Tirupati: అడవిలో మృతులు.. తమిళనాడు వాసులు
ABN, Publish Date - Sep 17 , 2025 | 12:23 PM
పాకాలవారిపల్లె అటవీ ప్రాంతంలో మంగళవారం బయటపడిన మృతదేహాలు తమిళనాడుకు చెందిన వారివిగా నిర్దారణ అయింది. ఆదివారం సాయంత్రం ఈ అడవిలో ఓ పురుషుడు శవం చెట్టుకు వేలాడుతుండటం, ఓ మహిళ మృతదేహం సమీపాన పడి ఉండటం, అక్కడే పూడ్చిపెట్టిన రెండు గోతులను పోలీసులు గుర్తించిన సంగతి తెలిసిందే.
- తాజాగా గోతిలో కనిపించిన ఇద్దరు చిన్నారుల శవాలు
- భార్య, పిల్లల మృతదేహాలను గుర్తించిన భర్త
- నలుగురినీ ఎవరో హత్య చేసినట్లు అనుమానం?
పాకాల(తిరుపతి): పాకాలవారిపల్లె అటవీ ప్రాంతంలో మంగళవారం బయటపడిన మృతదేహాలు తమిళనాడుకు చెందిన వారివిగా నిర్దారణ అయింది. ఆదివారం సాయంత్రం ఈ అడవిలో ఓ పురుషుడు శవం చెట్టుకు వేలాడుతుండటం, ఓ మహిళ మృతదేహం సమీపాన పడి ఉండటం, అక్కడే పూడ్చిపెట్టిన రెండు గోతులను పోలీసులు గుర్తించిన సంగతి తెలిసిందే. గోతుల్లో ఇద్దరు చిన్నారులను పూడ్చిపెట్టి ఉంటారని పోలీసులు భావించారు.
సోమవారం పురుషుడు, మహిళల శవాల పోస్టుమార్టం, ఖనన ప్రక్రియతో చీకటి పడిపోయింది. ఈక్రమంలో మంగళవారం పోలీసులు అడవికి చేరుకుని రెండు గోతులను కొంతమేర తవ్వారు. గోతిలో మొబైల్ ఫోన్, డెయిరీ మిల్క్ చాక్లెట్, పాన్ కార్డు, ఆధార్ కార్డు, నగదుతో పాటు చిన్నారుల మృతదేహాలున్నట్లు గుర్తించారు. సాయంత్రం కావడంతో గోతులను పూర్తిగా తవ్వలేకపోయారు. ఫోరోనిక్స్ నిపుణుల సమక్షంలో బుధవారం ఉదయం పూర్తిగా తవ్వి, మృతదేహాలను వెలికి తీయనున్నట్లు పోలీసులు తెలిపారు.
మందుల చీటీనే క్లూ..
రెండు రోజుల క్రితం సంఘటనా స్థలం వద్ద మందుల చీటీ పాకాల పోలీసులకు దొరికింది. ఈ క్లూ ఆధారంగా వారు దర్యాప్తు చేపట్టారు. ఆ ప్రిస్ర్కిప్షన్ తమిళనాడులోని తంజావూరు వైద్యుడు రాసిందిగా గుర్తించి అక్కడి పోలీసులకు సమాచారమిచ్చారు. వారు సదరు వైద్యుడ్ని ఆరా తీశారు. కలైసెల్వన్ అనే వ్యక్తి మానసిక స్థితి సరిగా లేక తన దగ్గర వైద్యం పొందుతున్నాడని ఆ వైద్యుడు తెలిపారు. ఈఏడాది జూలైలో తిట్టచ్చేరి పోలీస్ స్టేషన్లో పరిధిలోని వెంకటేశ్ అనే వ్యక్తి తన భార్య జయమాల, కుమార్తెలు హర్షిణి(7), దర్షిణి(3) కనిపించడంలేదని పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఇతడు కుటుంబ పోషణ కోసం కువైట్లో ఉండేవాడు. అడవిలో శవాల సమాచారంతో అతడ్ని తమిళనాడు పోలీసులు మంగళవారం తీసుకొచ్చారు. సంఘటనా స్థలంలో ఉన్నది తన భార్య జయమాల మృతదేహమని వెంకటేష్ గుర్తించారు. మరో మృతుడు తన సమీప బంధువు కలైసెల్వన్(37)గా పేర్కొన్నారు. దీంతో మృతులెవరనేది నిర్ధారణ అయింది. మృతులకు నోట్లో గుడ్డలు కుక్కి, పార్శిల్ టేప్ చుట్టినట్లు ఉండటంతో పోలీసులు హత్యగానే భావిస్తున్నారు. లోతైన దర్యాప్తులో వీరి మృతికి సంబంధించి మిస్టరీ వీడుతుందని చెబుతున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
అది నేలకొండపల్లి ఎందుకు కాకూడదు!?
సిందూర్ తో మసూద్ కుటుంబం చిన్నాభిన్నం
Read Latest Telangana News and National News
Updated Date - Sep 17 , 2025 | 12:23 PM