JNTU: ఆ ఎంఓయూతో విద్యార్థులకు మేలే..
ABN, Publish Date - Aug 13 , 2025 | 10:07 AM
జర్మనీలోని రౌట్లింగన్ యూనివర్సిటీతో జేఎన్టీయూ కుదుర్చుకున్న ఎంఓయూ ప్రోగ్రామ్లన్నీ విద్యార్థులకు మేలు చేకూర్చేవేనని వీసీ కిషన్కుమార్ రెడ్డి స్పష్టం చేశారు.
- రౌట్లింగన్ కోర్సులపై జేఎన్టీయూ వీసీ స్పష్టత
హైదరాబాద్ సిటీ: జర్మనీలోని రౌట్లింగన్ యూనివర్సిటీతో జేఎన్టీయూ కుదుర్చుకున్న ఎంఓయూ ప్రోగ్రామ్లన్నీ విద్యార్థులకు మేలు చేకూర్చేవేనని వీసీ కిషన్కుమార్ రెడ్డి(VC Kishan Kumar Reddy) స్పష్టం చేశారు. రౌట్లింగన్ ఫేక్ యూనివర్సిటీ అని, అక్కడ నిర్వహించే (ఎంవోయూ)కోర్సులు కూడా ఫేక్ అని జరుగుతున్న ప్రచారం నేపథ్యంలో ఆయన జేఎన్టీయూలో మంగళవారం ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో వివరణ ఇచ్చారు.
రౌట్లింగన్తో తాము చేసుకున్న అవగాహన ఒప్పందాలు పూర్తిగా చెల్లుబాటు అవుతాయని, విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చెందవద్దని భరోసానిచ్చారు. ఎవరికైనా సందేహాలు ఉంటే నేరుగా జేఎన్టీయూ అధికారులను సంప్రదించాలని సూచించారు. 20 ఏళ్లుగా ప్రసిద్ధమైన యూనివర్సిటీలతో జేఎన్టీయూ ఒప్పందాలను కలిగి ఉందన్నారు.
జర్మనీ వర్సిటీలకు సీఈఓలే అధిపతులు
జర్మన్ విద్యా వ్యవస్థలో, పరిశ్రమ-ఆధారిత కార్యక్రమాలు నిర్వహించే విశ్వవిద్యాలయాలకు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసరు (సీఈఓ), మేనేజింగ్ డైరెక్టర్ (ఎండీ)లు అధిపతులుగా ఉంటారని వీసీ కిషన్కుమార్ రెడ్డి వివరించారు. ఈ విధానం 70 సంవత్సరాలకు పైగా జర్మనీలో అమలవుతోందని పేర్కొన్నారు. అంతర్జాతీయ విద్యార్థులకు సుమారు రూ.26 లక్షల ఫీజు ఉండగా, జేఎన్టీయూ ఎంఓయూ ద్వారా వెళ్లే విద్యార్థులకు రూ.18లక్షలకు తగ్గించగలిగామని చెప్పారు.
జర్మనీ యూనివర్సిటీలతో జేఎన్టీయూ ఒప్పందాల (ఎంఓయూ) పత్రాలను అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయన్నారు. విలేకరుల సమావేశంలో రెక్టార్ విజయకుమార్ రెడ్డి, రిజిస్ట్రార్ వెంకటేశ్వరరావు, అకడమిక్ అండ్ ప్లానింగ్ విభాగం డైరెక్టర్ కామాక్షిప్రసాద్, అడ్మిషన్ల విభాగం డైరెక్టర్ బాలు నాయక్, క్యాంపస్ కళాశాల ప్రిన్సిపాల్ నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
మరుగుదొడ్డిలో 16 అడుగుల కింగ్ కోబ్రా
నేడు దేశంలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
Read Latest Telangana News and National News
Updated Date - Aug 13 , 2025 | 10:07 AM