CM Chandrababu: సంక్షోభాలను అవకాశాలుగా మలచుకుంటేనే అభివృద్ధి: సీఎం చంద్రబాబు
ABN, Publish Date - Jul 23 , 2025 | 12:39 PM
యూఏఈ అభివృద్ధిలో భారత్ భాగస్వామ్యం ఉండటం సంతోషకరమని ఏపీ సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. దుబాయ్లో ఎడారి ప్రాంతాలు, బీచ్లు పర్యాటకులకు ఆహ్లాదకర అనుభూతిని కలిగిస్తాయని తెలిపారు. దుబాయ్ను చూస్తుంటే తనకు అసూయ వేస్తోందని పేర్కొన్నారు.
విజయవాడ: సంక్షోభాలను అవకాశాలుగా మలచుకుంటేనే అభివృద్ధి సాధ్యమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) ఉద్ఘాటించారు. ఆర్థిక సంస్కరణలు, 1995లో టెక్నాలజీ రివల్యూషన్తో పరిస్థితి మారిందని తెలిపారు. ఏడారి నుంచి స్వర్గాన్ని సృష్టించిన దేశం దుబాయ్ అని కొనియాడారు. సరికొత్త ఆలోచనలతోనే కొత్త ఆవిష్కరణలు సాధ్యమని నొక్కిచెప్పారు. వికసిత్ భారత్తో 2047 నాటికి మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ ఎదుగుతోందని వ్యాఖ్యానించారు. ఏపీలో 2026 జనవరి నాటికి క్వాంటమ్ కంప్యూటింగ్ వ్యాలీ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. యూఏఈ అభివృద్ధిలో భారత్ భాగస్వామ్యం హర్షణీయమని అన్నారు. దుబాయ్ను చూస్తుంటే తనకు అసూయ వేస్తోందని పేర్కొన్నారు సీఎం చంద్రబాబు.
దుబాయ్లో ఎడారి ప్రాంతాలు, బీచ్లు పర్యాటకులకు ఆహ్లాదకర అనుభూతిని కలిగిస్తాయని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. 1991లో ఆర్థిక సంస్కరణలు,.. 1995లో టెక్నాలజీ రివల్యూషన్తో పరిస్థితి మారిందని పేర్కొన్నారు. ఏపీలో పెట్టుబడులు ప్రోత్సహించడమే లక్ష్యంగా పారిశ్రామిక వేత్తలతో ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ(బుధవారం జులై 23) విజయవాడలో సమ్మిట్ నిర్వహించారు. యూఏఈ పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా ఈ సదస్సు జరిగింది. భారత్ - యూఏఈ ఆర్థిక సంబంధాల బలోపేతంపై చర్చించారు. పెట్టుబడులకు ముఖద్వారంగా ఏపీ అనే అంశంపై సీఎం మాట్లాడారు. ఈ సమావేశంలో ఇన్వెస్టోపియా సీఈఓ డాక్టర్ జీన్ ఫేర్స్, సీఐఐ వైస్ ప్రెసిడెంట్, భారత్ బయోటెక్ ఎండీ డాక్టర్ సుచిత్ర కె.ఎల్ల, పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు ప్రసంగించారు.
ఇండియాను వ్యాపార పరంగా విస్మరించలేరు..
‘నేను జనవరిలో అబ్దులా బిన్ను కలిశాను.. అప్పడు ముందు ఏపీకి రావాలని కోరాను. ఏపీ గురించి మీకు అప్పుడే అర్ధం అవుతుందని చెప్పాను. ఇచ్చిన మాట ప్రకారం ఆయన ముందు ఆంధ్రప్రదేశ్కే వచ్చారు. యూఏఈని ఓ దేశంగా చూస్తే ప్రతి దేశానికి కొంత అడ్వంటేజ్ ఉంటుంది. దుబాయ్ ప్రాంతంలో 50 డిగ్రీల టెంపరేచర్, ఎడారి ఉన్నా ఆ ప్రాంతాన్ని వారు స్వర్గంలా మార్చారు. అక్కడి అభివృద్ధిని చూశానని.. వారు ఇంటర్నెట్ సిటీకి రూపకల్పన చేస్తే.. నేను హైటెక్ సిటీ ఏర్పాటు చేశా. 2021లో మనం కరోనా వల్ల భయపడ్డాం.. ఆ సమయంలో యూఏఈ ఇస్టోపియాను తీసుకువచ్చారు. డిఫరెంట్గా ఆలోచిస్తే మనం ఉన్నత శిఖరాలకు చేరుకుంటాం. 1.1కోట్ల మంది యూఏఈ జనాభాలో 40శాతం మంది ఇండియన్స్. వారి ద్వారా కూడా యూఏఈలో అభివృద్ధి జరుగుతుంది. మనకు అక్కడ అవకాశాలు వస్తున్నాయి. ఇండియాను ఎవ్వరూ వ్యాపార పరంగా విస్మరించలేరు. డెమోగ్రఫిక్, డివిడెంట్ కేవలం ఇండియాకు మాత్రమే ఉంది. చాలా దేశాలు వయస్సు సమస్యతో ఇబ్బందులు పడుతున్నాయి. ఇండియాలో సరైన సమయంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఉన్నారు’ అని సీఎం చంద్రబాబు ఉద్ఘాటించారు.
