Health: రోగమేదైనా చికిత్సకు సిద్ధం..
ABN, Publish Date - Jun 17 , 2025 | 10:59 AM
కొవిడ్ వచ్చిందా... గుండెనొప్పా, ఛాతీలో మంటా లేదా గ్యాస్ర్టిక్ ఇబ్బందులా.. సమస్య ఏదైనా సరే చికిత్స చేస్తామంటున్నారు ఆర్ఎంపీలు. ఆరోగ్య పరిస్థితిపై అవగాహన లేకుండా ఓ ఇంజెక్షన్ ఇచ్చి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు.
- ఇంజెక్షన్ ఇవ్వడం.. యాంటీబయాటిక్లు రాయడం
- అవసరమైతే సెలైన్ ఎక్కించడం
- పరిస్థితి విషమిస్తే చేతులెత్తేయడం
- నగరంలో ఆర్ఎంపీల తీరిది
- ఓ యువకుడి మృతితో వీరి లీలలు మళ్లీ వెలుగులోకి
హైదరాబాద్ సిటీ: కొవిడ్ వచ్చిందా... గుండెనొప్పా, ఛాతీలో మంటా లేదా గ్యాస్ర్టిక్ ఇబ్బందులా.. సమస్య ఏదైనా సరే చికిత్స చేస్తామంటున్నారు ఆర్ఎంపీలు. ఆరోగ్య పరిస్థితిపై అవగాహన లేకుండా ఓ ఇంజెక్షన్ ఇచ్చి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఏదైనా సమస్యతో వస్తే సెలైన్ ఎక్కించడం, లేదా ఒకరోజు క్లినిక్లో అడ్మిట్ చేసుకుని తెలిసీ తెలియని వైద్యం చేసి వారి ప్రాణాల మీదకు తెస్తున్నారు. కొన్ని సందర్భాల్లో ఆరోగ్య పరిస్థితి విషమిస్తే చేతులు ఎత్తేసి గాయబ్ అవుతున్నారు. తాజాగా ఇటువంటి పరిస్థితే ఆల్వాల్లో ఓ యువకుడిని బలితీసుకుంది. నిజానికి ఆర్ఎంపీ(RMP)లు కేవలం ఫస్ట్ ఎయిడ్ వైద్యం అందించాలి.
ఎవరికైనా గాయాలైతే ఆ భాగంలో శుభ్రం చేసి కట్టుకట్టాలి. అవసరమైతే ఆస్పత్రికి రెఫర్ చేయాల్సి ఉంటుంది. కానీ, తమ వద్దకు ఏ రోగి వచ్చినా వైద్యం అందిస్తున్నారు. సాధారణ జ్వరం నుంచి కొవిడ్ వరకు అన్నిరకాల వైద్యాన్ని అందిస్తూ వస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్లో అనేకమంది ఈ రకం వైద్యం నిర్వహిస్తున్నారు. శివారు ప్రాంతాల్లోనే కాదు, నగరం నడిబొడ్డులో ఈ నకిలీ వైద్యుల దందా జోరుగా సాగుతున్నది.
యథేచ్ఛగా యాంటీబయాటిక్ల వినియోగం
క్లినిక్కు ఎవరైనా రోగి రాగానే యాంటీబయెటిక్ లేదా ఇంజెక్షన్లు ఇస్తున్నారు. బాగా నీరసంగా ఉన్న వ్యక్తులకు క్లినిక్లోనే సెలైన్ కూడా ఎక్కిస్తున్నారు. ప్రైవేట్ ల్యాబ్ నిర్వాహకులతో సంబంధాలు పెట్టుకుని వ్యాధి నిర్ధారణ కు నమునాలను సేకరిస్తున్నారు. ఇలా అన్నిరకాల వైద్య సేవలను అందించి ప్రాణాలకు ముప్పు తెస్తున్నారు.
ఫస్ట్ ఎయిడ్ సెంటర్ పేరుతో..
