CM Revanth Reddy: ఆ సంస్థలతో ఒప్పందం.. దావోస్ పర్యటనపై సీఎం రేవంత్ ఆసక్తికర వ్యాఖ్యలు
ABN, Publish Date - Jan 28 , 2025 | 04:46 PM
CM Revanth Reddy: విదేశాల నుంచి పెట్టుబడులు తీసుకురావాలనేది తమ ప్రభుత్వ ప్రయత్నమని సీఎం రేవంత్రెడ్డి తెలిపారు. గత ప్రభుత్వంలో వాళ్లు ఇక్కడి నుంచి విదేశాలకు నిధులు తరలించారని ఆరోపించారు. ఇక్కడ కొల్లగొట్టిన సొమ్మునే విదేశీ పెట్టుబడులుగా చూపారని విమర్శించారు. తాము విఫలమైతే పైశాచిక ఆనందం పొందాలని కొందరు చూశారని సీఎం రేవంత్రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రాన్ని వన్ ట్రిలియన్ ఎకానమీగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వ్యాఖ్యానించారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చిన సంస్థలకు ధన్యవాదాలు తెలిపారు. ఇది మా ప్రభుత్వం సాధించిన కీలక విజయమన్నారు. తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు రాకుండా కొందరు కుట్రలు చేశారని ఆరోపించారు. రాష్ట్ర అభివృద్ధిపై దుష్ప్రచారం చేశారని మండిపడ్డారు. దావోస్ పర్యటనతో రూ.1.80 లక్షల కోట్ల పెట్టుబడులను పెట్టేలా మన రాష్ట్రం ఆకర్షించగలిగిందని చెప్పుకొచ్చారు. ఇది నిరంతర ప్రక్రియ అని చెప్పారు. రాజకీయంగా విభేదించినా రాష్ట్ర అభివృద్ధి విషయంలో రాజకీయ వివాదాలకు వెళ్లొద్దని హితవు పలికారు. పెట్టుబడులకు అవసరమైన భూ కేటాయింపులు చేసి అన్ని రకాలుగా ఆ సంస్థలను ప్రోత్సహిస్తామన్నారు. మనందరం కలిసి కష్టపడితేనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమని చెప్పారు. సింగపూర్ ఆధ్వర్యంలో నడుస్తుస్తున్న ఐటీఈ సంస్థతో కూడా ఒప్పందాలు చేసుకున్నామని తెలిపారు. ఇది భవిష్యత్లో మన సాంకేతికను పెంపొందించడానికి ఉపయోగపడుతుందని సీఎం రేవంత్రెడ్డి పేర్కొన్నారు.
పైశాచిక ఆనందం పొందారు..
‘‘విదేశాల నుంచి పెట్టుబడులు తీసుకురావాలనేది మా ప్రయత్నం. వాళ్లు ఇక్కడి నుంచి విదేశాలకు నిధులు తరలించారు. ఇక్కడ కొల్లగొట్టిన సొమ్మునే విదేశీ పెట్టుబడులుగా చూపారు. మేం విఫలమైతే పైశాచిక ఆనందం పొందాలని కొందరు చూశారు. ఇతర రాష్ట్రాల కంటే గొప్పగా పెట్టుబడులు సాధించాం. అసూయతోనే మమ్మల్ని అభినందించడం లేదు. భారీ పెట్టుబడులు తేవడం చూసి కొందరికి కడుపుమంటగా ఉంది. ప్రతిపక్షంలో ఓ నేత అటెన్షన్ డిజార్డర్తో బాధపడుతున్నారు. చాలా సంస్థలు మన పెవిలియన్కు వచ్చి ఒప్పందాలు చేసుకున్నాయి. కేసీఆర్ ప్రభుత్వంలో ఈస్థాయిలో