CM Revanth Reddy: విద్యా వ్యవస్థను మరింత పటిష్టం చేయాలి.. అధికారులకు సీఎం రేవంత్రెడ్డి కీలక ఆదేశాలు
ABN, Publish Date - Jun 25 , 2025 | 08:48 PM
విద్యా వ్యవస్థను మరింత పటిష్టం చేయాలని సీఎం రేవంత్రెడ్డి సూచించారు. పాఠశాలల్లో అవసరమైన మేర నూతన గదులు నిర్మించాలని ఆదేశించారు. పాఠశాలల్లో సోలార్ కిచెన్లు ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్రెడ్డి సూచించారు.
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి (CM Revanth Reddy) ఇవాళ(బుధవారం) రాష్ట్ర సచివాలయంలో విద్యాశాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులతో పలు కీలక అంశాలపై ముఖ్యమంత్రి చర్చించారు. ఈ నేపథ్యంలో అధికారులకు సీఎం రేవంత్రెడ్డి కీలక ఆదేశాలు ఇచ్చారు. అనంతరం మీడియాతో సీఎం రేవంత్రెడ్డి మాట్లాడారు. విద్యా వ్యవస్థను మరింత పటిష్టం చేయాలని సూచించారు. జిల్లాల్లోని ఐఏఎస్ అధికారులు వారానికి రెండు పాఠశాలలను సందర్శించాలని నిర్దేశించారు. పాఠశాలల్లో అవసరమైన మేర నూతన గదులు నిర్మించాలని ఆదేశించారు. పాఠశాలల్లో సోలార్ కిచెన్లు ఏర్పాటు చేయాలని సూచించారు. పదో తరగతి ఉత్తీర్ణులైన ప్రతి ఒక్కరూ ఇంటర్మీడియట్లో చేరేలా చూడాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పేర్కొన్నారు.
అసంపూర్తిగా ఉన్న పనులను త్వరగా పూర్తి చేయాలి...
మున్సిపల్ అడ్మినిస్టేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. వివిధ అభివృద్ధి పనుల్లో పురోగతిపై పూర్తి వివరాలను సీఎంకు అధికారులు వివరించారు. జీహెచ్ఎంసీ పరిధిలో కొనసాగుతున్న తాగునీటి సరఫరా, సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ పనుల ప్రస్తుత పరిస్థితిపై చర్చించారు. అసంపూర్తిగా ఉన్న పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. నగరంలో శానిటేషన్ విషయంలో నిర్లక్ష్యం వహించవద్దని సీఎం అన్నారు. డెంగ్యూ, చికున్ గున్యా లాంటి సీజనల్ వ్యాధులు వ్యాపించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. రోడ్డుపై నీరు నిలిచే ప్రాంతాలను గుర్తించి ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. వానాకాలంలో డ్రైనేజ్ ఓవర్ ఫ్లో ఉండకుండా గట్టి చర్యలు తీసుకోవాలని కోరారు. తాగునీరు కలుషితం కాకుండా చూడటంతో పాటు, దోమల నివారణకు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. సిటీ అభివృద్ధి పనులకు సంబంధించి పూర్తి వివరాలను ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు.
ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న కోర్ అర్బన్ రీజియన్లో భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రణాళికలు రూపొందించుకోవాలని అధికారులకు సూచించారు. తాగునీటి సరఫరా, డ్రైనేజ్, రోడ్లు, మెట్రో కనెక్టివిటీ, ఎలివేటెడ్ కారిడార్లకు సంబంధించి పూర్తి ప్రణాళికలతో రావాలని సీఎం ఆదేశించారు. పెరుగుతున్న నగర జనాభా అవసరాలకు అనుగుణంగా రాబోయే 25 సంవత్సరాలను దృష్టిలో ఉంచుకుని ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు. కోర్ అర్బన్ రీజియన్కు సంబంధించి ప్రత్యేకంగా సమగ్ర పాలసీ తయారుచేయాలని అధికారులను ఆదేశించారు. కోర్ అర్బన్తో పాటు సెమీ అర్బన్, రూరల్ ఏరియాలపైనా ఒక స్పష్టమైన విధానంతో ముందుకెళ్లేందుకు అవసరమైన ప్రణాళికలు రూపొందించే దిశగా చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఈ సమీక్షలో సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, సీఎం సెక్రటరీ మాణిక్ రాజ్, HMDA పరిధిలోని MA&UD సెక్రటరీ ఇలంబర్తి, జిల్లా HMDA కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్, జీహెచ్ఎంసీ కమిషనర్ RV కర్ణన్, FCDA కమిషనర్ కె. శశాంక, HMWSSB ఎండీ అశోక్ రెడ్డి, MRDCL ఎండీ ఈవీ నర్సింహారెడ్డి, మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
యాంటీ డ్రగ్స్ డే ర్యాలీ.. డ్రగ్స్ నివారణ పోస్టర్లు విడుదల
ఫోన్ ట్యాపింగ్ కేసు.. తవ్వేకొద్దీ బయటపడుతున్న నిజాలు
Read latest Telangana News And Telugu News
Updated Date - Jun 25 , 2025 | 09:59 PM