Monsoon: జూన్ నెలలో లోటు వర్షపాతమే!
ABN, Publish Date - Jul 02 , 2025 | 03:41 AM
నైరుతి రుతుపవనాలు ముందే వచ్చి మురిపించినా ఉపయోగం లేకుండాపోయింది. జూన్లో లోటు వర్షపాతమే నమోదైంది. నైరుతి రుతుపవనాలు మేలోనే రావడం, ఆ నెల చివరివారంలో భారీ వర్షాలు కురవడంతో రాష్ట్ర రైతాంగం ఎంతో సంతోషడింది.
గడువుకు ముందే వచ్చినా.. తర్వాత ఉసూరుమనిపించిన రుతుపవనాలు
297 మండలాల్లో వర్షాభావ పరిస్థితులు
20 జిల్లాల్లో సాధారణ వర్షపాతం
ఇక రైతుల ఆశలన్నీ జూలై పైనే..
నేడు, రేపు రాష్ట్రంలో భారీ వర్షాలు
హైదరాబాద్, జూలై 1 (ఆంధ్రజ్యోతి): నైరుతి రుతుపవనాలు ముందే వచ్చి మురిపించినా ఉపయోగం లేకుండాపోయింది. జూన్లో లోటు వర్షపాతమే నమోదైంది. నైరుతి రుతుపవనాలు మేలోనే రావడం, ఆ నెల చివరివారంలో భారీ వర్షాలు కురవడంతో రాష్ట్ర రైతాంగం ఎంతో సంతోషడింది. కానీ, అన్నదాతల ఆశలు మాత్రం వానల్లేక విత్తిన విత్తు మొలకెత్తక ఎండుతుండడంతో అడియాసలయ్యాయి. జూన్లో రాష్ట్రవ్యాప్తంగా పత్తి, మొక్కజోన్న, సోయాబీన్లాంటివి వేశారు. మే చివరి, జూన్ మొదటివారంలో పడ్డ వర్షాలతో విత్తనాలు నాటారు. ఆ తర్వాత వరుణుడు ముఖం చాటేశాడు. దాంతో జూన్లో సాధారణం కంటే తక్కువ అంటే సగానికిపైగానే తీవ్రలోటు వర్షపాతం నమోదైంది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 621 మండలాలుండగా, అందులో సగం మండలాల్లో లోటు వర్షపాతమే. జూన్లో రాష్ట్రంలో సగటు వర్షపాతం 130 సెంటీమీటర్ల నమోదు కావాలి. కానీ ఈ ఏడాది జూన్లో కేవలం 104 సెంటీమీటర్లే కురిసింది. అంటే సాధారణం కంటే 26 సెంటీమీటర్ల లోటు వర్షపాతమే. గతేడాది జూన్లో 159 సెంటీమీటర్లు అంటే సాధారణం కంటే 29 సెంటీమీటర్లు అధిక వర్షపాతం నమోదైంది. ఇక జూలైలో 227, ఆగస్టులో 215 సెంటీమీటర్ల సాధారణ వర్షపాతం నమోదు కావాలి. ప్రస్తుతం లోటు వర్షపాతం నమోదు కావడంతో, రాష్ట్ర రైతాంగం ఆశలన్నీ జూలై, ఆగస్టులపైనే పెట్టుకుంది. కాగా, రాష్ట్రంలో జూన్ నెలలో 20 జిల్లాల్లో సాధారణ వర్షపాతం పడినట్లు వాతావరణ కేంద్రం గణాంకాలు చెబుతున్నాయి.
13 జిల్లాల్లో లోటు వర్షపాతం నమోదైంది. జగిత్యాల, మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు, సిరిసిల్ల, జనగాం, సంగారెడ్డి, మేడ్చల్, హైదరాబాద్, నారాయణపేట్, నల్గొండ, పెద్దపల్లి, సూర్యాపేట జిల్లాల్లో 20-59 శాతం లోటు వర్షపాతం నమోదైనట్లు లెక్కలు చెబుతున్నాయి. కాగా, జూన్లో సాధారణం కంటే అధిక వర్షపాతం, అత్యధిక వర్షపాతం నమోదైన జిల్లా ఒక్కటీ కూడా లేకపోవడం గమనార్హం. గతేడాది జూన్లోనే పలు జిల్లాల్లో సాధారణం కంటే అత్యధిక వర్షపాతం కురిసింది, కానీ, ఈసారి ఆ పరిస్థితి ఎక్కడా కనిపించలేదు. కేవలం ఓ 12 మండలాల్లోనే అత్యధిక వర్షపాతం కనిపించగా, 297 మండలాల్లో లోటు వర్షపాతమే. కాగా, రాష్ట్రంలో బుధ, గురువారాల్లో కొన్ని జిలాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అలాగే చాలా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉందని పేర్కొంది. బుధవారం ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడేం జిలాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. రాబోయే నాలుగు రోజులకు యెల్లో అలెర్ట్ జారీ చేసింది.
ఇవి కూడా చదవండి:
ఉగ్రవాదులు అరెస్ట్.. ఉలిక్కిపడ్డ రాష్ట్రం
వైఎస్ జగన్కు సోమిరెడ్డి వార్నింగ్
బీఆర్ఎస్ పునరుజ్జీవనం కోసం తాపత్రయపడుతోంది: సీఎం రేవంత్ రెడ్డి..
For More Telangana News and Telugu News
Updated Date - Jul 02 , 2025 | 03:41 AM