ICMR: ఉప్పు ముప్పు తగ్గిద్దాం!
ABN, Publish Date - Jul 14 , 2025 | 03:50 AM
వంటలో అన్నీ వేసి చూడు.. నన్ను వేసి చూడు’ అంటుంది ఉప్పు. నాలుకకు రుచి తగలాలంటే ఉప్పు ఉండాల్సిందే. కానీ ఆ ఉప్పు ముప్పుగా మారిందని, నిశ్శబ్ద మహమ్మారికి ఊపిరి పోస్తోందని ఐసీఎంఆర్
అడ్డగోలుగా ఉప్పు వాడుతున్న భారతీయులు
రోజూ వాడాల్సింది 5 గ్రాములకన్నా తక్కువ
వాడుతున్నది 9.2 గ్రాములపైనే
పెరిగిపోతున్న అధిక రక్తపోటు, గుండె, కిడ్నీ సంబంధ సమస్యలు
ఎన్ఐఈ శాస్త్రవేత్తల ఆందోళన
తెలంగాణ, పంజాబ్ రాష్ట్రాల్లో కొనసాగుతున్న అధ్యయనం
హైదరాబాద్, జూలై 13 (ఆంధ్రజ్యోతి): ‘వంటలో అన్నీ వేసి చూడు.. నన్ను వేసి చూడు’ అంటుంది ఉప్పు. నాలుకకు రుచి తగలాలంటే ఉప్పు ఉండాల్సిందే. కానీ ఆ ఉప్పు ముప్పుగా మారిందని, నిశ్శబ్ద మహమ్మారికి ఊపిరి పోస్తోందని ఐసీఎంఆర్ (భారత వైద్య పరిశోధన మండలి)కు చెందిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎపిడెమియాలజీ (ఎన్ఐఈ) నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా ప్రతి వ్యక్తి రోజుకు 5 గ్రాముల కంటే తక్కువ ఉప్పు తీసుకోవాలని, కానీ భారత్లోని పట్టణ ప్రాంతాల్లో సగటున 9.2 గ్రాములు, గ్రామీణ ప్రాంతాల్లో 5.6 గ్రాముల ఉప్పు తీసుకుంటున్నారని చెబుతున్నారు. ఇలా పరిమితికి మించి ఉప్పు వినియోగంతో అధిక రక్తపోటు, గుండె, మూత్రపిండాల సంబంఽధిత సమస్యలు విపరీతంగా పెరిగిపోతున్నాయని చెబుతున్నారు. దీనికి సంబంధించి ఐసీఎంఆర్ ఎన్ఐఈ నిపుణులు తెలంగాణ, పంజాబ్ రాష్ట్రాల్లో మూడేళ్ల అధ్యయనాన్ని చేపట్టారు.
చిన్న మార్పుతో పెద్ద ప్రయోజనం..
ఉప్పు వినియోగం, ప్రత్యామ్నాయాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఎన్ఐఈ ‘పించ్ ఫర్ ఏ చేంజ్’ నినాదంతో ప్రచారం చేస్తోంది. ఉప్పు విషయంలో ఒక చిన్నమార్పుతో పెద్ద ప్రయోజనం ఉంటుందని ఎన్ఐఈ నిపుణులు చెబుతున్నారు. ‘‘మేం ఆరోగ్య సంరక్షణ కేంద్రాలలోని ఆరోగ్య కార్యకర్తలతో కలిసి పనిచేస్తున్నాం. ఉప్పు వినియోగం తగ్గించే అంశంపై అందరికీ తగిన అవగాహన కల్పించేలా వారికి కౌన్సెలింగ్ పద్ధతులు వివరిస్తున్నాం. ప్రజలను మంచి మార్పు వైపు నడిపించేందుకు ప్రయత్నిస్తున్నాం. ఉప్పు వాడకం తగ్గించడంలో కౌన్సెలింగ్ ప్రభావాన్ని అంచనా వేస్తున్నాం..’’ అని డాక్టర్ గణేశ్ వివరించారు. సోడియం తక్కువగా ఉండే ఉప్పును వినియోగిస్తే.. రక్తపోటు సగటున 7/4 ఎంఎంహెచ్జీ మేర తగ్గుతుందని డాక్టర్ శరణ్ మురళి చెప్పారు. ఉప్పు (సోడియం క్లోరైడ్)లోని సోడియం మనలో రక్తపోటును పెంచుతుందని... ఉప్పులో కొంత సోడియంను తగ్గించి రుచిలో మార్పు రాకుండా ఆ మేర పొటాషియం లేదా మెగ్నీషియం లవణాలను కలిపిన ఉప్పును వినియోగించవచ్చని తెలిపారు.
తక్కువ సోడియం ఉప్పు... లభ్యత , ధరతో సమస్య
సోడియం తక్కువగా ఉన్న ఉప్పు లభ్యత, ధర విషయంలో సమస్య ఉందని ఎన్ఐఈ తెలిపింది. చెన్నైలోని 300 రిటైల్ దుకాణాల్లో పరిశీలన చేపట్టగా.. 28శాతం రిటైల్ దుకాణాల్లో, 52శాతం సూపర్ మార్కెట్లలో మాత్రమే ఈ తరహా ఉప్పు లభిస్తోందని తెలిపింది. ఎక్కువ మంది ప్రజలు ఆశ్రయించే చిన్న కిరాణా దుకాణాల్లో 4 శాతం దుకాణాల్లో మాత్రమే ఈ ఉప్పు అందుబాటులో ఉందని పేర్కొంది. ఇక తక్కువ సోడియం ఉప్పు ధర ఎక్కువగా ఉండటమూ సమస్యగా మారిందని తెలిపింది. 100 గ్రాముల సాధారణ ఉప్పు ధర రూ.2.7 ఉంటే.. సోడియం తక్కువున్న ఉప్పు ధర రూ. 5.6గా ఉందని పేర్కొంది.
డెంగ్యూ వ్యాక్సిన్ మూడో దశ ట్రయల్స్!
దేశీయంగా అభివృద్ధి చేస్తున్న మొట్టమొదటి డెంగ్యూ వ్యాక్సిన్ మూడో దశ క్లినికల్ ట్రయల్స్ త్వరలో చేపట్టనున్నట్టు ఐసీఎంఆర్ శాస్త్రవేత్తలు వెల్లడించారు. దేశవ్యాప్తంగా 20 కేంద్రాల్లో ట్రయల్స్ జరుగుతున్నాయని తెలిపారు. డెంగ్యూ రాకుండా ఒకసారి తీసుకొనే (వన్ షాట్) ‘డెంగీఆల్’ వ్యాక్సిన్ను పనాసియా బయోటెక్ కంపెనీ అభివృద్ధి చేసింది. ఐసీఎంఆర్ ఆధ్వర్యంలో ఈ వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయి. ప్రస్తుతం భారత్లో డెంగ్యూకు ఎలాంటి యాంటీ వైరల్ చికిత్స లేదు. ఈ వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే ప్రయోజనం కలగనుంది.
ఈ వార్తలు కూడా చదవండి
వికసిత్ తెలంగాణ బీజేపీకే సాధ్యం
Read Latest Telangana News And Telugu News
Updated Date - Jul 14 , 2025 | 03:50 AM