Cotton Procurement Scam: ఏఈవోలు, ఏవోల మెడకు బిగుస్తున్న ఉచ్చు
ABN, Publish Date - May 02 , 2025 | 05:22 AM
రైతులకు తెలియకుండా వారి పేర్లపై పత్తి ధ్రువీకరణ పత్రాలు జారీ చేసి, అక్రమంగా పత్తి కొనుగోలు, విక్రయాలు నిర్వహించిన వ్యవసాయ శాఖ అధికారులపై ఉచ్చు బిగుతోంది. ఆదిలాబాద్, భద్రాద్రి-కొత్తగూడెం జిల్లాల్లో నకిలీ టీఆర్ పుస్తకాలు ముద్రించి మిల్లర్లకు అందించిన ఘటనలు వెలుగులోకి వచ్చాయి.
జిన్నింగ్ మిల్లర్లకు యథేచ్ఛగా ధ్రువపత్రాల పంపిణీ
ఆదిలాబాద్ జిల్లాలో టీఆర్ పుస్తకాలు పంచుకుని దందా
రైతులకు తెలియకుండా వారిపేర్ల మీద పత్తి అమ్మకాలు
భద్రాద్రి-కొత్తగూడెంలో ఏకంగా నకిలీ పుస్తకాల ముద్రణ
కొత్తగూడెం రైతుల పేరిట సిద్దిపేట జిల్లాలో విక్రయాలు
హైదరాబాద్, మే 1 (ఆంధ్రజ్యోతి): రైతులకు తెలియకుండా వారి పేర్లపై పత్తి సాగు ధ్రువీకరణ పత్రాలు జారీ చేయటం, ప్రభుత్వం పంపిణీ చేసిన తాత్కాలిక రిజిస్ట్రేషన్ (టీఆర్) పుస్తకాలను వాటాల వంతున పంచుకోవటం, మరో అడుగు ముందుకేసి నకిలీ టీఆర్ పుస్తకాలు ముద్రించి జిన్నింగ్ మిల్లర్లకు అప్పజెప్పటం, ఒక మండలంలో పనిచేస్తూ మరో మండలానికి చెందిన రైతుల పేరిట ధ్రువపత్రాలు ఇవ్వడం... ఇలా వ్యవసాయ శాఖ ఏఈవోలు, ఏవోల లీలలు అన్నీ ఇన్నీ కావు. పత్తి కొనుగోళ్లలో జరిగిన అక్రమాలపై ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించిన నేపథ్యంలో తీగ లాగితే డొంక కదులుతోంది. రైతుల నుంచి తక్కువ ధరకు పత్తి కొని, కనీస మద్దతు ధర (ఎమ్మెస్పీ)కు భారత పత్తి సంస్థ (సీసీఐ)కు అమ్మి అక్రమార్కులు లాభపడ్డారు. ఇందుకు వ్యవసాయ శాఖ జారీ చేసిన 60 వేల సాగు ధ్రువీకరణ పత్రాలే కారణం కావటం గమనార్హం. ఈ వ్యవహారంలో ఏఈవోలు, ఏవోల మెడకు ఉచ్చు బిగుస్తోంది. ఆదిలాబాద్ జిల్లాలో పత్తి సాగు చేసిన విస్తీర్ణానికి మించి విక్రయాలు జరిగాయి. పంటల నమోదు పోర్టల్లో పేర్లు లేని రైతులు సీసీఐకి పత్తి విక్రయించాలంటే వ్యవసాయ విస్తరణాధికారులు (ఏఈవోలు) టీఆర్ ధ్రువపత్రాలు జారీ చేయాల్సి ఉంటుంది. ముందుగా సంబంధిత రైతులకు ఎంత భూమి ఉంది? పత్తి వేశారా? లేదా? అని ధ్రువీకరించుకోవాలి. దీనికి భిన్నంగా ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల వ్యవసాయాధికారి జిన్నింగ్ మిల్లర్లతో మిలాఖత్ అయ్యి కొన్ని టీఆర్ పుస్తకాలను వారి చేతిలో పెట్టారు.
