Dasara Festival In VIjayawada: కృష్ణమ్మకు వరద పోటు.. ప్రభుత్వం అలర్ట్
ABN , Publish Date - Sep 24 , 2025 | 08:28 AM
విజయవాడలోని ప్రకాశం బ్యారేజీ వద్ద కృష్ణమ్మకు వరద పోటెత్తింది. మరోవైపు దసరా నవరాత్రులు, విజయవాడ ఉత్సవ్ నేపథ్యంలో నగరానికి భారీగా భక్తులు, ప్రజలు తరలి వస్తున్నారు. దాంతో ప్రభుత్వం అప్రమత్తమైంది.
అమరావతి, సెప్టెంబర్ 24: భారీ వర్షాలతోపాటు ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద నీటితో విజయవాడలోని కృష్ణానదికి వరద పోటెత్తింది. దీంతో ప్రకాశం బ్యారేజి వద్ద ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 4. 29 క్యూసెక్కులుగా ఉంది. అయితే ఇది 4.50 లక్షల క్యూసెక్కుల వరకు చేరే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. అలాంటి వేళ.. రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ బుధవారం విజయవాడలో స్పందించారు. అత్యవసర సహాయక చర్యల కోసం విజయవాడలోని నదీ ఘాట్ల వద్ద 5 ఎస్డీఆర్ఎఫ్ బృందాలను ఏర్పాటు చేసినట్లు వివరించారు. దసరా ఉత్సవాలు సందర్భంగా అధికార యంత్రాంగానికి కీలక సూచనలు చేశారు.
నదీ ఘాట్ల వద్ద భక్తుల కదలికలను నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. భద్రతా చర్యలలో భాగంగా పోలీసు, నీటిపారుదల, మునిసిపల్ శాఖల సిబ్బంది ఘాట్ల వద్ద ఉండాలని స్పష్టం చేశారు. నది ప్రమాద స్థాయి తెలియ జేసేలా హెచ్చరిక బోర్డులతోపాటు బారికేడ్లు ఏర్పాటు చేయాలని కోరారు. ప్రభుత్వ అధికారులకు సహకరించాలని ఈ సందర్భంగా భక్తులకు ఆయన సూచించారు. మరోవైపు విజయవాడలో ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీదుర్గమ్మ ఆలయంలో దసరా ఉత్సవాలతోపాటు విజయవాడ ఉత్సవ్ కార్యక్రమం సోమవారం ప్రారంభమైనాయి. దీంతో అమ్మవారి దర్శనంతోపాటు ఉత్సవ్ కార్యక్రమంలో పాల్గొనేందుకు ప్రజలు పోటెత్తుతున్నారు. ఆ క్రమంలో రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ పై విధంగా స్పందించారు.
ఇక నంద్యాల జిల్లాలోని శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతుంది. జలాశయం 10 రేడియల్ క్రస్టు గేట్లు 14 అడుగుల మేర ఎత్తివేసి.. ప్రాజెక్ట్లోని నీటిని దిగువకు విడుదల చేశారు. ఇక ప్రాజెక్ట్ వద్ద ఇన్ ఫ్లో: 3,19,738 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో : 4,14,132 క్యూసెక్కులు... ప్రాజెక్ట్లో పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులుగా ఉంది. ప్రస్తుతం ప్రాజెక్ట్లో 882.70 అడుగులు నీరు ఉంది. పూర్తిస్థాయి నీటి నిల్వ: 215. 8070 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం: 202.9673 టీఎంసీలుగా ఉంది. అలాగే కుడి, ఎడమ విద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది.
ఈ వార్తలు కూడా చదవండి..
కమిషనర్ వార్నింగ్.. పనితీరు మారకుంటే చర్యలు తప్పవు
For More AP News And Telugu News