Raghurama: రఘురామ కేసులో మరో కీలక పరిణామం
ABN, Publish Date - Aug 04 , 2025 | 02:14 PM
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్, మాజీ ఎంపీ రఘురామ కృష్ణరాజుపై పెట్టిన కేసును ఇక కొనసాగించలేనని సుప్రీంకోర్టుకు ఫిర్యాదు దారు కానిస్టేబుల్ ఫరూక్భాష తెలిపారు. 2022 జూన్లో రఘురామకృష్ణరాజు, ఆయన కొడుకు భరత్పై ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్ ఫరూక్భాష కేసు పెట్టారు.
ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్, మాజీ ఎంపీ రఘురామ కృష్ణరాజుపై (Raghurama Krishna Raju case) పెట్టిన కేసును ఇక కొనసాగించలేనని సుప్రీంకోర్టుకు (Supreme Court) ఫిర్యాదుదారు కానిస్టేబుల్ ఫరూక్భాష తెలిపారు. 2022 జూన్లో రఘురామ, ఆయన కొడుకు భరత్పై ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్ ఫరూక్భాష కేసు పెట్టారు. బౌల్డర్హిల్స్లో ఉన్న రఘురామ ఇంటి వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తిని సీఆర్పీఎఫ్ సిబ్బంది పట్టుకున్నారు. స్థానిక గచ్చిబౌలి పోలీస్స్టేషన్లో అప్పగించి రఘురామ, ఆయన భద్రతా సిబ్బంది ఫిర్యాదు చేశారు. డ్యూటీలో ఉన్న తనపై దాడికి పాల్పడ్డారని రఘురామ, ఆయన కొడుకు భరత్, సీఆర్పీఎఫ్ సిబ్బందిపై అదే పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్ ఫరూక్భాష ఫిర్యాదు చేశారు.
కానిస్టేబుల్ ఫరూక్భాష ఫిర్యాదును పరిగణనలోకి తీసుకున్న గచ్చిబౌలి పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. గచ్చిబౌలి పోలీసులు తమ ఫిర్యాదును పట్టించుకోకుండా... తమపైనే ఎఫ్ఐఆర్ నమోదు చేయడాన్ని హైకోర్టులో సవాలు చేశారు రఘురామ. హైకోర్టు తిరస్కరించడంతో సుప్రీంకోర్టును రఘురామ ఆశ్రయించారు. రఘురామ పిటిషన్పై జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ విజయ్ బిష్ణోయ్ ధర్మాసనం విచారణ జరిపింది. ఎంపీగా 'వై' క్యాటగిరిలో సీఆర్పీఎఫ్ భద్రత ఉన్న సమయంలో అనేక ఘటనలు జరిగాయని ధర్మాసనం దృష్టికి తీసుకువచ్చారు రఘురామ తరపు సీనియర్ న్యాయవాది ఆదినారాయణరావు.
అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తిని పట్టుకుని పోలీసు స్టేషన్లో అప్పజెప్పి... ఫిర్యాదు చేస్తే పోలీసులు తమపైనే ఎదురు కేసు పెట్టారని రఘురామ న్యాయవాది వివరించారు. వరుస ఘటనలకు సంబంధించిన వివరాలు కోర్టుకు అందించాలని రఘురామ న్యాయవాదిని ఆదేశించింది సుప్రీంకోర్టు ధర్మాసనం. అదే సమయంలో ఫిర్యాదు దారు కానిస్టేబుల్ ఫరూక్భాష తరపు న్యాయవాది జోక్యం చేసుకున్నారు. ఇకపై ఈ కేసును కొనసాగించేందుకు సిద్దంగా ఆయన లేరని తనకు సమాచారం పంపినట్లు ఫరూక్భాష న్యాయవాది తెలిపారు. అందుకు అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది ధర్మాసనం. విచారణను రెండు వారాలు సుప్రీంకోర్టు ధర్మాసనం వాయిదా వేసింది.
ఈ వార్తలు కూడా చదవండి..
జగన్ అండ్ కోవి డైవర్షన్ పాలిటిక్స్.. మంత్రి పార్థసారథి ఫైర్
ఎల్వీ సుబ్రహ్మణ్యం వ్యాఖ్యలను ఖండించిన టీటీడీ చైర్మన్
For More AP News and Telugu News
Updated Date - Aug 04 , 2025 | 02:58 PM