Bihar Elections: బిహార్ను నెంబర్ వన్ రాష్ట్రంగా చేస్తాం: తేజస్వి
ABN, Publish Date - Nov 10 , 2025 | 03:06 PM
నవంబర్ 6న తొలి విడత పోలింగ్ జరిగి నాలుగు రోజులైనా గణాంకాలను ఇంతవరకూ ఈసీ బయటకు వెల్లడించలేదని తేజస్వి ఆరోపించారు. గతంలో ఎన్నికల రోజే ఓటింగ్ గణాంకాలను వెల్లడించేవారని, ఇప్పుడు ఎందుకు దాచిపెడుతున్నారని ప్రశ్నించారు.
పాట్నా: నవంబర్ 14వ తేదీ తర్వాత బిహార్ను నెంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని ఆర్జేడీ (RJD) నేత, మహాగఠ్బంధన్ ముఖ్యమంత్రి అభ్యర్థి తేజస్వి యాదవ్ (Tejashwi Yadav) తెలిపారు. బిహార్ను అట్టడుగు స్థాయిలోకి ఎన్డీయే నెట్టేసిందని, పోలింగ్కు ముందు ఎన్నికల అధికారులను కేంద్ర మంత్రులు బెదిరిస్తున్నారని ఆరోపించారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికల రెండో విడత పోలింగ్ మరికొద్ది గంటల్లోనే జరుగనుండటంతో సోమవారంనాడు మీడియా సమావేశంలో తేజస్వి మాట్లాడారు.
'నవంబర్ 14 తర్వాత బిహార్ను దేశంలోనే నెంబర్ వన్ స్థాయికి తీసుకువెళ్తాం. ఆహార ఆధారిత యూనిట్లు, విద్య, వైద్యం, ఉపాధి కల్పన, ఇరిగేషన్, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు, ఎడ్యుకేషనల్ సిటీలు, ఐటీ హబ్లు ఏర్పాటు చేస్తాం. ఏ ఒక్క బిహారీ కూడా ఇతర సిటీలకు వెళ్లాల్సిన పని లేదు' అని తేజస్వి తెలిపారు. ఈసారి చాలా స్పష్టంగా బిహార్లో మార్పు కనిపిస్తోందని, ఉద్యోగాలు కల్పించే ప్రభుత్వాన్నే అధికారంలోకి తీసుకురావాలని ప్రజలు బలంగా తీర్మానించుకున్నారని, ప్రజలు చరిత్ర సృష్టించనున్నారని చెప్పారు.
డాటా దాచిపెట్టారు
నవంబర్ 6న తొలి విడత పోలింగ్ జరిగి నాలుగు రోజులైనా గణాంకాలను ఇంతవరకూ ఈసీ బయటకు వెల్లడించలేదని తేజస్వి ఆరోపించారు. గతంలో ఎన్నికల రోజే ఓటింగ్ గణాంకాలను వెల్లడించేవారని, ఇప్పుడు ఎందుకు దాచిపెడుతున్నారని ప్రశ్నించారు. బీజేపీ పాపాలను ఎన్నికల కమిషన్ కప్పిపుచ్చుతోందని, ఎన్నికల కమిషన్ నిర్జీవంగా, బిజేపీకి ఒక ఉపకరణంగా మారిందని విమర్శలు గుప్పించారు. తొలి విడత పోలింగ్లో మహిళలు, పురుషుల ఓటింగ్ శాతాన్ని ఎన్నికల కమిషన్ ఎందుకు ప్రచురించలేదో వివరణ ఇవ్వాలని తేజస్వి డిమాండ్ చేసారు. లెక్కలు ఎందుకు దాచిపెడుతున్నారో చెప్పాలన్నారు. వీవీప్యాట్ స్లిప్పులు వీధుల్లో కనిపిస్తున్నాయని, సీసీటీవీ కెమెరాలను మూసిపెట్టి ఉంచుతున్నారని, ఈ అవకతవకలపై ఈసీ వివరణ ఇవ్వాలని అన్నారు.
బిహార్ అసెంబ్లీ ఎన్నికల తొలి విడత పోలింగ్ నవంబర్ 6న ప్రశాంతంగా జరిగింది. 65.08 శాతం పోలింగ్ రికార్డయింది. 18 జిల్లాల్లోని 121 నియోజకవర్గాల్లో పోలింగ్ జరిగింది. రెండో విడత పోలింగ్ 123 నియోజకవర్గాల్లో నవంబర్ 11న జరుగనుంది. దీంతో ఓటింగ్ ప్రక్రియ పూర్తవుతుంది. నవంబర్ 14న ఎన్నికల ఫలితాలు వెలువడతాయి.
ఇవి కూడా చదవండి..
ఓట్ల చోరీని అడ్డుకుంటే.. బిహార్లో విజయం మాదే!
పీఎం కిసాన్పై బిగ్ అప్డేట్.. రైతులు తప్పక తెలుసుకోండి..
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Nov 10 , 2025 | 03:13 PM