Tirupati News: రక్తమోడుతున్న రైలు పట్టాలు.. ఐదేళ్లలో 436 మంది మృత్యువాత
ABN, Publish Date - Oct 30 , 2025 | 11:37 AM
తిరుచానూరు.. తిరుపతి వెస్ట్ రైల్వే స్టేషన్ మధ్య తరచూ ఎక్కడో ఒక చోట రైలు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఎక్స్ప్రెస్ రైళ్లలో కిక్కిరిసిన ప్రయాణికుల్లో ఉంటున్న జనరల్ బోగీల్లో ఫుట్పాత్పై ప్రమాదకర పరిస్థితుల్లో కూర్చున్న వారిలో పలువురు ప్రమాదవశాత్తు జారి పడి మృతి చెందుతున్నారు.
- ప్రమాదాలు కొన్ని.. బలవన్మరణాలు మరికొన్ని
- ఐదేళ్లలో మృతిచెందింది: 436 మంది
- రైలు నుంచి జారిపడిన ఘటనల్లో: 130 మంది
- పట్టాలు దాటుతూ రైళ్లు ఢీకొనడంతో చనిపోయింది: 65 మంది
- పట్టాలపై పడి ఆత్మహత్య చేసుకుంది: 210 మంది
- గుర్తు తెలియని వారు: మరో 31 మంది
(తిరుపతి, ఆంధ్రజ్యోతి)
- రెండు రోజుల క్రితం తిరుపతి రైల్వే స్టేషన్ ప్లాట్ఫారం నెంబరు 5లో తిరుపతి-కొల్లాపూర్ వెళ్లే హరిప్రియ ఎక్స్ప్రెస్ కదులుతుండగా 45 ఏళ్ల వ్యక్తి రైలు ఎక్కుతున్నారు. ఆ సమయంలో ప్రమాదవశాత్తు కాలు జారి రైలుకు, ప్లాట్ఫారానికి మధ్యలో పడి శరీరం రెండు ముక్కలై మృతి చెందాడు.
- తిరుపతి రైల్వే స్టేషన్ నుంచి రేణిగుంట రైల్వే స్టేషన్ మధ్య రిలయన్స్ అండర్ బ్రిడ్జి సమీపంలో 50 సంవత్సరాల వ్యక్తి ఆత్యహత్య చేసుకుని మృతి చెందాడు.
ఈ రెండూ మచ్చుకు ఉదాహరణలే. తిరుచానూరు.. తిరుపతి వెస్ట్ రైల్వే స్టేషన్ మధ్య తరచూ ఎక్కడో ఒక చోట రైలు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఎక్స్ప్రెస్ రైళ్లలో కిక్కిరిసిన ప్రయాణికుల్లో ఉంటున్న జనరల్ బోగీల్లో ఫుట్పాత్పై ప్రమాదకర పరిస్థితుల్లో కూర్చున్న వారిలో పలువురు ప్రమాదవశాత్తు జారి పడి మృతి చెందుతున్నారు. ఇంకొందరు ప్రయాణికులు పట్టాలు దాటే సమయంలో.. రైలు దగ్గరకు వచ్చే సరికి వెళ్లిపోవచ్చని అనుకుంటారు. ఇలా పలువురు ప్రమాదకర పరిస్థితుల్లో పట్టాలు దాటుతూ మృతి చెందుతున్నారు.
పూర్ణకుంభం సమీపంలోని రైల్ ఓవర్ బ్రిడ్జి వద్ద.. అటు పద్మావతి మహిళా వర్సిటీ సమీపంలో.. మరోవైపు స్టేషన్లో రైలు షంటింగ్ చేసే సమయంలో ఎక్కువగా చనిపోతున్నారు. ప్రతి నెలా సగటున 5 నుంచి 8 మంది వివిధ కారణాలతో మత్యువాతపడుతున్నారు. ఇలా ఐదేళ్లలో 436 మంది చనిపోగా.. వీరిలో 31 మంది గుర్తు తెలియని వ్యక్తులే. వీరి వివరాలు తెలియక అనాధ శవాలుగా ఖననం చేస్తున్నారు.
అవగాహన కల్పిస్తున్నాం..
రైలు ప్రమాదాల నివారణలో భాగంగా రైల్వే పోలీసులు, ఆర్ఫీఎఫ్ పోలీసులు, సంయుక్తంగా రైల్వే స్టేషన్లలో ప్రయాణికులకు అవగాహన కల్పిస్తున్నాం. రైలు వచ్చే సమయంలో మైకు ద్వారా అప్రమత్తం చేస్తున్నాం.
- ఆశీర్వాదం, రైల్వే సీఐ
ఈ వార్తలు కూడా చదవండి..
జూబ్లీహిల్స్.. భిన్నంగా ఓటర్ పల్స్!
బీఆర్ఎస్ గెలిస్తే మూడేళ్లు ఆగాల్సిన అవసరం రాకపోవచ్చు
Read Latest Telangana News and National News
Updated Date - Oct 30 , 2025 | 11:37 AM