JNTU: నాన్ టీచింగ్ పోస్టుల్లో 40 మంది ప్రొఫెసర్లు
ABN, Publish Date - Nov 13 , 2025 | 08:01 AM
జేఎన్టీయూలో బోధనేతర (నాన్టీచింగ్) పోస్టుల్లో సుమారు 40 మంది ప్రొఫెసర్లు పని చేస్తుండడాన్ని జేఎన్టీయూహెచ్ తెలంగాణ ఉద్యోగుల సంఘం తీవ్రంగా ఆక్షేపిస్తోంది.
- అధిక వేతనాల రూపంలో జేఎన్టీయూ నిధుల దుర్వినియోగం
- యూనివర్సిటీలో దుస్థితిపై గవర్నర్కు ఉద్యోగుల సంఘం లేఖ
హైదరాబాద్ సిటీ: జేఎన్టీయూ(JNTU)లో బోధనేతర (నాన్టీచింగ్) పోస్టుల్లో సుమారు 40 మంది ప్రొఫెసర్లు పని చేస్తుండడాన్ని జేఎన్టీయూహెచ్ తెలంగాణ ఉద్యోగుల సంఘం తీవ్రంగా ఆక్షేపిస్తోంది. తక్కువ వేతనాలు ఉండే నాన్టీచింగ్ పోస్టుల్లో అధికంగా వేతనాలు తీసుకునే ప్రొఫెసర్లను నియమించడం వల్ల నిధుల దుర్వినియోగానికి ఆస్కారం ఇచ్చినట్లయిందని, అలాగే, అనుభవజ్ఞులైన సీనియర్ /రెగ్యులర్ ప్రొఫెసర్లు అడ్మినిస్ట్రేషన్ పోస్టులకే పరిమితం కావడంతో కాలేజీల్లో బోధన కుంటుపడి విద్యార్థులకు ఆన్యాయం జరుగుతోందని ఉద్యోగుల సంఘం బుధవారం రాష్ట్ర గవర్నర్కు పంపిన లేఖలో పేర్కొంది.
రిజిస్ట్రార్ పోస్టుతో పాటు పరీక్షల విభాగం డైరెక్టర్, కంట్రోలర్, బైకార్డ్ డైరెక్టర్, దూరవిద్య విభాగం డైరెక్టర్, యూనివర్సిటీ ఇంజనీర్ వంటి పదవులన్నీ నాన్టీచింగ్ ఉద్యోగులు, అధికారులకు చెందాల్సినవేనని లేఖతో పాటు ఆధారాలను జత చేశారు.
యూజీసీ, రాష్ట్ర పీఆర్సీ నిబంధనలకు తూట్లు
రిజిస్ట్రార్ నుంచి పలు డైరెక్టర్ పోస్టుల దాకా నాన్టీచింగ్ ఉద్యోగులకు గరిష్ట వేతనం నెలకు రూ.1.58 లక్షలకు మించకూడదని రాష్ట్ర పీఆర్సీ నివేదికలో ప్రభుత్వం స్పష్టం చేయగా, ప్రస్తుతం ఆయా పదవుల్లో నెలకు రూ.3లక్షల నుంచి 4 లక్షలకు పైగా వేతనం తీసుకుంటున్న ప్రొఫెసర్లు ఉన్నారు.
దీంతో ఏటా కోట్ల రూపాయాల యూనివర్సిటీ నిధులు దుర్వినియోగం అవుతున్నాయని లేఖలో పేర్కొన్నారు. తాము పంపిన లేఖలోని అంశాలను, ఆధారాలను పరిశీలించి జేఎన్టీయూలో యూజీసీ, రాష్ట్ర ప్రభుత్వ పీఆర్సీ నిబంధనలు సక్రమంగా ఆమలు చేసేలా చాన్స్లర్ హోదాలో ఉన్నతాధికారులకు తగిన ఆదేశాలు జారీ చేయాలని జేఎన్టీయూహెచ్ తెలంగాణ బోధనేతర ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు గవర్నర్కు విన్నవించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
సిమెంట్ రంగంలో రూ 1.2 లక్షల కోట్ల పెట్టుబడులు
సైబర్ దాడుల నుంచి రక్షణకు టాటా ఏఐజీ సైబర్ ఎడ్జ్
Read Latest Telangana News and National News
Updated Date - Nov 13 , 2025 | 08:01 AM