Ananthapuram News: మెరుగు పేరుతో.. బంగారం గొలుసు చోరీ
ABN, Publish Date - Dec 25 , 2025 | 01:05 PM
మెరుగు పెడతామంటూ.. గ్రామాల్లో తిరుగుతూ బంగారం గొలుసు ఎత్తుకెళ్లిన సంఘటన అనంతపురం జిల్లా ఉరవకొండలో చోటుచేసుకుంది. గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు గ్రామంలోకి వచ్చి ఇత్తడి సామాన్లకు మెరుగు పెడతామని చెబుతూ మోసాలకు పాల్పడ్డారు. వివరాలిలా ఉన్నాయి.
ఉరవకొండ(అనంతపురం): ఇత్తడి సామాన్లకు మెరుగు పెడతామని మాయమాటలు చెప్పి బంగారు గొలుసును చోరీ చేసిన సంఘటన నింబగల్లు(Nimbakallu) గ్రామంలో బుధవారం జరిగింది. గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు నింబగల్లు గ్రామంలో పలు ఇళ్ల వద్దకు వెళ్లి వెండి, ఇత్తడి సామాన్లకు మెరుగు పెడతామని చెప్పారు. ఈక్రమంలోనే స్వరూప, బాబు దంపతుల ఇంటి వద్దకు వెళ్లి దేవుడి సామాన్లకు మెరుగు పెడతామని చెప్పారు. దీంతో వారు ఇత్తడి సామాన్లు ఇచ్చారు. స్వరూప మెడలోని బంగారు గొలుసును చూసి అది నల్లగా అయిందని, మెరుగుపెట్టి ఇస్తామని చెప్పారు.
వారు తటపటాయించడంతో మీరే మెరుగు పరుచుకోండి అంటూ కొంత పౌడర్ ఇచ్చారు. దీంతో ఆ దంపతులు ఇంటిలోని వంట గదిలో బంగారం గొలుసు మెరుగు పరుస్తుండగా దుండగులు అక్కడకు వెళ్లారు. చూసి ఇస్తామని గొలుసు చేతిలోకి తీసుకుని ఉడాయించారు. బంగారు గొలుసు రెండున్నర తులాల దాకా ఉంటుందని బాధితులు తెలిపారు. సీఐ మహానంది సంఘటనా స్థలానికి వెళ్లి విచారణ చేపట్టారు. దుండగులు వెళ్లిన ప్రదేశాల్లో సీసీ కెమెరాల ద్వారా గుర్తించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఎల్వీఎం 3 ఎం6కి అనంత్ టెక్నాలజీస్ పరికరాలు
సబ్బుల్లో నంబర్ 1 బ్రాండ్గా సంతూర్
Read Latest Telangana News and National News
Updated Date - Dec 25 , 2025 | 01:32 PM