Union Minister Kishan Reddy: కులగణనలో తెలంగాణ రాంగ్ రోల్మోడల్
ABN, Publish Date - May 02 , 2025 | 04:16 AM
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలంగాణ కులగణనను తప్పుడు మోడల్గా తప్పుబట్టారు. కేవలం 50% ఇళ్లలోనే సర్వే జరగిందని, బీసీలకు న్యాయం జరగలేదని విమర్శించారు.
50% ఇళ్లలో కూడా సర్వే చేయలేదు
మాకు ఆ మోడల్ ఏమాత్రం అవసరం లేదు
రాహుల్కు భయపడి కులగణన చేయట్లేదు
మత ప్రాతిపదికన ఎవరినీ బీసీల్లో చేర్చం
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
న్యూఢిల్లీ, మే 1 (ఆంధ్రజ్యోతి): కులగణనలో తెలంగాణ రాంగ్ రోల్ మోడల్ అని, తమకు అవసరం లేదని కేంద్ర మంత్రి జి.కిషన్రెడ్డి స్పష్టం చేశారు. ‘‘రేవంత్ సర్కారుది బీసీ వ్యతిరేక సర్వే. కాంగ్రెస్ కులగణన అసంపూర్తిగా, అశాస్త్రీయంగా జరిగింది. తెలంగాణలో కనీసం 50ు ఇళ్లలోనూ సర్వే చేయలేదు’’ అని వ్యాఖ్యానించారు. తెలంగాణలో ఓ సారి సర్వే చేసి, లోపాలుంటే మరో రెండ్రోజులు సమయం తీసుకుని, ఇష్టారీతిన కులగణన చేశారని ఆరోపించారు. 2010లోనే కులగణనకు అనుకూలమని బీజేపీ చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. పదేళ్లుగా మోదీ కులగణన చేయలేదనేవారు ఒక విషయాన్ని గుర్తుచేసుకోవాలని, జనాభా లెక్కలతోపాటే ఈ సర్వే సాధ్యమవుతుందని, అందుకే ఇంతకాలం ఆగారని వివరించారు. ‘‘2010లో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ కులగణనపై మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేశారు. అప్పట్లో లోక్సభలో ప్రతిపక్ష నేతగా ఉన్న సుష్మాస్వరాజ్ తాము కులగణనకు అనుకూలమని పేర్కొంటూ అప్పటి ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీకి లేఖ రాశారు.
అప్పటి హోంమంత్రి చిదంబరం కులగణనను వ్యతిరేకించారు’’ అని వివరించారు. కేంద్ర హోంమంత్రి అమిత్షా ఎప్పటి నుంచో.. జనాభా లెక్కల సమయంలో కులగణన చేస్తామని చెప్పారన్నారు. అప్పట్లో సుష్మా స్వరాజ్ ఇచ్చిన లేఖ ఆధారంగా.. ఇప్పుడు కులగణన నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. ఈ నిర్ణయంపై ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. మోదీ సర్కారు నిర్ణయాన్ని తమ ఘనతగా రాహుల్ చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. ‘‘రాహుల్, రేవంత్కు భయపడి మేం కులగణన చేయడం లేదు. కర్ణాటక, తెలంగాణల్లో జరిపిన కులగణనలో చిత్తశుద్ధి లేదు.శాస్త్రీయ పద్ధతిలో సర్వే జరగలేదు. అసలు అవి కులగణనలే కావు. తెలంగాణలో 50ు జనాభాను కూడా చేరుకోకుండా.. మొత్తం సర్వే చేశామనడం హాస్యాస్పదం. బీసీల్లో అన్ని వర్గాలకు న్యాయం జరగాలంటే.. నిష్పక్షపాతంగా, శాస్త్రీయపద్ధతుల్లో సర్వే నిర్వహించాలి. మోదీ సర్కారు ఆలోచన ఇదే’’ అని స్పష్టం చేశారు. మోదీని ప్రశ్నించే ముందు.. దశాబ్దాలుగా దేశాన్ని ఏలిన కాంగ్రెస్ ఎందుకు కులగణన చేయలేదో రాహుల్గాంధీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. బీసీల కంటే ముస్లింల సంక్షేమానికి కాంగ్రెస్ ముందుంటుందని విమర్శించారు. ‘‘ఎద్దుల బండి కింద కుక్క.. మొత్తం బండిని తానే మోస్తున్నానని అనుకుంటుంది. కాంగ్రెస్ పరిస్థితి కూడా అలానే ఉంది’’ అని ఎద్దేవా చేశారు.
హైదరాబాద్లో బీసీలకు అన్యాయం
గ్రేటర్ హైదరాబాద్లోని 150 డివిజన్లలో బీసీలకు 50 సీట్లను రిజర్వ్ చేసిన విషయాన్ని కిషన్రెడ్డి గుర్తుచేశారు. ఆ సీట్లలో 30 చోట్ల ముస్లింలే గెలిచారని, అలాంటప్పుడు బీసీలకు న్యాయం జరిగినట్లు ఎలా అవుతుందని నిలదీశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ ఎనాడూ బీసీలకు న్యాయం చేయలేదని ఆరోపించారు. మోదీ ప్రధాని అయ్యాక.. తొలిసారి 2026లో జనగణన జరగనుందని కిషన్రెడ్డి తెలిపారు. ఆలోగా కులగణనకు అనుకూలంగా ‘జనగణన చట్టం-1948’ని సవరించాల్సి ఉంటుందన్నారు. వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో సవరణ బిల్లును తీసుకొస్తామని ప్రకటించారు.
బీసీ ప్రధానిని కులం పేరుతో దూషించారు
కాంగ్రెస్ పార్టీ దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ప్రజలను మతం పేరుతో విడగొడుతోందని కిషన్రెడ్డి ఆరోపించారు. మత ఘర్షణలు, కులాల పేరుతో సమాజాన్ని విచ్ఛిన్నం చేసే కుట్రలు చేస్తోందని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీలపై కపట ప్రేమను చూపుతోందని, అవకాశం చిక్కినప్పుడల్లా విషం కక్కుతోందని అన్నారు. ఎస్సీ కులానికి చెందిన కోవింద్, ఎస్టీ కులానికి చెందిన ముర్మును రాష్ట్రపతి అభ్యర్థులుగా ప్రకటిస్తే, కాంగ్రెస్ వ్యతిరేకించిందని గుర్తుచేశారు. బీసీ అయిన ప్రధాని మోదీని కులం పేరుతో దూషించిన నీచ చరిత్ర కాంగ్రెస్ పార్టీదంటూ మండిపడ్డారు. దశాబ్దాలుగా పెండింగ్ ఉన్న మాదిగ రిజర్వేషన్ల సమస్యను పరిష్కరించామన్నారు. 2018లో జాతీయ బీసీ కమిషన్కు చట్టబద్ధత కల్పించామని, 2019లో ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణాల కోసం 10 శాతం రిజర్వేషన్లు(ఈడబ్ల్యూఎస్) అమల్లోకి తీసుకొచ్చామని గుర్తుచేశారు. మహిళలకు 33ు రిజర్వేషన్లు కల్పించిన ఘనత మోదీదేనని చెప్పారు. ’ట్రిపుల్ తలాక్‘ వంటి అనాగరికమైన విధానాలను రద్దు చేశామన్నారు.
Updated Date - May 02 , 2025 | 04:18 AM