Poli Swargam 2025: ఇంతకీ పోలి పాడ్యమి ఎప్పుడు..?
ABN, Publish Date - Nov 19 , 2025 | 06:26 PM
కార్తీకమాసం ఈ అమావాస్యతో అంటే.. నవంబర్ 20వ తేదీతో ముగుస్తోంది. ఆ మరునాడు వచ్చే పాడ్యమిని పోలి పాడ్యమని జరుపుకుంటారు. దీనిని పోలి స్వర్గం అని కూడా అంటారు. అంటే నవంబర్ 21వ తేదీ శుక్రవారం ఈ పోలి పాడ్యమిని జరుపుకుంటారు.
కార్తీకమాసం ఈ అమావాస్యతో అంటే.. నవంబర్ 20వ తేదీతో ముగుస్తోంది. ఆ మరునాడు వచ్చే పాడ్యమిని పోలి పాడ్యమని జరుపుకుంటారు. దీనిని పోలి స్వర్గం అని కూడా అంటారు. అంటే నవంబర్ 21వ తేదీ శుక్రవారం ఈ పోలి పాడ్యమిని జరుపుకుంటారు. ఈ పాడ్యమి నుంచి మార్గశిర మాసం ప్రారంభమవుతుంది. మాసాల్లో మార్గశిరాన్ని నేను అని గీతాచార్యుడు శ్రీకృష్ణ భగవానుడు స్వయంగా తెలిపారు.
తొలి నుంచి ఈ మాసాంతం వరకు అన్ని శుభ తిథులే. ఇక పోలి పాడ్యమి రోజు మహిళలు తెల్లవారుజామున నిద్ర లేచి చెరువులు, నదుల్లో దీపాలు వదులుతారు. ఈ రోజు మరి ముఖ్యంగా పోలి కథను చదువుకోంటారు. చివరి రోజు శివాలయానికి వెళ్ళి మహాశివునికి అభిషేకాలు, పూజలు అత్యంత భక్తి శ్రద్దలతో నిర్వహిస్తారు. ఈ నెలంతా దీపాలు వెలిగిస్తారు. పోలి పాడ్యమి రోజు 30 వత్తులతో దీపాలను వెలిగిస్తారు. అరటి దొప్పలలో దీపాలు వెలిగించి నీటిలో వదులుతారు. అనంతరం మూడు సార్లు నీటిని తోస్తూ నమస్కరించుకుని పోలి స్వర్గం కథ వింటారు.
పోలి కథ
పూర్వం కృష్ణా తీరంలో ఒక ఊరిలో ఉమ్మడి కుటుంబం ఉండేది. ఆ కుటుంబంలో ఐదుగురు కోడళ్ళు ఉండేవారు. వారిలో చిన్న కోడలు పోలికి దైవభక్తి అధికంగా ఉండేది. కానీ ఆమె అత్తకు ఇది అసలు నచ్చేది కాదు. తనంతటి భక్తురాలు వేరొకరు లేరని అత్త అనుకుంటూ ఉండేది. అందుకే పోలిని తక్కువగా చూస్తూ తనను అనుసరించే మిగతా నలుగురు కోడళ్లతో పూజలు, వ్రతాలు నిత్యం చేయించేది. కార్తీక మాసం రాగానే అత్త తన చిన్న కోడలిని మినహా మిగతా వారందరినీ గుడికి తీసుకెళ్లింది.
చిన్న కోడలు దీపం వెలిగించుకునే అవకాశం లేకుండా ఇంట్లో ఏ పూజా సామాగ్రి ఉండనిచ్చేది కాదు. కానీ పోలి మాత్రం పెరట్లో ఉన్న పత్తి చెట్టు నుంచి కొద్దిగా పత్తిని తీసుకుని వత్తులు చేసుకునేది. కవ్వానికి ఉన్న వెన్నని రాసి దీపం వెలిగించేది. ఆ దీపం ఎవరికి కనిపించకుండా దాని మీద బుట్ట బోర్లించేది. ఇలా కార్తీకమాసం అంతా చేసింది. మాసంలో చివరి అమావాస్య రోజు అత్త తన కోడళ్ళతో గుడికి వెళ్తూ పోలికి తీరిక లేకుండా చేయాలని ఇంట్లో పనులన్నీ అప్పగించి వెళ్ళింది. పోలి ఆ పనులన్నీ పూర్తి చేసుకుని దీపం వెలిగించింది.
