Assembly elections: 50 నియోజకవర్గాలపై బీజేపీ దృష్టి..
ABN, Publish Date - Aug 14 , 2025 | 11:56 AM
రాష్ట్రంలో గట్టిగా నిలదొక్కుకోవాలనే ఆకాంక్ష, బలమైన మిత్రపక్షాలు జతకట్టపోవడం, కూటమిలో బోలెడన్ని స్థానాలున్న నేపథ్యంలో ఈ సారి ఎన్నికల్లో అధిక స్థానాల్లో పోటీ చేయాలని బీజేపీ భావిస్తోంది. ఇందులో భాగంగా ఈసారి 50 చోట్ల పోటీ చేయాలనే ఆలోచనలో ఉంది.
- ఇప్పటికే ఆయా స్థానాలను గుర్తించిన నేతలు
చెన్నై: రాష్ట్రంలో గట్టిగా నిలదొక్కుకోవాలనే ఆకాంక్ష, బలమైన మిత్రపక్షాలు జతకట్టపోవడం, కూటమిలో బోలెడన్ని స్థానాలున్న నేపథ్యంలో ఈ సారి ఎన్నికల్లో అధిక స్థానాల్లో పోటీ చేయాలని బీజేపీ(BJP) భావిస్తోంది. ఇందులో భాగంగా ఈసారి 50 చోట్ల పోటీ చేయాలనే ఆలోచనలో ఉంది. తమకు బలమున్న స్థానాలను ఇప్పటికే గుర్తించిన బీజేపీ రాష్ట్ర నాయకత్వం... ఆ మేరకు జాబితా సిద్ధం చేసినట్లు తెలిసింది. అన్నాడీఎంకేపై ఒత్తిడి తెచ్చి, ఆ మేరకు స్థానాలను చేజిక్కించుకోవాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.
అంతేగాక రాజధాని చెన్నైలో ఈ సారి ఎలాగైనా బోణీ కొట్టాలని కూడా బీజేపీ నాయకత్వం అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తోంది. గత లోక్సభ ఎన్నికల్లో అన్నాడీఎంకే, బీజేపీ వేర్వేరుగా పోటీ చేయడంతో డీఎంకే లబ్ధి పొందింది. ఆరణి, కళ్లకుర్చి, విల్లుపురం, నామక్కల్, కోయంబత్తూరు, ధర్మపురి, కృష్ణగిరి, కడలూరు, చిదంబరం, తెన్కాశి, విరుదునగర్ తదితర నియోజకవర్గాల్లో అన్నాడీఎంకే-బీజేపీ అభ్యర్థుల ఓట్లను లెక్కిస్తే.. విజయం సాధించిన అభ్యర్థుల కన్నా అధికంగా వున్నట్లు తేలింది.
దీంతో ఆయా నియోజకవర్గాల్లో ఈ రెండు పార్టీలు విడిపోవడం వల్లనే నష్టపోయినట్లు స్పష్టమైంది. చెన్నైలోని 18 నియోజకవర్గాల్లో 13 చోట్ల తాము రెండో స్థానంలో వుంటామని బీజేపీ నేతలు చెబుతున్నారు. లోక్సభ ఎన్నికల్లో అసెంబ్లీ నియోజకవర్గాల వారికి తమకు వచ్చిన ఓట్లను లెక్కించుకుని, ఆ మేరకు అడుగులు వేస్తున్నట్లు సమాచారం. గత అసెంబ్లీ ఎన్నికల్లో 20 చోట్ల పోటీ చేసిన బీజేపీ 4 స్థానాలను కైవసం చేసుకోగలిగింది. ఈసారి మాత్రం 50 స్థానాల్లో పోటీ చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నయినార్ నాగేంద్రన్ నేతృత్వంలోని నాయకత్వం కృతనిశ్చయంతో ఉంది.
శశికళ రాష్ట్ర వ్యాప్త పర్యటనకు ఏర్పాట్లు
అన్నాడీఎంకే దరిచేరనీయక, సొంత పార్టీ ఏర్పాటుకు స్థోమత లేక డీలాపడిన దివంగత ముఖ్యమంత్రి జయలలిత నెచ్చెలి శశికళ.. రాష్ట్ర వ్యాప్త పర్యటనకు సిద్ధమవుతున్నారు. అక్రమాస్తుల కేసులో అరెస్టైన అనంతరం శశికళకు ప్రాభవంతో పాటు అన్నాడీఎంపై పూర్తిగా పట్టుపోయింది. జైలు నుంచి వచ్చాక మళ్లీ అన్నాడీఎంకేలోకి అడుగు పెట్టేందుకు ఆమె చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. అయితే అన్నాడీఎంకేలోని అసంతుష్ట నేతలంతా మళ్లీ ఒక్కటవుతారని,
పార్టీకి పూర్వ వైభవం వస్తుందంటూ ఆమె వరుసగా అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి హోదాలో ప్రకటనలు గుప్పిస్తూనే వున్నారు. కానీ ఎక్కడా ఆ ప్రయత్నాలు సఫలమైనట్లు కనిపించడం లేదు. ఆమె నమ్ముకున్న బీజేపీ గానీ, ఆమెకు నమ్మకద్రోహం చేసిన నేతలు గానీ ఆమెను దరి చేర్చుకునే అవకాశాలు కూడా కనిపించడం లేదు. చివర్లో ఆమె పంచన చేరిన ఓపీఎ్సకు గానీ, బంధువు టీటీవీ దినకరన్ గానీ ఆమెను బలోపేతం చేసే పరిస్థితి లేకుండాపోయింది. ఈ నేపథ్యంలో శశికళ రాష్ట్ర వ్యాప్త పర్యటన చేయాలని నిర్ణయించుకున్నారు. తద్వారా తన ప్రత్యర్థులను పరోక్షంగా నష్టపరిచేందుకు ఆమె సన్నాహాలు చేసుకుంటున్నట్లు సమాచారం.
ఈ వార్తలు కూడా చదవండి..
పాకిస్థాన్ బెదిరింపులకు భయపడేది లేదు
బెట్టింగ్ యాప్స్ కేసులో ఈడీ విచారణకు హాజరైన మంచు లక్ష్మి
Read Latest Telangana News and National News
Updated Date - Aug 14 , 2025 | 11:56 AM