Congress: పీసీసీ పదవులు కొలిక్కి!
ABN, Publish Date - May 27 , 2025 | 03:42 AM
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(టీ పీసీసీ) పదవులపై కసరత్తు కొలిక్కి వచ్చినట్టు తెలిసింది. ఏ క్షణమైనా ప్రకటన వెలువడే అవకాశమున్నట్టు కాంగ్రెస్ వర్గాల ద్వారా తెలిసింది.
ఏ క్షణమైనా ప్రకటన వెలువడే అవకాశం
రాహుల్ గాంధీతో కేసీ వేణుగోపాల్, మహేశ్ గౌడ్ భేటీ
మంత్రివర్గ విస్తరణపై జూన్ మొదటివారంలో స్పష్టత
ఖర్గే లేకపోవడంతో మళ్లీ రావాలని అధిష్ఠానం సూచన
30న మరోసారి ఢిల్లీకి ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడు
మంత్రివర్గ విస్తరణను త్వరగా ఆమోదించండి
బీసీలకు ప్రాధాన్యమివ్వండి.. రాహుల్కు మహేశ్ విజ్ఞప్తి
న్యూఢిల్లీ, హైదరాబాద్, మే 26 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(టీ పీసీసీ) పదవులపై కసరత్తు కొలిక్కి వచ్చినట్టు తెలిసింది. ఏ క్షణమైనా ప్రకటన వెలువడే అవకాశమున్నట్టు కాంగ్రెస్ వర్గాల ద్వారా తెలిసింది. ఆదివారం సాయంత్రం ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి (సంస్థాగత) కేసీ వేణుగోపాల్ నివాసంలో సీఎం, పీసీసీ అధ్యక్షుడు సుదీర్ఘరంగా చర్చించారు. ఈ భేటీలోనే కమిటీలపై కసరత్తు కొలిక్కి వచ్చినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలోనే సోమవారం సాయంత్రం రాహుల్ గాంధీ నివాసంలో కేసీ వేణుగోపాల్ చర్చలు జరిపారు. తెలంగాణ పీసీసీ కమిటీల జాబితాకు సంబంధించిన అంశాలపై రాహుల్ గాంధీ దృష్టికి కేసీ వేణుగోపాల్ తీసుకెళ్లినట్టు తెలిసింది. ఆ తర్వాత పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్ కుటుంబ సమేతంగా రాహుల్ గాంధీని కలిశారు. పీసీసీ కమిటీల ప్రకటన, మంత్రివర్గ విస్తరణ, తెలంగాణ రాజకీయ పరిస్థితులు, గ్రామస్థాయిలో పార్టీ బలోపేతం తదితర అంశాలపై రాహుల్ గాంధీకి మహేశ్ వివరించినట్టు తెలిసింది. కాగా, తొలి నుంచి జంబో పీసీసీ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పగా, కేసీ వేణుగోపాల్ కమిటీలో సంఖ్యను తగ్గించాలని సూచించినట్టు సమాచారం. చివరికి.. రాహుల్ గాంధీ ఆమోదంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్ అభీష్టం మేరకే జంబో పీసీసీకి ఆమోదం లభించినట్టు కాంగ్రెస్ వర్గాల ద్వారా తెలిసింది. రాహుల్ గాంధీని కలిసిన తర్వాత.. ఢిల్లీలోని సీఎం అధికారిక నివాసంలో రేవంత్ రెడ్డితో మహేశ్ కుమార్ భేటీ అయ్యారు. సుమారు 45 నిమిషాలపాటు రాహుల్ గాంధీతో భేటీపై ఇరువురు చర్చించారు. అనంతరం సోమవారం రాత్రి మహేశ్ కుమార్ మరోసారి కేసీ వేణుగోపాల్ నివాసానికి వెళ్లి సమావేశమయ్యారు. ఎట్టకేలకు.. పీసీసీ కమిటీలపై కసరత్తు కొలిక్కి వచ్చినట్టు తెలిసింది. ఏ క్షణమైనా పీసీసీ కార్యవర్గంపై ఏఐసీసీ వర్గాల నుంచి ప్రకటన వెలువడే అవకాశముంది. కాగా, పీసీసీ కమిటీల్లోనూ సామాజిక సాధికారత పాటించాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఈ నేపథ్యంలో వర్కింగ్ ప్రెసిడెంట్లు, ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు.. ఇలా అన్నింటిలో సామాజిక సమీకరణాలను దృష్టిలో పెట్టుకుని తుది జాబితాను సిద్ధం చేసినట్టు తెలిసింది.
