర్తి భిన్నంగా ఉన్నాయన్న అభిప్రాయాలు బలపడ్డాయి.
మంత్రి పదవిపై నాటి నుంచే గురి!
తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక 2014 ఎన్నికల్లో నిజామాబాద్ నుంచి ఎంపీగా ఎన్నికైన కవిత.. బీఆర్ఎస్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత 2019లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమిపాలైన విషయం తెలిసిందే. దీంతో ఆరు నెలల తర్వాత పార్టీ ఆమెను శాసనమండలికి పంపించింది. ఆ తర్వాత ఆమె కేసీఆర్ క్యాబినెట్లో మంత్రి పదవి ఆశించారు. కానీ, అప్పటి సమీకరణాల కారణంగా ఆమెకు అమాత్య పదవి దక్కలేదు. ఆ తర్వాత 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమిపాలైంది. దీంతో మంత్రి పదవి కవితకు కలగానే మిగిలిపోయింది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ ద్వారా ఆ కలను నెరవేర్చుకునే ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది.
Also Read:
తెలంగాణ హైకోర్టు కొత్త సీజే ఎవరంటే
For More Telangana News and Telugu News..
Updated Date - May 30 , 2025 | 02:55 PM