Ananthapuram News: అయ్యో.. ఇంత ఘోరమా.. పసివాడని కూడా చూడకుండా..
ABN, Publish Date - Nov 28 , 2025 | 12:12 PM
అనుమానాస్పద స్థితిలో తల్లీకొడుకు మృతిచెందిన విషాద సంఘటన అనంతపురం జిల్లాలో చోటుచేసుకుంది. ఉరికి వేలాడిన తల్లి మృతిచెంది ఉండగా మూడేళ్ల సహర్షను కిరాతకంగా హతమార్చారు. ఈ ఘటన జిల్లా వ్యాప్తగా తీవ్ర సంచలనానికి దారితీసింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
- తల్లీకొడుకు అనుమానాస్పద మృతి
- ఉరికి వేలాడిన తల్లి.. రక్తపు మడుగులో పసివాడు
- మృతులు రామగిరి డీటీ భార్య, కుమారుడు
- దంపతుల మధ్య విభేదాలే కారణమా..?
- దర్యాప్తు చేస్తున్న వన్టౌన్ పోలీసులు
అనంతపురం: జిల్లా కేంద్రంలోని శారదా నగర్లో రామగిరి డిప్యూటీ తహసీల్దారు సతీమణి అమూల్య(30), కుమారుడు సహర్ష(3) అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. పసివాడు గొంతు తెగి రక్తపు మడుగులో పడి ఉండగా, అమూల్య ఉరికి వేలాడుతూ ప్రాణాలు కోల్పోయారు. దంపతుల మధ్య మనస్పర్థల కారణంగా ఈ సంఘటన జరిగినట్లు భావిస్తున్నారు. జీవితంపై విరక్తి చెందిన అమూల్య, కుమారుడి గొంతుకోసి, ఉరి వేసుకుని ఉంటారని అంటున్నారు. కానీ ఆమె నోట్లో గుడ్డలు కుక్కి ఉండటం అనుమానాలకు తావిస్తోంది. అనంతపురం వన్టౌన్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాపు చేస్తున్నారు. రవికుమార్కు కర్నూలుకు చెందిన రామకృష్ణ, రమాదేవి దంపతుల కూతురు అమూల్యను ఇచ్చి ఐదేళ్ల కిందట వివాహం జరిపించారు. అమూల్య బీటెక్ వరకూ చదువుకున్నారు. వీరికి సహర్ష ఒక్కడే కుమారుడు. అనంతపురం జేఎన్టీయూ రోడ్డులోని రిషితేజ అపార్టుమెంట్ 303 ప్లాట్లో నివాసం ఉంటున్నారు.
రవి ఇంటికి వచ్చేలోగా..
దంపతుల మధ్య కొంతకాలంగా మనస్పర్థలు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో గురువారం సాయంత్రం 6.30 గంటలకు విధులు ముగించుకుని ఇంటికి వచ్చిన రవి కుమార్, తలుపు కొట్టారు. భార్య స్పందించకపోవడం తో అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు, పక్క ప్లాట్లవారి సహకారంతో తలుపులు పగులగొట్టి ఇంట్లోకి వెళ్లి చూశారు. అప్పటికే అమూల్య ఓ బెడ్రూమ్లో ఫ్యాన్కు చీరతో ఉరివేసుకుని కనిపించారు. రెండో బెడ్ రూమ్లో చిన్నారి సహర్ష రక్తపు మడుగులో కనిపించాడు. చిన్నారి గొంతును చాకుతో కోశారు.
ఆ పక్కనే రక్తం అంటిన చాకు కనిపించింది. ఉరికి వేలాడుతున్న అమూల్య నోట్లో గుడ్డలు కుక్కి ఉండటం అనుమానాలకు తావిస్తోంది. ఇది ఆత్మహత్యేనా..? ఏదైనా సంఘటన జరిగిందా..? అని పోలీసులు విచారిస్తున్నారు. భార్య, కుమారుడి మృతదేహాలను చూసి రవికుమార్ కన్నీటిపర్యంతమయ్యారు. పోలీసులు ఆయనను విచారిస్తున్నారు. అనంతపురం డీఎస్పీ శ్రీనివాసరావు, సీఐ వెంకటేశ్వర్లు సంఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. అమూల్య భ ర్తను విచారించామని, ఆమె తల్లిదండ్రులు ఇచ్చే సమాచా రం ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని డీఎస్పీ తెలిపారు.
అనేక అనుమానాలు
అమూల్య, సహర్ష మృతిపై అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. రెండు రోజుల కిందట దంపతుల మధ్య వాగ్వాదం జరిగినట్లు సమాచారం. అమూల్యను ఆమె తల్లి రెండు రోజుల కిందట కర్నూలు నుంచి తీసుకొచ్చి ఇంట్లో దిగబెట్టినట్లు తెలిసింది. ఆ సమయంలో కూడా రవికి, అమూల్యకు మధ్య గొడవ జరిగినట్లు సమాచారం. ఈ క్రమంలో అమూల్యపై రవి చెయ్యి చేసుకున్నాడని అంటున్నారు. రవికి కట్నకానుకలు భారీగా ఇచ్చారని వారి బంధువులు అంటున్నారు. వీరి కాపురం కొన్నాళ్లు బాగానే సాగిందని, ఆ తర్వాత వేధింపులు మొదలయ్యాయని అంటున్నారు. ఈ కారణంగానే అమూల్య ఇలా చేసుకుని ఉంటుందా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి.
కన్నీరుమున్నీరైన తల్లిదండ్రులు
జరిగిన ఘోరం గురించి సమాచారం అందుకున్న అమూల్య తల్లిదండ్రులు గురువారం రాత్రి 11 గంటల సమయంలో అనంతపురానికి చేరుకున్నారు. తమ కూతురు, మనవడి మరణాన్ని జీర్ణించుకోలేక గుండె పగిలేలా విలపించారు. అమూల్య బంధువులు పలువురు వారి వెంట వచ్చి కన్నీటి పర్యంతం అయ్యారు. ‘అదనపు కట్నం కోసం వేధించాడు. పెద్ద ఇల్లు కట్టుకోవాలంట.. పెద్దమనుషుల సమక్షంలో పలుమార్లు పంచాయితీలు జరిగాయి.. అయినా ఘోరం జరిగిపోయింది..’ అని వారు విలపించారు. రవి వేధింపుల కారణంగానే అమూల్య తన కొడుకును చంపేసి ఆత్మహత్య చేసుకుందని ఆరోపించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
రాజకీయ నినాదాలు కాదు.. వివక్షకు ఆధారాలు చూపాల్సిందే
ముఖ్యమంత్రా.. రియల్ ఎస్టేట్ ఏజెంటా..?
Read Latest Telangana News and National News
Updated Date - Nov 28 , 2025 | 12:12 PM