Congress Reaction On TG High Court Verdict: ప్రభుత్వాన్ని బద్నాం చేద్దామనుకునే వారికి.. ఇది చెంపపెట్టు: కాంగ్రెస్ పార్టీ
ABN, Publish Date - Sep 24 , 2025 | 02:09 PM
గ్రూప్ -1 మెయిన్స్ పరీక్షలపై తెలంగాణ హైకోర్టు డివిజన్ బెంచ్ బుధవారం తన తీర్పును వెలువరించింది. ఈ నేపథ్యంలో అధికార కాంగ్రెస్ పార్టీ స్పందించింది. ఆ క్రమంలో బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు వ్యవహరిస్తున్న తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది.
హైదరాబాద్, సెప్టెంబర్ 24: గ్రూప్ -1 మెయిన్స్ పరీక్షలపై తెలంగాణ హైకోర్టు డివిజన్ బెంచ్ బుధవారం తన తీర్పును వెలువరించింది. ఈ అంశంపై అధికార కాంగ్రెస్ పార్టీ స్పందించింది. బుధవారం హైదరాబాద్ నాంపల్లిలోని గాంధీ భవన్లో అధికార కాంగ్రెస్ పార్టీ మీడియా కమ్యూనికేషన్ చైర్మన్ సామా రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వాన్ని బద్నాం చేద్దామనుకున్న వాళ్లకి.. ఈ కోర్టు తీర్పు చెంపపెట్టు అని అభివర్ణించారు. గ్రూప్ -1 ర్యాంకర్లపై బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల నేతలు నీచ రాజకీయాలు చేస్తున్నారంటూ మండిపడ్డారు.
అంతేకాదు.. ఈ పరీక్షల రద్దు చేయడం ద్వారా ర్యాంకర్ల తల్లిదండ్రులను తీవ్ర ఆవేదనకు గురి చేశారన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాత.. బీఆర్ఎస్ పార్టీ ఒక్క గ్రూప్ -1 పోస్టు కూడా ఇవ్వలేదని గుర్తు చేశారు. ఉద్యోగాలు రాకుండా అడ్డుకొని.. విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నారంటూ బీజేపీ, బీఆర్ఎస్ నేతలపై ఆయన నిప్పులు చెరిగారు. అలాంటి వేళ.. కోర్టు తీర్పుతో న్యాయస్థానాలపై ప్రజలకు విశ్వాసం పెరిగిందని సామా రామ్మోహన్ రెడ్డి తెలిపారు.
ఇదీ జరిగింది..
గ్రూప్ 1 మూల్యాంకనంలో అక్రమాలు జరిగాయని.. ఈ నేపథ్యంలో ఈ పరీక్షలను రద్దు చేయాలంటూ కొందరు అభ్యర్థులు తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన సింగిల్ బెంచ్ ధర్మాసనం.. ఈ పరీక్షల జవాబు పత్రాలను రీవాల్యుయేషన్ చేయించాలని.. లేకుంటే ఆ పరీక్షలను రద్దు చేసి తాజాగా నిర్వహించాలంటూ కీలక తీర్పు వెలువరించింది. ఈ తీర్పుపై డివిజన్ బెంచ్లో అప్పీల్ చేయాలని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) నిర్ణయించింది. అందులో భాగం దీనిపై తెలంగాణ హైకోర్టును టీజీపీఎస్సీ ఆశ్రయించింది.
ఇక మరోవైపు గ్రూప్-1 మెయిన్స్ పరీక్షపై సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థుల్లో పలువురు హైకోర్టును ఆశ్రయించారు. ఎవరో ఒకరు తప్పు చేయడం వల్ల.. మొత్తం అందరిని శిక్షించడం సబబు కాదంటూ పలువురు అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మంగళవారం అంటే.. సెప్టెంబర్ 23వ తేదీ.. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్, జస్టిస్ జి.ఎం. మొహియుద్దీన్ ధర్మాసనం విచారణ చేపట్టింది. ఆ క్రమంలో సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును హైకోర్టు ధర్మాసనం నిశీతంగా పరిశీలించింది. అందులో భాగంగా ఈ కేసు తీర్పులో వినియోగించిన పదాలు.. చేసిన వ్యాఖ్యల పట్ల ధర్మాసనం పలు సందేహాలు వ్యక్తం చేసింది.
ఆ సందేహలకు సంబంధించిన సమాధానాలు ఉన్నాయా? అంటూ ప్రశ్నించింది. తీర్పు ఇచ్చేటప్పుడు అన్నింటిని పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుందని హైకోర్టు ధర్మాసనం ఈ సందర్భంగా అభిప్రాయపడింది. ఇక పిటిషనర్ తరఫున డాక్టర్ లక్ష్మీనరసింహ హజరయ్యారు. టీజీపీఎస్సీ తరఫు న్యాయవాది రాజశేఖర్ సైతం తన వాదనలు వినిపించారు. ఇప్పటికే దీనిపై టీజీపీఎస్సీ అప్పీలు దాఖలు చేసిందంటూ కోర్టు దృష్టికి తీసుకు వెళ్లారు. దీంతో ఈ విచారణను ఈ రోజుకు అంటే బుధవారానికి వాయిదా వేసింది. అయితే ఈ రోజు విచారణలో సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును తాత్కాలికంగా డివిజన్ బెంచ్ సస్పెండ్ చేసింది.
ఈ వార్తలు కూడా చదవండి..
గ్రూప్-1 రద్దుపై హైకోర్టు సంచలన తీర్పు
కృష్ణమ్మకు వరద పోటు.. ప్రభుత్వం అలర్ట్
For More AP News And Telugu News
Updated Date - Sep 24 , 2025 | 02:22 PM