KTR Medigadda Remarks: మేడిగడ్డ వద్ద కాంగ్రెస్ వాళ్లే బాంబులు పెట్టారేమో?
ABN, Publish Date - May 23 , 2025 | 03:57 AM
కాళేశ్వరం ప్రాజెక్టులో కీలకమైన మేడిగడ్డ బ్యారేజీ పగుళ్లకు కాంగ్రెస్ వాళ్లే కారణం కావొచ్చని, వాళ్లే బాంబులు పెట్టారన్న అనుమానం కలుగుతోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యానించారు.
బ్యారేజీ పగుళ్లకు వాళ్లే కారణం కావొచ్చు
కమీషన్ల కోసం కాళేశ్వరాన్ని కూల్చాలన్నదే రేవంత్రెడ్డి ఎజెండా
టైమ్పాస్ కోసమే కేసీఆర్, హరీశ్కు నోటీస్లు
మాపై లొట్టపీసు కేసులతో సీఎం చేసేదేం లేదు
కాళేశ్వరంపై బీజేపీ, కాంగ్రెస్ దుష్ప్రచారం
రేవంత్రెడ్డిలో అపరిచితుడున్నారు..
ప్రభుత్వం వద్ద రూపాయి కూడా లేదంటారు..
అందాల పోటీల కోసం 200 కోట్లు: కేటీఆర్
హైదరాబాద్, మే 22 (ఆంధ్రజ్యోతి): కాళేశ్వరం ప్రాజెక్టులో కీలకమైన మేడిగడ్డ బ్యారేజీ పగుళ్లకు కాంగ్రెస్ వాళ్లే కారణం కావొచ్చని, వాళ్లే బాంబులు పెట్టారన్న అనుమానం కలుగుతోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యానించారు. బ్యారేజీలో కేవలం రెండు చోట్ల పగుళ్లు వస్తే.. ఏదో అయిపోయినట్టు చేస్తున్నారని ఆరోపించారు. గురువారం తెలంగాణభవన్లో మీడియాతో జరిపిన ఇష్టాగోష్ఠిలో కేటీఆర్ పలు అంశాలను ప్రస్తావించారు. ‘‘కాసుల కక్కుర్తితో కాళేశ్వరం ప్రాజెక్టులోని బ్యారేజీలు కూల్చాలని.. మళ్లీ టెండర్లు పిలిచి 20శాతం నుంచి 30శాతం కమీషన్లు తీసుకోవాలన్నదే సీఎం రేవంత్రెడ్డి అసలు ఎజెండా. ప్రజాపాలన కమీషన్ల పాలనగా మారింది. కాంగ్రెస్ మంత్రుల కమీషన్ల వ్యవహారం ప్రజల్లోకి వెళ్లడంతో.. వారి దృష్టి మళ్లించేందుకే నోటీసుల పేరిట తమాషాలు చేస్తున్నారు..’’ అని ఆరోపించారు. లొట్టపీసు కేసులతో రేవంత్రెడ్డి చేసేదేమీ లేదని, ఇప్పటివరకు ఆయన పెట్టిన కేసులన్నీ తేలిపోయాయని వ్యాఖ్యానించారు. విచారణ పూర్తయిందని, నివేదికను సిద్ధం చేశామని జస్టిస్ ఘోష్ చెప్పారని... ప్రభుత్వం మళ్లీ గడువు ఎందుకు పొడిగించిందో చెప్పాలని డిమాండ్ చేశారు. కేసీఆర్, హరీశ్రావులకు కమిషన్ నోటీసులు టైమ్పాస్ కోసమేనని పేర్కొన్నారు. అయితే కేసీఆర్కు నోటీసులు నేరుగా అందినట్టు సమాచారం లేదని, అందిన తర్వాత ఏంచేయాలో నిర్ణయం తీసుకుంటారని తెలిపారు.
బీజేపీ, కాంగ్రెస్ నికృష్ట రాజకీయాలు..