మరికొన్ని పుస్తకాలను ఏఈవోకు అప్పజెప్పారు. రైతులతో సంబంధం లేకుండా మిల్లర్లు పత్తిని సీసీఐకి విక్రయించుకునేందుకు వీలుగా మూడు మండలాలకు చెందిన రైతుల పేరిట టీఆర్లు జారీ చేసినట్లు ప్రాఽథకమిక విచారణలో తేలింది. ఆశ్చర్యకర విషయం ఏమిటంటే... ఇచ్చోడ ఏవో తన మండల పరిధి దాటి సిరికొండ, గుడిహత్నూర్ మండలాల్లో కూడా టీఆర్లు జారీ చేసినట్లు వెలుగులోకి వచ్చింది. ఇంద్రవెల్లి మండలంలో కూడా రైతులకు బదులుగా జిన్నింగ్ మిల్లర్ల చేతికే టీఆర్ పత్రాలు ఇచ్చినట్లు తేలింది. అయితే ఇచ్చోడ ఏవో జాదవ్ కైలా్షను ఇప్పటికే సస్పెండ్ చేశారు. భదాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండల వ్యవసాయ అధికారి సాయిశంతన్ కుమార్... టీఆర్ల జారీకి లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. ఈ వ్యవహారంలో జిన్నింగ్ మాఫియా హస్తం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అశ్వాపురం మండలంలో పనిచేసే ఒక ఏఈవో... ప్రభుత్వం పంపిన టీఆర్ పుస్తకాలు కాకుండా, స్థానిక ప్రింటింగ్ ప్రెస్లో తానే టీఆర్ పుస్తకాలు ముద్రణ చేయించి, జిన్నింగ్ మిల్లర్లకు సంతకాలు చేసి ఇచ్చినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నెల్లిపాక సీసీఐ కొనుగోలు కేంద్రంలో సుమారు రూ.5 కోట్ల విలువైన అక్రమ ట్రేడింగ్ జరిగినట్లు ఫిర్యాదులు వచ్చాయి. విచిత్రం ఏమిటంటే... భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన రైతుల పేరుతో సిద్దిపేట జిల్లాలో పత్తి అమ్మకాలు జరిగాయి.
కొత్తగూడెం రైతుల పేర్లతో ఖమ్మం, నల్లగొండ, వరంగల్ జిల్లాల్లో అమ్మకాలు జరిగాయంటే... పొరుగు జిల్లాలే కదా? రైతులు తీసుకెళ్లి అమ్ముకుంటారులే! అనుకోవచ్చు. కానీ కొత్తగూడెం నుంచి 265 కిలోమీటర్ల దూరంలో ఉన్న సిద్దిపేటకు రైతులు పత్తి తీసుకెళ్లి అమ్ముకున్నట్లు విచారణలో వెలుగుచూసింది. సిద్దిపేటలోని సాయివెంకట కాటన్ జిన్నింగ్ మిల్లులో అశ్వాపురం మండలానికి చెందిన రైతుల పేర్లతో కొనుగోళ్లు చేసినట్లు నకిలీ టీఆర్లు సృష్టించారు. ఉమ్మడి వరంగల్, నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లో పెద్దఎత్తున పత్తి అక్రమ కొనుగోళ్లు జరిగిన ఉదంతంపై విచారణాధికారులు ఆధారాలు సేకరిస్తున్నారు. సస్పెన్షన్కు గురైన మార్కెటింగ్శాఖ అధికారులను విచారించి అక్రమాలు జరిగిన తీరును తెలుసుకుంటున్నారు. మార్కెటింగ్శాఖ అధికారులతోపాటు వ్యవసాయాధికారులు, విస్తరణాధికారుల మెడకు అక్రమ కొనుగోళ్ల ఉచ్చు బిగుస్తోంది.
For Telangana News And Telugu News
Updated Date - May 02 , 2025 | 05:23 AM