CM Chandrababu: ప్రశాంతిపై ప్రసన్న వ్యాఖ్యలు.. సీఎం చంద్రబాబు రియాక్షన్
ABN, Publish Date - Jul 08 , 2025 | 09:46 PM
మహిళలపై వ్యక్తిగత విమర్శలు చేసి వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ప్రవర్తిస్తున్న వీరు మనుషులేనా? అంటూ వైసీపీ నేతలను సీఎం చంద్రబాబు సూటిగా ప్రశ్నించారు. ఇది రాజకీయమా? అంటూ వైసీపీ నేతల వ్యవహరిస్తున్న తీరుపై ఆయన సందేహం వ్యక్తం చేశారు.
అమరావతి, జులై 08: కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డిపై వైసీపీ మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు అత్యంత జుగుప్సాకరమని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. మహిళలను అవమానపరచడం, వ్యక్తిత్వ హననానికి పాల్పడటం ఆ పార్టీ డీఎన్ఏలోనే ఉందంటూ వైసీపీ నేతలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం అమరావతిలో సీఎం నారా చంద్రబాబు నాయుడు విలేకర్లతో మాట్లాడుతూ.. ప్రశాంతి రెడ్డిపై చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు.
వైసీపీ నేతల తీరులో మార్పు రావడం లేదని ఆయన మండిపడ్డారు. మహిళలను దూషించడం, బూతులు తిట్టడం, కించపరచడం అనేది ఆ పార్టీ రాజకీయ సిద్ధాంతంగా పెట్టుకుందని విమర్శించారు. పార్టీ ఘోర ఓటమికి ఇలాంటి పోకడలు ఒక కారణమని తెలిసినా.. వారి సహజ గుణంలో మాత్రం మార్పు రావడం లేదన్నారు. చెల్లి పుట్టుకపైనా వ్యాఖ్యలు చేసిన వారి నాయకత్వంలో పని చేస్తోన్న నేతలు అంతే దారుణంగా, అసహ్యంగా మాట్లాడుతూ వారి నీచ సంస్కృతిని చాటుకుంటున్నారని వైసీపీ నేతలపై సీఎం చంద్రబాబు మండిపడ్డారు.
మహిళలపై వ్యక్తిగత విమర్శలు చేసి వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ప్రవర్తిస్తున్న వీరు మనుషులేనా? అని ప్రశ్నించారు. ఇది రాజకీయమా? అంటూ వైసీపీ నేతల వ్యవహరిస్తున్న తీరుపై సందేహం వ్యక్తం చేశారు. మహిళలు, మహిళా నాయకుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ప్రణాళికా బద్దంగా వైసీపీ చేస్తున్న కుట్రలను ప్రతి పౌరుడు గమనించాలని ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు సూచించారు. మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తించిన వారిపై చట్టపరంగా కఠిన చర్యలు ఉంటాయని ఆయన స్పష్టం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
పర్యటనల పేరుతో విధ్వంసానికి జగన్ మాస్టర్ ప్లాన్.!!
బనకచర్లతో తెలంగాణకు ఎలాంటి నష్టం ఉండదు: సీఎం చంద్రబాబు
For AndhraPradesh News And Telugu News
Updated Date - Jul 08 , 2025 | 09:56 PM