CM Revanth Reddy:మహాన్యూస్ కార్యాలయంపై దాడి.. సీఎం రేవంత్రెడ్డి ఏమన్నారంటే..
ABN, Publish Date - Jun 28 , 2025 | 09:05 PM
మహాన్యూస్ కార్యాలయంపై జరిగిన దాడిపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి స్పందించారు. మీడియాపై దాడి హేయమైన చర్య అని అన్నారు. మీడియాపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నానని సీఎం రేవంత్రెడ్డి చెప్పారు.
హైదరాబాద్: తెలుగు న్యూస్ టీవీ ఛానల్ 'మహాన్యూస్' (Maha News)హైదరాబాద్ ప్రధాన కార్యాలయంపై దుండగులు ఇవాళ(శనివారం) దాడి చేశారు. కర్రలు, రాళ్లతో ఆఫీస్ మీద దాడి చేసి బిల్డింగ్ అద్దాలు, కార్ల అద్దాలు పగులగొట్టారు. కర్రలతో ఆఫీస్లోకి చొరబడేందుకు ప్రయత్నించారు. ఈ ఘటనపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
అయితే ఈ ఘటనపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి (Telangana CM Revanth Reddy) స్పందించారు. మీడియాపై దాడి హేయమైన చర్య అని అన్నారు. మీడియాపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నానని చెప్పారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడులు సమర్థనీయం కాదని తెలిపారు. ఈ మేరకు సీఎం రేవంత్రెడ్డి ఓ ప్రకటన విడుదల చేశారు.
మహాన్యూస్ కార్యాలయంపై దాడి హేయమైన చర్య: మహేష్ కుమార్ గౌడ్
మహాన్యూస్ కార్యాలయంపై దాడి హేయమైన చర్య అని టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) అన్నారు. ఈ దాడిని తీవ్రంగా ఖండించారు. పత్రికా విలువలు, ప్రజాస్వామ్య సూత్రాలకు విరుద్ధంగా ఇలాంటి దాడులు జరగడం దురదృష్టకరమని చెప్పారు. మీడియా ప్రసారాలు, కథనాలపై ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే, వాటిని తెలియజేసేందుకు చట్టపరమైన మార్గాలు ఉన్నాయని అన్నారు మహేష్ కుమార్ గౌడ్.
మీడియా కార్యాలయాలపై దాడులు చేయడం సహించరానిదని మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో వాస్తవాలను ప్రజలకి వివరిస్తున్న మహాన్యూస్పై దాడి చేయడం అప్రజాస్వామికమని అన్నారు. మహాన్యూస్ ఛానల్పై జరిగిన ఈ దాడిని ప్రజాస్వామ్యవాద వాదులు అందరూ ఖండించాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఈ దాడికి పాల్పడిన వ్యక్తులపై ప్రభుత్వం చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని మహేష్ కుమార్ గౌడ్ కోరారు.
ఇవి కూడా చదవండి
యాంకర్ స్వేచ్ఛ సూసైడ్ కేసులో ట్విస్ట్
Read Latest Telangana News And Telugu News
Updated Date - Jun 28 , 2025 | 09:15 PM