Devadaya Tribunal Order: బుగ్గమఠం భూములపై దేవదాయ ట్రైబ్యునల్’ను ఆశ్రయించండి
ABN, Publish Date - May 23 , 2025 | 07:21 AM
బుగ్గమఠం భూముల ఖాళీ సమస్యపై వైసీపీ నేత పెద్దిరెడ్డికి హైకోర్టు దేవదాయ అప్పిలేట్ ట్రైబ్యునల్ను ఆశ్రయించాలని ఆదేశించింది. అన్ని అభ్యంతరాలను ట్రైబ్యునల్ ముందే సమర్పించాలని సూచించింది.
వైసీపీ నేత పెద్దిరెడ్డికి హైకోర్టు ఆదేశం
అమరావతి, మే 22(ఆంధ్రజ్యోతి): బుగ్గమఠం భూములు ఖాళీ చేయాలంటూ మఠం అసిస్టెంట్ కమిషనర్/ ఈవో ఇచ్చిన ప్రొసీడింగ్స్పై దేవదాయ అప్పిలేట్ ట్రైబ్యునల్ను ఆశ్రయించాలని వైసీపీ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని హైకోర్టు ఆదేశించింది. అభ్యంతరాలన్నింటినీ ట్రైబ్యునల్ ముందే లేవనెత్తాలని స్పష్టం చేసింది. భూములు, నిర్మాణాల వ్యవహారంలో 2వారాల పాటు తొందరపాటు చర్యలు తీసుకోవద్దని దేవదాయశాఖ అధికారులకు స్పష్టం చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ వై.లక్ష్మణరావు గురువారం ఉత్తర్వులు ఇచ్చారు. తిరుపతి, ఎం.ఆర్పల్లి, మారుతి నగర్ ఎక్స్టెన్షన్ పరిధిలో సర్వే నం. 261/1, 261/2లోని 3.88 ఎకరాల బుగ్గమఠం భూములను పెద్దిరెడ్డి ఆక్రమించారని నిర్ధారిస్తూ, ఆ భూములు ఖాళీ చేయాలంటూ బుగ్గమఠం అసిస్టెంట్ కమిషనర్/ఈవో మే 16న ప్రొసీడింగ్స్ ఇచ్చారు. వాటిని సవాల్ చేస్తూ పెద్దిరెడ్డి గురువారం అత్యవసరంగా పిటిషన్ దాఖలు చేశారు. న్యాయమూర్తి లంచ్మోషన్గా విచారణకు స్వీకరించారు. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది వైవీ రవిప్రసాద్, న్యాయవాది నర్సిరెడ్డి.. రాష్ట్ర ప్రభుత్వం, బుగ్గమఠం తరఫున ఏజీ దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపించారు.
Updated Date - May 23 , 2025 | 07:22 AM