మంత్రివర్గ విస్తరణపై జూన్లో స్పష్టత
పీసీసీ కమిటీలు కొలిక్కి రాగా, మంత్రివర్గ విస్తరణ మాత్రం కొద్దిరోజుల ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆదివారం రాత్రే సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ ప్రయాణం ఉండగా, కేసీ వేణుగోపాల్ను కలిసిన తర్వాత పీసీసీ కమిటీలు, మంత్రివర్గ విస్తరణ.. రెండు అంశాలను ఫైనల్ చేసుకోవాలని నిర్ణయించారు. సోమవారం రాహుల్ గాంధీని, మంగళవారం ఖర్గేను కలిసి పీసీసీ కమిటీలు, మంత్రివర్గ విస్తరణపై చర్చించాలని భావించారు. చివరి నిమిషంలో ఖర్గే ఢిల్లీ ప్రయాణం వాయిదా పడింది. ఈ నేపథ్యంలో ఈ నెల 30న మరోసారి ఢిల్లీకి రావాలని ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడికి కాంగ్రెస్ అధిష్టానం సూచించింది. సోమవారం రాత్రి సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనను ముగించుకుని హైదరాబాద్ తిరికి చేరుకున్నారు. ఈ నేపథ్యంలో జూన్ మొదటి వారంలోనే మంత్రివర్గ విస్తరణపై స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది.
బీసీలకు ప్రాధాన్యమివ్వండి
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని కుటుంబ సమేతంగా కలిసిన పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు. ‘‘తెలంగాణలో రాజకీయ పరిస్థితులను రాహుల్ గాంధీ దృష్టికి తీసుకెళ్లాను. వీలైనంత త్వరగా మంత్రివర్గ విస్తరణ చేపట్టాలని కోరాను. బీసీలకు తగు ప్రాధాన్యమివ్వాలని మొదటి నుంచి కోరుతూనే ఉన్నా. మంత్రివర్గం విస్తరణ వీలైనంత త్వరగా జరుగుతుందని ఆశిస్తున్నాను. ఇప్పటికే రెండుసార్లు మా అభిప్రాయాలను రాహుల్ గాంధీ, ఖర్గే, కేసీ వేణుగోపాల్కు వివరించాం. కేబినెట్లో బీసీలకు తగు ప్రాధాన్యం ఉండాలని కోరుతున్నాం. పీసీసీ కమిటీలపై ఒకటి, రెండురోజుల్లో ప్రకటన వచ్చే అవకాశముంది.’’ అని మహేశ్ వివరించారు.
రోహిన్రెడ్డి, సంపత్కుమార్ పేర్లు ఖరారు
రెడ్డి, ఎస్సీ మాదిగ, ఎస్టీ లంబాడా, మైనారిటీ వర్గాల నుంచి ఒక్కొక్కరు చొప్పున నలుగురిని కార్యనిర్వాహక అధ్యక్షులుగా తీసుకోవాలని గతంలోనే నిర్ణయించిన సంగతి తెలిసిందే. రెడ్డి సామాజిక వర్గం నుంచి ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షుడు రోహిన్రెడ్డి, ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి పేర్లను ప్రధానంగా పరిశీలించారు. సీఎం రేవంత్రెడ్డి సూచన మేరకు రోహిన్రెడ్డి పేరు దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. ఎస్సీ మాదిగ సామాజిక వర్గం నుంచి ఏఐసీసీ కార్యదర్శి సంపత్కుమార్పై ఏకాభిప్రాయం వచ్చినట్లు చెబుతున్నారు. ఎస్టీ లంబాడా నుంచి ఎంపీ బలరాం నాయక్, ట్రైకార్ చైర్మన్ బెల్లయ్య నాయక్ మధ్య పోటీ నడుస్తున్నట్లు సమాచారం. ముస్లిం మైనారిటీల నుంచి మైనారిటీ గురుకుల సంస్థ వైస్ చైర్మన్ ఫహీంఖురేషి, పార్టీ నేత ఫిరోజ్ఖాన్, వక్ఫ్ బోర్డు చైర్మన్ అజ్మతుల్లా మధ్యే ప్రధానంగా పోటీ నెలకొంది. ముస్లిం మైనారిటీ కోటాకు సంబంధించి కూడా ఏకాభిప్రాయం రాలేదు.
Also Read:
సైంటిస్టులు అద్భుత ఆవిష్కరణ.. 'సూపర్-విజన్' లెన్స్తో చీకట్లోనూ చూసేయచ్చు..
సన్నగా, బలహీనంగా ఉన్నారా? ఫిట్నెస్ మంత్ర ఇదే..
For More Health News and Telugu News..
Updated Date - May 27 , 2025 | 03:42 AM