Qatar NRI Election: ఖతర్ తెలుగు ప్రవాసీ ఎన్నికలలో అనూహ్య తీర్పు..
ABN, Publish Date - Oct 16 , 2025 | 04:51 PM
ఖతర్లోని ఆంధ్ర కళా వేదిక ప్రవాసీ తెలుగు సంఘానికి ఉత్కంఠ భరితంగా జరిగిన ఎన్నికలలో ప్రముఖ ప్రవాసీ గొట్టిపాటి రమణ అనూహ్యంగా అఖండ విజయం సాధించారు. అంతేకాకుండా తమ గెలుపు నల్లేరుమీద నడకే అన్న విశ్వాసంతో ఉన్న ప్రత్యర్ధి శిబిరం నుండి పోటీ చేసిన వారిలో..
ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి: ఖతర్లోని ఆంధ్ర కళా వేదిక ప్రవాసీ తెలుగు సంఘానికి ఉత్కంఠ భరితంగా జరిగిన ఎన్నికలలో ప్రముఖ ప్రవాసీ గొట్టిపాటి రమణ అనూహ్యంగా అఖండ విజయం సాధించారు. అంతేకాకుండా తమ గెలుపు నల్లేరుమీద నడకే అన్న విశ్వాసంతో ఉన్న ప్రత్యర్ధి శిబిరం నుండి పోటీ చేసిన వారిలో ఏ ఒక్కరూ గెలుపు అంచుకు కూడా రాలేదు. బుధవారం రాత్రి ప్రకటించిన ఎన్నికల ఫలితాలలో రమణతో సహా ప్యానల్ నుండి పోటీ చేసిన పదకొండు మంది విజయదుందుభీ మోగించారు. మొత్తం పోల్ అయిన ఓట్లలో 73 శాతం రమణ ప్యానల్ దక్కించుకుంది.
రమణకు అత్యధికంగా అ తర్వాత వరుస క్రమంలో జి. కెన్నయ్య దొర, శాంతయ్య ఎలమంచిలి, సౌమ్య కానేటి, లోవశెట్టి వీరబాబు, యస్.వి.యల్.యన్ మూర్తి, కన్నోజు నాగేశ్వరి, శీరిషా తాళ్ళూరి, అయ్యన్న నాయుడు, నరేశ్ నూనే, ధరిణిలు ఓట్లు పొందడంతో వీరందరినీ విజేతలుగా ప్రకటించారు. రమణ ప్యానెల్ పక్షాన ప్రవాసీ ప్రముఖులు సత్యనారాయణ మలిరెడ్డి (సత్య), ప్రసాద్ కోడూరి, రమేశ్ దాసరి, అంజనేయులు, బొద్దు రామరావులు, రజనీమూర్తిలు ప్రచారం నిర్వహించగా భాగవతుల వెంకప్ప పక్షాన విక్రం సుఖవాసీ, హరీష్ రెడ్డి, సాయి రమేశ్, గోవర్ధన్ లు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు.
ఈ ఎన్నికలలో అఖండ విజయం తన భాద్యతను మరింత పెంచిందని రమణ వ్యాఖ్యానించారు. ఎన్నికలయ్యే వరకు మాత్రమే వాళ్ళు.. వీళ్ళని.. ఫలితాల తర్వాత మాత్రం అందరం ‘మేం’ అని ఆయన చెప్పారు. ఖతర్ లోని తెలుగు వారందరు ఒకే టీం అని.. జట్లు వేర్వేరుగా ఉన్నా.. టీం ఒక్కటేనని రమణ అన్నారు. అందరి సహాకారంతో సాంస్కృతిక, సంక్షేమ కార్యక్రమాలను వినూత్నంగా చేపడుతూ ముందుకు వెళ్తామని ఆయన వెల్లడించారు.
ఎన్నికలలో గెలుపు ఓటములు సహజమని, ఓటమిను కూడా తాము సమంగా స్వీకరిస్తున్నట్లుగా తెలుగు ప్రవాసీ ప్రముఖుడు వెంకప్ప భాగవతుల అన్నారు. పరాయి గడ్డపై తెలుగు సంస్కృతి పరిరక్షణ, వికాసం తమ నిరంతర ప్రక్రియ అని చెబుతూ ఎన్నికల గెలుపు ఓటములతో నిమిత్తం లేకుండా అది కొనసాగుతుందని వెంకప్ప పెర్కొన్నారు. ఎన్నికల ఫలితాలపై కూడా తమ ప్యానల్ లోతుగా విశ్లేషణ చేస్తుందని ఆయన అన్నారు.
ఖతర్లో ప్రప్రధమ తెలుగు ప్రవాసీ సంఘమైన తెలుగు కళా సమితి ఉండగా ఆ తర్వాత ఆంధ్ర కళా వేదికతో సహా అనేక ఇతర ప్రవాసీ సంఘాలు అవతరించగా అందులో ఆంధ్ర కళా వేదికను విశాఖపట్టణానికి చెందిన భాగవతుల వెంకప్ప, విక్రం సుఖవాసీలు ఒక ప్రాబల్య శక్తిగా తీర్చిదిద్దారు. సభ్యత్వ నమోదు నుండి సభా వేదిక వరకు అన్నీ వీరిద్దరి కనుసన్నలలో జరుగుతాయనే అభిప్రాయం ఉండడంతో సహాజంగా వెంకప్ప ప్యానల్కు విజయం నల్లేరు మీద నడక అని అనేకులు భావించారు.
తనతో పాటు తన ప్యానల్ నుండి పోటీ చేస్తున్న వారందరు కూడా అవతలి వైపు కంటె ఎక్కువ అధిక్యతతో విజయం సాధిస్తారని ప్రకాశం జిల్లా కొండపి ప్రాంతానికి చెందిన గొట్టిపాటి రమణ మొదటి నుండి కూడా ఆత్మవిశ్వాసంతో ఉన్నారు. దానికి తగినట్లుగానే ఆయన విజయదుందుభి మోగించారు. తెలుగు ప్రవాసీయులలో పెరిగిపోతున్న కుటుంబ పాలనకు వ్యతిరేకంగా ఇచ్చిన తీర్పు అని తెలుగు ప్రవాసీ ప్రముఖుడు, సుదీర్ఘకాలం పాటు దేశంలో నివసిస్తున్న ప్రసాద్ కోడూరి వ్యాఖ్యానించారు.
Also Read:
రెండో రోజూ అదే జోరు.. టాప్ స్టాక్స్ ఇవే..
బస్టాండ్లో మూత్రవిసర్జన చేశాడంటూ..
2 నెలల్లో మరణం.. యువకుడి ఎమోషనల్ పోస్ట్..
Updated Date - Oct 16 , 2025 | 04:51 PM