ఇంటిగ్రిటీ అనేది చాలా సున్నితమైన అంశం: హైకోర్టు
ABN , Publish Date - Sep 24 , 2025 | 11:40 AM
టీజీపీఎస్సీకి ఇంటిగ్రిటీ లేదని సింగిల్ బెంచ్ తీర్పులో ఉందని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. ఇంటిగ్రిటీ అనేది చాలా సున్నితమైన పదమని పేర్కొంది.
హైదరాబాద్, సెప్టెంబర్ 24: టీజీపీఎస్సీకి ఇంటిగ్రిటీ లేదని సింగిల్ బెంచ్ తీర్పులో ఉందని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. ఇంటిగ్రిటీ అనేది చాలా సున్నితమైన పదమని పేర్కొంది. మాల్ ప్రాక్టీస్, పేపర్ లీక్ వంటివి ఏమైనా జరిగాయా? అంటూ హైకోర్టు సందేహం వ్యక్తం చేసింది. సింగిల్ బెంచ్ తీర్పులో చాలా డెలికేట్ పదాలు ఉన్నాయని వివరించింది. బయాస్, ఇంటిగ్రిటీ అనే పదాలు ఉపయోగించారని.. బయాస్ అంటే ఎవరికైనా ఫేవర్ చేశారా? అంటూ హైకోర్టు అనుమానం వ్యక్తం చేసింది. వాటికి ఆధారాలు ఏమైనా ఉన్నాయా? అని హైకోర్టు ప్రశ్నించింది. ఇలాంటి విషయాలపై తీర్పు ఇచ్చేటప్పుడు అన్నీ పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందని హైకోర్టు అభిప్రాయపడింది.
తెలంగాణ గ్రూప్ 1పై టీజీపీఎస్సీ అప్పీల్పై బుధవారం హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్బంగా హైకోర్టు పై విధంగా స్పందించింది. అయితే గ్రూప్-1 ఫలితాలపై సింగిల్ బెంచ్ తీర్పును టీజీపీఎస్సీ అప్పీల్ చేసింది. ఆ క్రమంలో ప్రభుత్వం తరఫున హైకోర్టులో ఏజీ సుదర్శన్రెడ్డి తన వాదనలు వినిపించారు. రీ వాల్యుయేషన్ సర్వీస్ నిబంధనల ఆధారంగా ఉండాలని ఏజీ వాదించారు. 14 ఏళ్ల తర్వాత గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు జరిగాయని ఈ సందర్బంగా తెలంగాణ హైకోర్టు దృష్టికి ఏజీ తీసుకువెళ్లారు.
ఇంతకీ ఏం జరిగిందటే..
గ్రూప్ 1 మూల్యాంకనంలో అక్రమాలు జరిగాయని.. ఈ నేపథ్యంలో ఈ పరీక్షలను రద్దు చేయాలంటూ కొందరు అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టులోని సింగిల్ బెంచ్ ధర్మాసనం.. ఈ పరీక్షల జవాబు పత్రాలను రీవాల్యుయేషన్ చేయించాలని.. లేకుంటే పరీక్షలను రద్దు చేసి తాజాగా నిర్వహించాలంటూ కీలక తీర్పు వెలువరించింది. ఈ తీర్పుపై డివిజన్ బెంచ్లో అప్పీల్ చేయాలని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) నిర్ణయించింది. అందులోభాగం దీనిపై తెలంగాణ హైకోర్టును టీజీపీఎస్సీ ఆశ్రయించింది.
మరోవైపు.. గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షపై సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థుల్లో పలువురు హైకోర్టును ఆశ్రయించారు. ఎవరో ఒకరు తప్పు చేయడం వల్ల మొత్తం అందరిని శిక్షించడం సబబు కాదంటూ పలువురు అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్, జస్టిస్ జి.ఎం. మొహియుద్దీన్ ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరఫున డాక్టర్ లక్ష్మీనరసింహ హజరుకాగా.. కమిషన్ తరఫు న్యాయవాది రాజశేఖర్ వాదనలు వినిపిస్తూ.. టీజీపీఎస్సీ అప్పీు దాఖలు చేసిందని చెప్పారు. దీంతో ఈ విచారణను ఈ రోజుకు అంటే బుధవారానికి వాయిదా వేసింది. ఇక బుధవారం ఈ కేసును విచారణ చేపట్టిన హైకోర్టు.. గతంలో సింగిల్ బెంచ్ చేసిన వ్యాఖ్యలను ఈ సందర్బంగా ప్రస్తావించింది.
ఈ వార్తలు కూడా చదవండి..
అసెంబ్లీలో ఆమోదం పొందనున్న పలు బిల్లులు
కృష్ణమ్మకు వరద పోటు.. ప్రభుత్వం అలర్ట్
For More AP News And Telugu News