ఇండియా ప్రపంచంలోనే నెంబర్ వన్
‘2024 నుంచి 2025లో వంద బిలియన్ యూఎస్ డాలర్ల వ్యాపారం యూఏఈకి ఇండియాకు మధ్య జరిగింది. గత పదేళ్లగా 11వ స్ధానం నుంచి నాల్గో స్ధానానికి ఇండియా చేరుకుంది. 2047కి ఇండియా ప్రపంచంలోనే నెంబర్ వన్ అవుతుంది. ఆదిశగా మేము ప్రయత్నం చేస్తున్నాం. జనవరి 1వ తేదీ నాటికి మొదటి క్వాంటం కంప్యూటింగ్ ఏపీ నుంచి పనిచేస్తుంది. 575 సర్వీసులు ప్రస్తుతం వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ఇస్తున్నాం ఆగష్టు 15వ తేదీ నాటికి ఈ సంఖ్య 100శాతానికి చేరుతుంది. మీరు ఇండియాలో పెట్టుబడులు పెడితే అన్ని అనుమతులు ఆన్లైన్ ద్వారా ఇస్తాం. మీరు ఏ ప్రభుత్వ ఆఫీసులకు వెళ్లాల్సిన అవసరం లేదు. మా హ్యాండ్ హోల్డింగ్ ఉంటుంది. రాష్ట్రంలో పేదలను పైకి తెచ్చేందుకు పీ4ను తీసుకువచ్చాం. వందశాతం పేదరిక నిర్మూలనే మా లక్ష్యం... దుబాయ్, యూఏఈ ప్రభుత్వాలు ఈ విషయంలో చాలా బాగా పనిచేశాయి. లులూకు ఎంతో డిమాండ్ ఉందని... వెంకయ్యనాయుడు ఉపరాష్ట్రపతి కాకముందు లులూ నిర్వాహకులని ఏపీకి రావాలని ఐదుసార్లు కోరానని... వారు నన్ను కొచ్చి వచ్చి షాపింగ్ మాల్ చూడాలని అడిగారు’ అని సీఎం చంద్రబాబు గుర్తుచేశారు.
హైపర్ మాల్ పెట్టాలి..
‘విశాఖపట్నంతో పాటు విజయవాడ, అమరావతిలో కూడా హైపర్ మాల్ పెట్టాలని అడుగుతున్నా. సంపద సృష్టిలో పెట్టుబడి దారుల పాత్ర ఎంతో ముఖ్యం. గతంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మా నినాదం.. ఇప్పుడు స్పీడ్ ఆఫ్ డూయింగ్ నినాదం. ఏపీకి యూనిక్ అడ్వాంటేజ్లు ఉన్నాయి. 1000 కిలోమీటర్లు తీరప్రాంతం ఉంది. ఉత్తర, దక్షిణ భారత దేశాలను రైల్వే ద్వారా కలిపేది విజయవాడ మాత్రమే. ఇతర రాష్ట్రాల ప్రభుత్వాలు మన పోర్టుల ద్వారా కనెక్ట్ కావాలని అనుకుంటున్నాయి. ఏ ఇతర రాష్ట్రాలు పెట్టుబడిదారులకు ఇంత బలాన్ని ఇవ్వలేదు. సోలార్, విండ్, పంప్డ్ ఎనర్జీ, పోర్టులు ఉండటం అమ్మోనియా, గ్రీన్ ఎనర్జీలకు ఎంతో కీలకం అవుతాయి. మొదటి హైడ్రోజన్ వ్యాలీ ఏపీ నుంచి వస్తుంది. పాపికొండలు, అరకు వ్యాలీ, లంబసింగి లాంటి ప్రాంతాలు మదనపల్లి, అనేక దేవాలయాలు రాష్ట్రంలో ఉన్నాయి. త్వరలోనే విజయవాడ నుంచి మక్కా వరకూ నేరుగా విమానం పంపుతాం. కమర్షియల్, హస్పిటాలిటీ, టూరిజంలలో అనేక ఉపయోగాలు ఉన్నాయి. త్వరలోనే విశాఖకు గూగుల్ వస్తుందని.. ప్రపంచంలోనే అతిపెద్ద డేటాసెంటర్ పెడుతోంది’ అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
రైతులను ఇబ్బంది పెడితే కఠిన చర్యలు
వచ్చే 3 రోజులు అతి భారీ వర్షాలు
Read latest AP News And Telugu News
Updated Date - Jul 23 , 2025 | 01:30 PM