పైసలిస్తామన్నా.. పట్టించుకోలే
ABN, Publish Date - May 17 , 2025 | 03:48 AM
రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ కార్యనిర్వాహక సంచాలకుడు (ఈడీ) సిహెచ్.విజయ్పై వేటు పడింది. రాష్ట్ర ప్రభుత్వం ఆయన్ను మాతృశాఖ అయిన ఎక్సైజ్ శాఖకు బదిలీ చేసింది.
అందాల పోటీల స్పాన్సర్ల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన పర్యాటక సంస్థ ఈడీ బదిలీ
ఎక్సైజ్ శాఖలో రిపోర్టు చేసిన విజయ్
రాబడి 3 కోట్ల నుంచి 30లక్ష లకు పడిపోవడంపైనా
విచారణకు ఆదేశించిన సర్కారు!
‘మిస్ వరల్డ్’ తర్వాత పర్యాటక సంస్థ ప్రక్షాళన
హైదరాబాద్, మే 16 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ కార్యనిర్వాహక సంచాలకుడు (ఈడీ) సిహెచ్.విజయ్పై వేటు పడింది. రాష్ట్ర ప్రభుత్వం ఆయన్ను మాతృశాఖ అయిన ఎక్సైజ్ శాఖకు బదిలీ చేసింది. దీంతో కొద్ది రోజులుగా సంస్థ ఎండీ, ఈడీల మధ్య కొనసాగుతున్న ఆధిపత్య పోరుకు తెరదించినట్లయింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న మిస్ వరల్డ్-2025 పోటీలకు సహకారం అందించేందుకు ముందుకొచ్చిన యాజమాన్యాలు, సంస్థల ప్రతినిధులను సమన్వయం చేయడంలో పర్యాటక సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రకాశ్రెడ్డి, ఈడీ విజయ్ బాధ్యతారహితంగా వ్యవహరించారనే ఫిర్యాదులు వచ్చాయి. విజయ్ డిప్యుటేషన్పై పర్యాటక అభివృద్ధి సంస్థ ఈడీగా ఎనిమిది నెలలుగా పనిచేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ప్రపంచ సుందరి పోటీల బాధ్యతలను పర్యాటక శాఖకు అప్పగించింది. సుమారు 22 రోజుల పాటు రాష్ట్రంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమ నిర్వహణకు ప్రాయోజకులుగా ఉంటామంటూ పలు కార్పొరేట్ సంస్థలు, విద్యా సంస్థలు, జాతీయ బ్యాంకులు ముందుకు వచ్చాయి. ఆయా సంస్థల ప్రతినిధులను సమన్వయం చేసుకొని, కార్యాచరణ ఖరారు చేసే బాధ్యతలను ప్రభుత్వం పర్యాటకాభివృద్ధి సంస్థకు అప్పగించింది. అయితే సంస్థలో కాంట్రాక్ట్ ఉద్యోగుల నియామకాలు, సంస్థ కార్యకలాపాల నిర్వహణపై ఎండీ ప్రకాశ్రెడ్డి, ఈడీ విజయ్ మధ్య విభేదాలు తలెత్తాయి.
ఈ విషయాన్ని సంబంధిత మంత్రి దృష్టికి తీసుకెళ్లగా సర్దుకుపోవాలని ఇద్దరికీ సూచించినట్లు తెలిసింది. అదే సమయంలో మిస్వరల్డ్ పోటీల నిర్వహణకు నిధులు సమకూర్చడానికి ముందుకొచ్చిన సంస్థల ప్రతినిధులు ఎండీ ప్రకాశ్రెడ్డిని సంప్రదించగా.. ఆయన ఈడీ విజయ్ను కలవాలని సూచించినట్లు తెలిసింది. ప్రతినిధులతో ఆయన సంప్రదింపులు జరిపినప్పటికీ స్పష్టమైన కార్యాచరణ, స్పాన్సర్షి్పకు అవకాశం ఉన్న కార్యక్రమాలపై సమాచారం ఇవ్వకుండా జాప్యం చేసినట్లు సమాచారం. ఫలితంగా పోటీలను స్పాన్సర్ చేయలేమంటూ కార్పొరేట్ సంస్థల ప్రతినిధులు, బ్యాంకర్లు వెళ్లిపోయారు. మిస్ వరల్డ్ పోటీలకయ్యే రూ.27 కోట్ల ఖర్చులో సుమారు 25 కోట్ల వరకు స్పాన్సర్ల ద్వారా సమకూరుతుందని సర్కారు భావించింది. అయితే పర్యాటక సంస్థ అధికారుల నిర్లక్ష్యంతో స్పాన్సర్లు వెనక్కి వెళ్లిన విషయం సీఎం రేవంత్కు తెలిసింది. దీనిపై వివరణ కోరగా ఈడీ నిర్లక్ష్యంగా వ్యహరించారంటూ ఎండీ ప్రకాశ్రెడ్డి నివేదించినట్లు సమాచారం. ఈడీ విజయ్ను బదిలీ చేయాలని ఆదేశించినట్లు తెలిసింది.
ఈ క్రమంలో విజయ్ మంత్రి జూపల్లి ద్వారా వెళ్లి సీఎంను కలిసి.. తనను అడుగడుగునా అడ్డుకుంటున్నారంటూ ప్రకాశ్రెడ్డిపై ఫిర్యాదు చేసినట్లు సమాచారం. దీంతో ప్రకాశ్రెడ్డిని మిస్ వరల్డ్ పోటీల నిర్వహణ బాధ్యతల నుంచి తప్పించిన సర్కారు.. ఆ పనులను విజయ్కు అప్పగించింది. కాగా.. ఇటీవల పర్యాటక సంస్థలో జరుగుతున్న కార్యకలాపాలు, రవాణా విభాగంలో అత్యవసర బిల్లుల చెల్లింపులు, ఉద్యోగులు, అధికారుల మధ్య జరుగుతున్న ఘర్షణలను తెలుసుకున్న ప్రభుత్వం.. ఈడీ విజయ్ను తక్షణమే వైదొలగాలని ఆదేశించింది. ఆయన గురువారం సాయంత్రం బాధ్యతల నుంచి తప్పుకొని ఎక్సైజ్ శాఖలో రిపోర్టు చేసినట్లు తెలిసింది. పర్యాటక సంస్థలో గత ఏడాదిగా ఆదాయం రూ.3 కోట్ల నుంచి 30 లక్షలకు పడిపోవడం పైనా ప్రభుత్వం విచారణకు ఆదేశించినట్లు సమాచారం. మిస్వరల్డ్ పోటీల తర్వాత పర్యాటక సంస్థ కార్యకలాపాలను సమూలంగా ప్రక్షాళన చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది.
ఈ వార్తలు కూడా చదవండి
Vamsi Remand News: వంశీకి రిమాండ్లో మరో రిమాండ్
Minister Lokesh: రెన్యూవబుల్ పరిశ్రమ మాత్రమే కాదు.. ఉద్యమం
Liquor Scam Arrests: ఏపీ లిక్కర్ స్కాంలో మరిన్ని అరెస్ట్లు.. జోరుగా చర్చ
Amaravati: ప్రమాదకరంగా అమరావతి కరకట్ట రోడ్డు
For More AP News and Telugu News
Updated Date - May 17 , 2025 | 03:49 AM