ఎన్ని అవాంతరాలు వచ్చినా పోలి మాత్రం తన భక్తిని విడిచి పెట్టలేదు. ఆమె భక్తికి దేవతలు మెచ్చి.. ప్రాణాలతో ఉండగానే పోలిని స్వర్గానికి తీసుకు వెళ్లేందుకు పుష్పక విమానాన్ని తీసుకు వస్తారు. గుడి నుంచి తిరిగి వచ్చిన అత్తతోపాటు మిగతా తోడికోడళ్ళు .. తమ కోసమే వారు వచ్చారని భావిస్తారు. కానీ వాళ్లను కాకుండా పోలిని తీసుకెళ్తుంటే అత్త, మిగిలిన తోడి కోడళ్ళు పోలి కాళ్ళు పట్టుకుని వేలాడుతూ వెళ్లేందుకు ప్రయత్నిస్తారు. వారి ప్రయత్నాలు మాత్రం ఫలించవు. కల్మషం లేని పోలికి మాత్రమే స్వర్గలోక ప్రాప్తి ఉందని చెప్పి దేవతలు వారిని విడిచిపెట్టి పోలిని స్వర్గానికి తీసుకు వెళ్తారు.
అయితే పోలి పాడ్యమి రోజు 30 వత్తులతో దీపం వెలిగించాలని పండితులు చెబుతారు. దీని వల్ల కార్తీక మాసం మొత్తం దీపం వెలిగించినంత పుణ్యం కలుగుతుందని అంటారు. అలాగే ఈ రోజు దీప దానం చేయడం కూడా చాలా మంచిదని వివరిస్తున్నారు.
ఉత్తరాంధ్ర ప్రజలు ఇలవేల్పు.. శ్రీ కనక మహాలక్ష్మీ
మార్గశిర మాసం వచ్చిందంటే చాలు తూర్పు తీర నగరం విశాఖపట్నం బురుజుపేటలో కొలువు తీరిన శ్రీకనక మహాలక్ష్మీ అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తుతారు. ఉత్తరాంధ్ర ప్రజల ఇలవేల్పే కాదు.. రాష్ట్ర ప్రజల కొంగు బంగారంగా అమ్మవారిని కొలుస్తారు. ఈ ఆమె వారికి ప్రపంచవ్యాప్తంగా భక్తులు ఉన్నారు. ఈ మాసంలో.. అది గురువారం అత్యంత పవిత్రమైన దినంగా భావిస్తారు. మార్గ శిర గురువారం కనక మహాలక్ష్మీ అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులతో బురుజుపేటలోని ఆలయం జన సంద్రంగా మారుతుంది.
సింహాచలం పుష్కరిణి..
విశాఖపట్నంలోని ప్రముఖ పుణ్య క్షేత్రం సింహాచలం. ఇక్కడి కొండపై శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి కొలువు తీరారు. ఈ స్వామి వారి పుష్కరిణిలో పోలి పాడ్యమిని దేవస్థానం ఘనంగా నిర్వహిస్తోంది. కొండ దిగువున ఉన్న పుష్కరణిలో ప్రతి ఏటా సాంప్రదాయ బద్దంగా పోలి పాడ్యమిని నిర్వహిస్తారు. అందుకు దేవస్థానం ఉన్నతాధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. పోలి పాడ్యమి తెల్లవారుజాము నుంచే మహిళా భక్తులు పుష్కరిణి వద్దకు చేరుకొంటారు. ఈ పుష్కరిణిలో దీపాలు విడిచి పోలికి వీడ్కోలు పలుకుతూ ప్రత్యేక పూజలను నిర్వహిస్తారు.
వీటిని కూడా చదవండి..
కార్తీక అమావాస్య రోజు ఇలా చేస్తే దోషాలు ..!
వైకుంఠ ద్వార దర్శనాలపై టీటీడీ నిర్ణయం ఇదే
Read Latest Devotional News And Telugu News
Updated Date - Nov 19 , 2025 | 06:39 PM