BRS: ఎవరూ స్పందించొద్దు!
ABN, Publish Date - May 26 , 2025 | 04:29 AM
బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ కవిత వ్యవహారం రాష్ట్రంలో రాజకీయ దుమారం రేపుతుండగా.. ఈ అంశంపై పార్టీ నేతలెవరూ స్పందించవద్దని అధినేత కేసీఆర్ ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు సూచించినట్లు తెలిసింది.
ఆలోచించి అడుగులు వేయాలి దుష్ప్రచారంపై కాదు..
పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టాలి
కవిత వ్యవహారంపై కేటీఆర్కు కేసీఆర్ దిశానిర్దేశం
తనయుడిని ఫామ్హౌస్కు పిలిపించుకున్న తండ్రి
3 గంటలపాటు మంతనాలు కాళేశ్వరం నోటీసులపైనా చర్చ
జూన్ 1న అమెరికాలో బీఆర్ఎస్ రజతోత్సవ సభ
హైదరాబాద్/సంగారెడ్డి, మే 25 (ఆంధ్రజ్యోతి): బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ కవిత వ్యవహారం రాష్ట్రంలో రాజకీయ దుమారం రేపుతుండగా.. ఈ అంశంపై పార్టీ నేతలెవరూ స్పందించవద్దని అధినేత కేసీఆర్ ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు సూచించినట్లు తెలిసింది. పార్టీలో వ్యక్తమవుతున్న భిన్నాభిప్రాయాలపై.. అంతర్గత విభేదాలంటూ ప్రచారం జరుగుతోందని, దీనిపై తొందరపడి స్పందించాల్సిన అవసరంలేదని అన్నట్లు సమాచారం. కేసీఆర్కు కవిత రాసిన లేఖ, తదనంతర పరిణామాలపై మూడు రోజులుగా చర్చ జరుగుతున్నా మౌనంగా ఉన్న కేసీఆర్.. ఆదివారం తన కుమారుడు కేటీఆర్ను ఎర్రవల్లిలోని ఫామ్హౌ్సకు పిలిపించుకున్నారు. మధ్యాహ్నం 2గంటలకు ఫామ్హౌ్సకు చేరుకున్న కేటీఆర్.. నేరుగా పై అంతస్తులో కేసీఆర్ ఉన్న గదికి వెళ్లినట్లు తెలిసింది. వీరి మధ్య దాదాపు 3గంటలపాటు సుదీర్ఘ చర్చ జరిగింది. ప్రధానంగా కవిత వ్యవహారంపైనే చర్చ జరిగినట్లు తెలుస్తోంది. దీంతోపాటు కాళేశ్వరం కమిషన్ నోటీసులు, పార్టీ అంతర్గత అంశాలు, త్వరలో చేపట్టాల్సిన కార్యక్రమాలపైనా ఇరువురు చర్చించినట్లు సమాచారం. కాగా, పార్టీలో అంతర్గతంగా మాట్లాడుకోవాల్సిన అంశాలను బహిరంగపరచడంతో క్యాడర్లో గందరగోళం నెలకొందని వారు అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. కవిత లేఖ గురించి ప్రెస్మీట్లు, ఇతర సమావేశాల్లో చర్చించవద్దని, సున్నితమైన విషయంపై ఆలోచించి అడుగులు వేయాలని కేసీఆర్ హితబోధ చేసినట్లు తెలిసింది.
పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టాలి..
వివిధ రకాలుగా జరుగుతున్న దుష్ప్రచారాలపై కాకుండా.. పార్టీని బలోపేతం చేయడంపైనే దృషి ్టపెట్టాలని, ఇందుకు అనుగుణంగా కార్యాచరణ సిద్ధం చేసుకోవాలని కేటీఆర్ను గులాబీ బాస్ ఆదేశించినట్లు తెలిసింది. త్వరలో పార్టీ విస్తృతస్థాయి సమావేశం ఏర్పాటుచేసి సభ్యత్వ నమోదుకు సంబంధించిన మార్గదర్శకాలు ఇవ్వాలని పేర్కొన్నట్లు సమాచారం. జూన్ రెండో వారంలో పార్టీ సభ్యత్వ నమోదు, సంస్థాగత కమిటీల ఏర్పాటు తదితర అంశాలకు సంబంధించిన షెడ్యూల్ను ప్రకటించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. డిజిటల్ సభ్యత్వ నమోదుకు సాంకేతికంగా జరుగుతున్న ఏర్పాట్లు, రూపొందిస్తున్న యాప్ వివరాలపై కేసీఆర్ ఆరా తీశారని, పటిష్ఠంగా అమలు చేయాలని ఆదేశించారని తెలిసింది. కాగా, అమెరికాలోని డల్లా్సలో జూన్ 1న జరిగే పార్టీ రజతోత్సవ సభకు హాజరయ్యేందుకు కేటీఆర్ ఈ నెల 28న హైదరాబాద్ నుంచి బయలుదేరి వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో డల్లాస్ సభలో ప్రసంగించాల్సిన అంశాలు, సభ అనంతరం అక్కడి తెలంగాణ వారితో భేటీ కావడం వంటి అంశాలు కూడా ఇరువురి మధ్య చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. జూన్ 2న జరిగే తెలంగాణ ఆవిర్భావ వేడుకలను తెలంగాణ భవన్లో నిర్వహించాలన్న కేసీఆర్.. ఆ రోజు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించే బాధ్యతను శాసనమండలి ప్రతిపక్ష నేత, పార్టీ సీనియర్ నాయకుడు మధుసూదనాచారికి అప్పగించాలని నిర్ణయించినట్లు తెలిసింది.
నోటీసులపై ఏం చేద్దాం?
జూన్ 5న కాళేశ్వరం కమిషన్ విచారణకు హాజరు కావాలని కేసీఆర్కు నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో.. దీనిపై ఏం చేయాలన్న అంశంపై కూడా చర్చించినట్లు సమాచారం. న్యాయ నిపుణులతో చర్చించి నిర్ణయం తీసుకోవాలని యోచించినట్లు తెలిసింది. బీఆర్ఎస్ రజతోత్సవ సభ అనంతరం.. జాతీయ స్థాయులో, రాష్ట్రంలో చోటుచేసుకుంటున్న రాజకీయ పరిణామాలు, వాటిపై బీఆర్ఎస్ స్పందిస్తున్న తీరుపై కూడా కేసీఆర్తో కేటీఆర్ భేటీలో చర్చకు వచ్చినట్లు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. సుదీర్ఘ చర్చ అనంతరం సాయంత్రం 6గంటల సమయంలో కేటీఆర్ తిరిగి హైదరాబాద్ వెళ్లిపోయారు. కాగా, కేటీఆర్ రాక సందర్భంగా ఫామ్హౌ్సలో సిబ్బంది అప్రమత్తమయ్యారు. పై అంతస్తులో కేసీఆర్తో మాట్లాడుతున్న సమయంలో ఎవరూ దరిదాపుల్లోకి వెళ్లలేదు. పైకి ఎవరూ రాకుండా ముందే హెచ్చరించినట్లు తెలిసింది.
ఇవి కూడా చదవండి
Shashi Tharoor: పార్టీ కోసమే పని చేస్తున్నా.. క్లారిటీ ఇచ్చిన శశిథరూర్
ponnam prabhakar: తల్లిదండ్రులు వారి పిల్లలను శక్తి మేర చదివించాలి: పొన్నం
Updated Date - May 26 , 2025 | 04:29 AM