పెట్టుబడులు రాలేదనే అక్కసుతో ఉన్నారు. ఎనర్జీ పాలసీతోనే తెలంగాణలో పెట్టుబడులు పెరిగాయి. అంతర్జాతీయ సంస్థలను హైదరాబాద్కు తీసుకువచ్చేందుకు దావోస్ వెళ్లాం. ప్రపంచ ఆర్థిక సదస్సులో భారీగా పెట్టుబుడులపై ఒప్పందాలు చేసుకున్నాం. తెలంగాణలో పెట్టుబడులపై కొందరు దుష్ప్రచారం చేశారు. కానీ ఇన్వెస్టర్లు మాపై పూర్తి విశ్వాసం ఉంచారు. తెలంగాణ ప్రభుత్వంపై నమ్మకం ఉంచుతూ భారీ పెట్టుబడులతో... వ్యాపారవేత్తలు ముందుకు వచ్చారు. తలసరి ఆదాయంలో తెలంగాణ అగ్రస్థానంలో ఉంది. స్కిల్ డెవలప్మెంట్ వర్సిటీ కోసం సింగపూర్ ప్రభుత్వంతో ఎంవోయూ చేసుకున్నాం. స్కిల్ డెవలప్మెంట్లో ఇదో అద్భుత పరిణామం’’ అని సీఎం రేవంత్రెడ్డి పేర్కొన్నారు.
తెలంగాణకు భారీగా పెట్టుబడులు: మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు
దావోస్ పర్యటనలో గతేడాది కంటే నాలుగు రేట్లు ఎక్కువ పెట్టుబడులు వచ్చాయని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు తెలిపారు. తెలంగాణ ప్రజలు, యువతకు మేలు చేయాలనేదే తమ ప్రభుత్వ ఆలోచన అని చెప్పారు. ఎన్ని విమర్శలు చేసినా సలహా లాగే తీసుకున్నామన్నారు. సింగపూర్ ప్రభుత్వంతో కలిసి పనిచేయాలని నిర్ణయించామని అన్నారు. సాంకేతిక నైపుణ్యం, విద్యార్థుల బదిలీ బరిగేలా ఒప్పందం చేసుకున్నామని చెప్పారు. రూ.450 కోట్లతో స్కిల్ సెంటర్ ఏర్పాటుకు క్యాపిటలాండ్ ముందుకు వచ్చిందని చెప్పుకొచ్చారు. స్విట్జర్లాండ్కు చెందిన UBS, మల్టీవాక్ గ్రూప్తో ఒప్పందాలు చేసుకున్నామని వివరించారు. దావోస్ పర్యటనలో రూ.1.80 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించామని ఉద్ఘాటించారు. వన్ ట్రిలియన్ ఎకానమీ దిశగా అడుగుపడిందని చెప్పారు. మూసీ పునరుజ్జీవం, యువతకు ఉపాధిపై దృష్టిపెట్టామని తెలిపారు. మూసీని ప్రక్షాళన చేసి ప్రజలకు స్వచ్ఛమైన గాలి అందిస్తామన్నారు. హైదరాబాద్ అంటేనే .. బిజినెస్ అనే బ్రాండ్ ఏర్పడిందని చెప్పుకొచ్చారు. సాంకేతిక నైపుణ్యాలకు హైదరాబాద్ను కేంద్రంగా మారుస్తామని మంత్రి శ్రీధర్బాబు తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి
Chiranjeevi: ఎక్స్ పీరియం పార్క్ బాగా నచ్చింది.. ఇక్కడ షూటింగ్ చేస్తా
Komatireddy: సినీ ఇండస్ట్రీకి ప్రభుత్వం అండగా ఉంటుంది
HYDRA: హైడ్రాకు ఫిర్యాదులు.. మాజీ ఎమ్మెల్యే ఫెన్సింగ్ నేలమట్టం.. ఎక్కడంటే
Read Latest Telangana News And Telugu News
Updated Date - Jan 28 , 2025 | 04:50 PM