Groundwater Levels: రాష్ట్రంలో పెరిగిన భూగర్భ జలాలు
ABN, Publish Date - Jul 21 , 2025 | 04:26 AM
రాష్ట్రంలో భూగర్భ జలమట్టాల్లో స్వల్ప వృద్ధి నమోదైంది. జూన్లో సగటు భూగర్భ జలమట్టం 9.47 మీటర్లకు చేరింది. ఇది ఏప్రిల్లో 10.17 మీటర్లు ఉండగా..
జూన్లో జల మట్టాల్లో స్వల్ప వృద్ధి
మేలో 10.07 మీటర్ల లోతులో లభ్యత
జూన్లో 9.47 మీటర్లకు తగ్గుదల
12 జిల్లాల్లో పరిస్థితి ఆందోళనకరమే
అక్కడ 10-15మీటర్ల లోతున జలాలు
జూన్లో లోటు వర్షపాతమే
హైదరాబాద్, జూలై 20(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో భూగర్భ జలమట్టాల్లో స్వల్ప వృద్ధి నమోదైంది. జూన్లో సగటు భూగర్భ జలమట్టం 9.47 మీటర్లకు చేరింది. ఇది ఏప్రిల్లో 10.17 మీటర్లు ఉండగా.. ముందస్తుగా రుతుపవనాల రాకతో మే నెలలో కురిసిన వర్షాలతో 10.07 మీటర్లకు తగ్గింది. జూన్లో కురిసిన వర్షాలతో మరింత తగ్గి 9.47 మీటర్లకు చేరింది. మేతో పోలిస్తే జూన్లో భూగర్భ జలమట్టాలు సగటున 0.6 మీటర్ల మేర వృద్ధి చెందాయి. రాష్ట్ర భూగర్భ జల వనరుల శాఖ జూన్లో రాష్ట్రంలోని 33 జిల్లాల్లోనూ పరిశీలించి రూపొందించిన నివేదిక ఈ అంశాలను వెల్లడించింది. ఆ జిల్లాల పరిధిలోని అన్ని మండలాల్లో ఏర్పాటు చేసిన 1,771 పీజోమీటర్ల ద్వారా భూగర్భ జలాలను ప్రతి నెలా సమీక్షించి, తర్వాతి నెలలో నివేదికలు విడుదల చేస్తూ ఉంటారు. రాష్ట్రంలో గరిష్ఠంగా వికారాబాద్ జిల్లాలో 14.74 మీటర్ల లోతుకు భూగర్భ జలాలు పడిపోయాయి. జగిత్యాల జిల్లాలో అతి తక్కువగా 5.14 మీటర్ల లోతులోనే వాటి లభ్యత ఉంది. రాష్ట్రంలో జిల్లాలను సగటు భూగర్భ జలమట్టం (0-5 మీటర్లు, 5-10 మీటర్లు, 10 మీటర్లపైన లోతు) ఆధారంగా మూడు క్యాటగిరీలుగా వర్గీకరిస్తారు. భూగర్భ జలాలు 0-5 మీటర్లలోపు లోతులో ఉంటే సురక్షిత స్థాయిలో ఉన్నట్టు భావిస్తారు. అయితే ఒక్క జిల్లాలో కూడా 0-5 మీటర్ల లోతులో లేవని గుర్తించారు. 21 జిల్లాల్లో 5-10 మీటర్లు, 12 జిల్లాల్లో 10-15 మీటర్ల లోతులో భూగర్భ జలాలు ఉన్నట్టు తేలింది. 10 మీటర్లకన్నా లోతుకు పడిపోయిన జిల్లాల్లో పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు భావిస్తారు.
22 జిల్లాల్లో భూగర్భ జలాల వృద్ధి
గత ఏడాది జూన్తో పోలిస్తే ఈ ఏడాది జూన్లో రాష్ట్రంలోని 22 జిల్లాల్లో భూగర్భ జలమట్టాల్లో వృద్ధి నమోదయింది. మరో 11 జిల్లాల్లో క్షీణత కనిపించింది. గత ఏడాది జూన్లో రాష్ట్ర భూగర్భ జలాల సగటు లోతు 9.9 మీటర్లు కాగా.. ఈ ఏడాది జూన్లో 9.47 మీటర్లు నమోదైంది. అత్యధికంగా నాగర్కర్నూల్ జిల్లాలో 2.19 మీటర్లు, అత్యల్పంగా పెద్దపల్లి జిల్లాలో 0.09 మీటర్ల వృద్ధి నమోదైంది. రాష్ట్రంలో మొత్తం 621 మండలాలు ఉండగా, దశాబ్ద కాల సగటుతో పో లిస్తేజూన్లో 492 మండలాల్లో భూగర్భ జలా లు వృద్ధి చెందాయి. కాగా, జూన్లో రాష్ట్ర వార్షిక సగటు వర్షపాతం 130 మి.మీ. కాగా, ఈ ఏడాది జూన్లో 104 మి.మీ. మాత్రమే నమోదైంది.
ఈ వార్తలు కూడా చదవండి..
త్వరలో యాదగిరి ఆధ్యాత్మిక మాసపత్రిక, టీవీ చానల్
రేవంత్ నాటుకోడి.. కేటీఆర్ బాయిలర్ కోడి
Read latest Telangana News And Telugu News
Updated Date - Jul 21 , 2025 | 04:26 AM