CM Chandrababu: రక్షణ, ఏరోస్పేస్ రంగంలో నూతన ఆవిష్కరణలకు కేంద్రంగా ఏపీ: సీఎం చంద్రబాబు
ABN, Publish Date - Jun 23 , 2025 | 08:48 PM
రక్షణ, ఏరోస్పేస్ రంగంలో నూతన సాంకేతికత, నవీన ఆవిష్కరణలకు ఏపీ కేంద్రంగా మారేలా ప్రయత్నించాలని ఏపీ సీఎం చంద్రబాబు సూచించారు. ఆపరేషన్ సిందూర్లో భారతదేశం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించిందని అన్నారు. రానున్న రోజుల్లో టెక్నాలజీ ప్రధాన పాత్ర పోషిస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు.
అమరావతి: రక్షణ, ఏరోస్పేస్ రంగంలో నూతన ఆవిష్కరణలకు కేంద్రంగా ఏపీ ఉండాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (AP CM Nara Chandrababu Naidu) సూచించారు. రక్షణ, అంతరిక్ష రంగంలో ఏపీలో భారీగా పెట్టుబడులు పెట్టి ఆకట్టుకునేలా చేయాలని కోరారు. ఈ మేరకు ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ పాలసీ ఉండాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఏపీ సచివాలయంలో ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ పాలసీ 4.0 (2025-2030)పై ముఖ్యమంత్రి ఇవాళ(సోమవారం) సమీక్ష సమావేశం నిర్వహించారు. నూతనంగా తీసుకువచ్చే పాలసీ ద్వారా వచ్చే ఐదేళ్లలో రూ.50 వేల కోట్ల నుంచి లక్ష కోట్ల రూపాయల వరకు పెట్టుబడులను ఆకర్షించాలని అధికారులకు సీఎం చంద్రబాబు లక్ష్యాన్ని నిర్దేశించారు.
రక్షణ, ఏరోస్పేస్ రంగంలో నూతన సాంకేతికత, నవీన ఆవిష్కరణలకు ఏపీ కేంద్రంగా మారేలా ప్రయత్నించాలని సీఎం చంద్రబాబు సూచించారు. ఆపరేషన్ సిందూర్లో భారతదేశం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించిందని అన్నారు. రానున్న రోజుల్లో టెక్నాలజీ ప్రధాన పాత్ర పోషిస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఈ తరహా సాంకేతికతను రక్షణ పరంగా వినియోగించుకోవడంతో పాటు వాణిజ్య స్థాయిలో ఉత్పత్తి చేసి, దైనందిన జీవితంలో కూడా ఉపయోగపడేలా తీర్చిదిద్దాలని సూచించారు. దేశరక్షణ, అంతర్గత శాంతి భద్రతలకు సంబంధించి భవిష్యత్లో విస్తృత అవకాశాలు ఉన్నాయని... ఈ రంగాల్లో పరిశ్రమల ఏర్పాటుకు నూతన పాలసీ దోహదపడాలని సీఎం సూచించారు. నేషనల్ సెక్యూరిటీకి ప్రాధాన్యం ఇచ్చేలా పలు మార్పులను ముఖ్యమంత్రి సూచించారు. ఏరో స్పేస్ అండ్ డిఫెన్స్ సలహాదారు సతీష్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ సమీక్షకు హాజరై పలు సూచనలు చేశారు.
మిగతా రాష్ట్రాల కంటే ఈ రంగంలోని ఎంఎస్ఎంఈలను ప్రత్యేకంగా ప్రోత్సహించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ఇందుకోసం ఏడాదికి ప్రత్యేకంగా రూ.100 కోట్లతో కార్పస్ ఫండ్ ఏర్పాటు చేయడంతో పాటు, లాజిస్టిక్స్ సబ్సిడీ వంటివి నూతన పాలసీలో పొందుపర్చాలని సీఎం సూచించారు. ఎంఎస్ఎంఈలను బలోపేతం చేయాలని, అనుంబంధ పరిశ్రమల్లో ఉత్పత్తుల నాణ్యతలో బెంచ్మార్క్ ఉండేలా చూడాలని కోరారు. అలాగే మార్కెటింగ్, బ్రాండింగ్ ముఖ్యమని... వన్ ఫ్యామిలీ, వన్ ఎంట్రప్రెన్యూర్ ఆశయం సాకారం కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు తెలిపారు. విశాఖపట్నం- శ్రీకాకుళంలో నావల్ క్లస్టర్.... జగ్గయ్యపేట- దొనకొండ ప్రాంతంలో మిస్సైల్, ఆయుధాల ఉత్పత్తులు.... కర్నూలు- ఓర్వకల్లులో మానవ రహిత విమానాలు, డ్రోన్ల తయారీ... లేపాక్షి- మడకశిర క్లస్టర్లో ఏరోస్పేస్, ఎలక్ట్రానిక్స్.... పరిశ్రమలకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని, తిరుపతిని రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ హబ్గా తీర్చిదిద్దాలని, అలాగే డీఆర్డీవో సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ నెలకొల్పాలని ముఖ్యమంత్రి సూచించారు. మరోవైపు మడకశిర క్లస్టర్లో భారత్ ఫోర్జ్, ఎంఎండబ్ల్యూ సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నాయని, త్వరలోనే శంకుస్థాపన చేయనున్నాయని ముఖ్యమంత్రి అధికారులకి వివరించారు.
జాతీయ రక్షణ ఉత్పత్తుల విలువ ఏడాదికి రూ.1.27 లక్షల కోట్లు ఉండగా, ఇందులో రక్షణ రంగానికి చెందిన ప్రభుత్వ రంగా సంస్థల వాటా 73 శాతం కలిగి ఉన్నాయని వివరించారు. 21 శాతం విలువైన ఉత్పత్తులు ప్రైవేట్ రంగం నుంచి వస్తున్నాయని వెల్లడించారు. మిగిలిన 7 శాతం ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంలో ఉత్పత్తి అవుతున్నాయని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. అయితే, ప్రస్తుతం ఏపీలో ఏరో స్పేస్ అండ్ డిఫెన్స్ క్లస్టర్లో 23 సంస్థలు, రూ.22 వేల కోట్ల పెట్టుబడులు పెట్టాయి. దీంతో 17 వేల మందికి ఉపాధి లభించింది. ఈ సమీక్షా సమావేశంలో మంత్రులు కొండపల్లి శ్రీనివాస్, టీజీ భరత్, వాణిజ్య, పరిశ్రమల శాఖ కార్యదర్శి యువరాజ్, తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి:
దూకుడు పెంచిన సిట్.. మాజీ సీఎస్ కీలక వాంగ్మూలం
For More Andhrapradesh News and Telugu News
Updated Date - Jun 23 , 2025 | 09:12 PM