బీజేపీ, కాంగ్రెస్ కలసి కాళేశ్వరంపై దుష్ప్రచారం చేస్తున్నాయని, నికృష్ట రాజకీయాలకు పాల్పడుతున్నాయని కేటీఆర్ విమర్శించారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుపై చేసిన దుష్ప్రచారం సుప్రీంకోర్టు సాక్షిగా తేలిపోయిందని, కాళేశ్వరంపై కూడా నిజం నిలకడగా బయటపడుతుందని చెప్పారు. ‘‘సీఎం రేవంత్రెడ్డిలో అపరిచితుడున్నారు. ఆయన మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్తో బాధపడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం వద్ద ఒక్క రూపాయి కూడా లేదంటారు. అప్పు కోసం వెళితే అందరూ దొంగల్లా చూస్తున్నారంటారు. అలాంటిది అందాల పోటీల కోసం రూ.200కోట్లు ఖర్చుపెట్టడం సరైనదేనా?’’అని ప్రశ్నించారు. మిస్వరల్డ్ పోటీదారులకు మంత్రులు టూరిస్ట్ గైడ్లలా మారారంటూ, సొంగకార్చుకుంటూ అందాల పోటీలో పాల్గొంటున్నారంటూ సీపీఐ నారాయణ విమర్శించారని గుర్తుచేశారు. అకాల వర్షంతో పంటలు దెబ్బతిని, ధాన్యం తడిసి రైతులు కష్టాలు పడుతున్నా.. హైదరాబాద్లో భారీ అగ్నిప్రమాదం జరిగినా పట్టించుకోని రేవంత్రెడ్డి.. అందాల పోటీలకు నాలుగు సార్లు వెళ్లివచ్చారని విమర్శించారు. మిస్ వరల్డ్ ఫ్లెక్సీలో రేవంత్, భట్టి, జూపల్లి ఫోటోలున్నాయని.. వీరిలో మిస్వరల్డ్ ఎవరో అర్థం కావడం లేదని ఎద్దేవా చేశారు.
పార్టీ నుంచి పోయినవాళ్లు పోనీ..!
నలుగురున్న కుటుంబంలోనే అభిప్రాయ భేదాలుంటాయని.. అలాంటిది లక్షల మంది ఉండే రాజకీయ పార్టీలో అక్కడక్కడా సమస్యలు తలెత్తడం సాధారణమని కేటీఆర్ పేర్కొన్నారు. పార్టీ బలోపేతం కోసం కలసికట్టుగా పనిచేద్దామని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. గురువారం తెలంగాణ భవన్లో నిర్వహించిన నిర్మల్ జిల్లా కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. పార్టీ పటిష్ఠత కోసం ప్రత్యేక కార్యాచరణతో ముందుకెళ్తామని, త్వరలోనే గ్రామం నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీ కమిటీలను నియమిస్తామని తెలిపారు. జూన్, జూలై నెలల్లో బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు చేపడతామన్నారు. బీఆర్ఎస్ హయాం లో రెండు సార్లు మంత్రి పదవి పొందిన ఇంద్రకరణ్రెడ్డి.. కాంగ్రె్సలో చేరడాన్ని ఆయన విచక్షణకే వదిలేద్దామని పేర్కొన్నారు. పోయినవాళ్లుపోగా.. ఉన్నవాళ్లతోనే పార్టీని బలోపేతం చేసుకుంటామని చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికల కోసం హైదరాబాద్ నుంచి పార్టీ అబ్జర్వర్లను పంపుతామని, ప్రతి గ్రామంలో పార్టీని నమ్ముకున్నవారికి టికెట్లిచ్చి గెలిపించుకుంటామన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
jagtyaala : పాఠ్య పుస్తకాలు వస్తున్నాయి..
Crime News: తెలంగాణ భవన్ నుంచి సైబర్ నేరస్తుడు పరారీ..
TG News: ఢీకొన్న రెండు కార్లు.. ఆ తర్వాత ఏమైందంటే..
Indigo Flight Delay: ఇండిగో విమానంలో సాంకేతిక సమస్య
Read Latest Telangana News And Telugu News
Updated Date - May 23 , 2025 | 03:57 AM