చాలాచోట్ల ఫస్ట్ఎయిడ్ సెంటర్ను ఏర్పాటు చేసి అన్ని రకాల వైద్య చికిత్సలు అందిస్తున్నారు. నిజానికి ఫస్ట్ ఎయిడ్లో శిక్షణ పొందిన వారు సెంటర్లు ఏర్పా టు చేసుకోవచ్చు. ఎవరికైనా గాయాలు అయినపుడు, ప్రమాదాల్లో దెబ్బలు తగిలినప్పుడు తమ సెంటర్లో ప్రాథమిక వైద్యం అందించవచ్చు. కానీ సెంటర్ నిర్వాహకులు కూడా తమ పేరు పక్కన డాక్టర్ అని తగిలించుకుని చికిత్సలు చేస్తున్నారు. ఇక పాతబస్తీలో కొన్నిచోట్ల వనమూలికలతో చికిత్స అందిస్తున్నారు. వీరిపై అజమాయిషీ చేసే వారు లేకపోవడం, తనిఖీలు నిర్వహించకపోవడంతో వారు ఆడిందే ఆటగా క్లినిక్లు పనిచేస్తున్నాయి.
పాతబస్తీ, శివారు ప్రాంతాల్లో
పాతబస్తీలో 30 మంది వరకు నకిలీ డాక్టర్లు ఉన్నట్లు ఒక అంచనా. ఇది కేవలం దృష్టికి వచ్చిన కేసులు మాత్రమే. వందల సంఖ్యలో నకిలీ వైద్యులు క్లినిక్లు తెరిచి వైద్యం అందిస్తున్నట్లు తెలుస్తోంది. బొల్లారం, బోయిన్పల్లి, కుత్బుల్లాపూర్, కూకట్పల్లి, షాపూర్నగర్, బోరబండ, రహ్మత్నగర్, మెహిదీటపట్నం, పాతబస్తీ, తదితర ప్రాంతాల్లో నకిలీ వైద్యానికి అడ్డూ అదుపు లేకుండా పోతుంది. ఓ డాక్టర్ దగ్గర లేదా ఓ నర్సింగ్ హోమ్లో నర్స్గా పనిచేస్తే చాలు.. ఆ కాస్త అనుభవంతో వైద్యం చేసి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు.
నగరంలో జరిగిన కొన్ని సంఘటనలు
- తాజాగా బొల్లారం రిసాలబజార్కు చెందిన విగ్నేశ్వర ఙానేశ్వర్ కుమార్కు ఆదివారం రాత్రి భోజనం తర్వాత గ్యాస్ట్రిక్ సమస్య రావడంతో స్ధానిక ఆర్ఎంపీని సంప్రదించగా, ఓ ఇంజక్షన్ ఇవ్వడంతో ఇంటికి వచ్చిన తర్వాత అతను ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. చికిత్స కోసం ఆస్పత్రి తరలించగానే చనిపోయినట్లు నిర్దారించారు.
- పాతబస్తీలో ఓ బాలికకు జ్వరం వస్తే సమీపంలోని ఓ క్లినిక్కు తీసుకెళ్లి చూయించారు. అక్కడ మహిళా డాక్టర్ పరీక్షలు చేసి ఇంజెక్షన్ చేసి పంపించారు. మరుసటి రోజు ఆ బాలిక పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారడంతో బస్తీ వాసులు సదరు డాక్టర్ను నిలదీశారు. ఆరా తీస్తే వైద్యం చేసిన డాక్టర్ నకిలీ వైద్యురాలని తేలింది.
- 2017 సెప్టెంబరు 11న నార్సింగ్లో తీవ్ర జ్వరం వచ్చిన బాలికను సమీపంలోని పద్మావతి క్లినిక్కు తీసుకెళ్లి చూయించారు. అక్కడ డాక్టర్గా చలామణి అవుతున్న ఒకరు ఇంజెక్షన్ చేసి, మందులు ఇచ్చి పంపించారు. రెండు రోజుల తర్వాత ఆ బాలిక పరిస్థితి విషమించింది.
- కొవిడ్ సమయంలో చందానగర్లో ఓ వ్యక్తికి జలుబు, దగ్గు, అయాసం రావడంతో ఓ ఆర్ఎంపీ తన క్లినిక్లో చేర్చుకుని వైద్యం చేశారు. పరిస్థితి విషమించడంతో హుటాహుటీన చెస్ట్ ఆస్పత్రికి తరలించారు.
ఈ వార్తలు కూడా చదవండి.
గరిష్టానికి చేరుకుని, మళ్లీ తగ్గిన బంగారం, వెండి ధరలు
‘ధరణి’పై ఫోరెన్సిక్ ఆడిట్ షురూ
Read Latest Telangana News and National News
Updated Date - Jun 17 , 2025 | 11:04 AM