Railway Stations: ఎయిర్పోర్టుల్లా రైల్వే స్టేషన్లు
ABN, Publish Date - May 20 , 2025 | 04:29 AM
రాష్ట్రంలో విమానాశ్రయాలను తలపించేలా ఆధునిక హంగులతో తీర్చిదిద్దిన మూడు ప్రధాన రైల్వే స్టేషన్లు ప్రారంభానికి సిద్ధమయ్యాయి. అధునాతన సౌకర్యాలు, కళ్లు చెదిరే ఎలివేషన్లతో చేపట్టిన నిర్మాణాలు ఆవిష్కరణకు అడుగు దూరంలో ఉన్నాయి.
అమృత్ పథకంలో భాగంగా వరంగల్, కరీంనగర్, బేగంపేట స్టేషన్ల అభివృద్ధి
అత్యంత అధునాతన వసతుల కల్పన.. ఒక్కో స్టేషన్కు రూ.25 కోట్ల వ్యయం
ఎల్లుండి వర్చువల్గా ప్రారంభించనున్న ప్రధాని నరేంద్ర మోదీ
వరంగల్ రైల్వేస్టేషన్ ఫొటోలను ఎక్స్లో షేర్ చేసిన రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్
గిర్మాజీపేట/కరీంనగర్ రూరల్/బేగంపేట/న్యూఢిల్లీ, మే 19 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో విమానాశ్రయాలను తలపించేలా ఆధునిక హంగులతో తీర్చిదిద్దిన మూడు ప్రధాన రైల్వే స్టేషన్లు ప్రారంభానికి సిద్ధమయ్యాయి. అధునాతన సౌకర్యాలు, కళ్లు చెదిరే ఎలివేషన్లతో చేపట్టిన నిర్మాణాలు ఆవిష్కరణకు అడుగు దూరంలో ఉన్నాయి. అమృత్ భారత్ పథకంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం తెలంగాణలోని బేగంపేట, కరీంనగర్, వరంగల్ స్టేషన్లను ఆధునీకరించింది. ఆయా స్టేషన్లలో అత్యాధునిక వసతులను కల్పించింది. 12 మీటర్ల విశాలమైన ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు, లిఫ్టులు, ఎస్కలేటర్లు, దివ్యాంగుల కోసం ప్రత్యేక ర్యాంపులు, సరికొత్త టికెట్ కౌంటర్లు, స్నానాల గదులతో వాష్ రూమ్లు, టీవీలు, వైఫై, ఆకట్టుకునేలా రూపొందించిన స్టేషన్ ముఖ ద్వారాలు, కనువిందు చేసే వెయిటింగ్ హాళ్లతో ఈ స్టేషన్లను అభివృద్ధి చేసింది. ప్రధాని మోదీ గురువారం వర్చువల్గా ప్రారంభించబోయే 103 రైల్వే స్టేషన్లలో ఈ మూడు స్టేషన్లు కూడా ఉన్నాయి. గత ఏడాది ఫిబ్రవరిలో వరంగల్ స్టేషన్ అభివృద్ధి పనులకు శంకుస్థాపన జరిగింది. కాకతీయుల కళా వైభవం ఉట్టిపడేలా రూ.25.41 కోట్లతో ఈ స్టేషన్ను తీర్చిదిద్దారు. ఎత్తైన శిలా స్థంభాలపై ఉన్న గజ రాజులు ప్రయాణికులకు స్వాగతం పలుకుతున్నట్లుగా స్టేషన్ ముందు ఏర్పాటు చేసిన శిల్పాలు ఆకట్టుకుంటున్నాయి.
ప్లాట్ ఫాం గోడపై కాకతీయుల చిత్రాలను అందంగా వేశారు. స్టేషన్ ఆవరణలో పచ్చదనం ఉండేలా ల్యాండ్ స్కేపింగ్ చేశారు. స్టేషన్ ముందు కుడివైపు ఎలక్ట్రిక్ వాహనాల కోసం బ్యాటరీ స్వాపింగ్ పాయింట్ నిర్మించారు. గతఏడాది ఆగస్టు 6న కరీంనగర్ రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులను ప్రధాన మోదీ వర్చువల్గా ప్రారంభించారు. కరీంనగర్ నుంచి దక్షిణ మధ్య రైల్వేకు గూడ్స్ రవాణాతో రూ.కోట్ల ఆదాయం వస్తోంది. ప్రయాణికుల రద్దీ పెరగడంతో కరీంనగర్లో రెండు, మూడు ప్లాట్ ఫాంలను కొత్తగా నిర్మించారు. ప్రస్తుతం ఉన్న స్టేషన్ భవనం పక్కనే మరో భవనాన్ని కట్టారు. రైల్వే స్టేషన్కు ఏర్పాటు చేసిన ఎలివేషన్, ఎల్ఈడీ లైట్లు ఆకట్టుకుంటున్నాయి. స్టేషన్ ముందు అతి పెద్ద జాతీయ జెండా, కనువిందు చేసేలా ల్యాండ్ స్కేపింగ్ ఏర్పాటు చేశారు. ఇక్కడ రూ.25.85కోట్లతో చేపడుతున్న పనులు దాదాపు పూర్తయ్యాయి. గతఏడాది ఫిబ్రవరిలో ప్రధాని మోదీ బేగంపేట స్టేషన్ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. జంటనగరాల్లో ముఖ్యమైన స్టేషన్లలో ఒకటైన ఈ స్టేషన్ను రూ.26.55 కోట్లతో ఆధునీకరించారు. వినూత్నంగా రూపొందించిన స్టేషన్ ఆర్కిటెక్చర్, పాల పిట్టలు స్వాగతం పలుకుతున్నట్టుగా ఉన్న ముఖద్వారం, స్టేషన్ ముందున్న ల్యాండ్ స్కేపింగ్ ప్రయాణికులను ఆకట్టుకుంటున్నాయి. సోమవారం ఈ స్టేషన్ను సందర్శించిన దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో శ్రీధర్.. అభివృద్ధి పనులను మీడియాకు వివరించారు.
అశ్వినీ వైష్ణవ్, కిషన్రెడ్డి పోస్టులు
అమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా వరంగల్ రైల్వేస్టేషన్లో చేపట్టిన అభివృద్ధి పనులు ముంగింపు దశకు చేరుకున్నాయని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. ఆధునీకరించిన వరంగల్ రైల్వే స్టేషన్ చిత్రాలను ఆయన సోమవారం ‘ఎక్స్’ వేదికగా పంచుకున్నారు. గతేడాది ఫిబ్రవరిలో వరంగల్ రైల్వేస్టేషన్ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశామని, ఈ ఏడాది మే నాటికి పనులు చివరి దశకు చేరుకున్నాయని తెలిపారు. తెలంగాణలో రైల్వే మౌలిక వసతుల కల్పన, సౌకర్యాలను మెరుగుపరిచేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర బొగ్గు, గనుల మంత్రి కిషన్రెడ్డి స్పష్టం చేశారు. అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద వరంగల్ రైల్వేస్టేషన్లో చేపట్టిన పనులు ముగింపు దశలో ఉన్నాయని ఎక్స్ వేదికగా పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
HYD Fire Accident: ఓల్డ్సిటీ ఫైర్ యాక్సిడెంట్కి కారణం.. స్థానిక అక్రమ కరెంట్ కనెక్షన్లు.!
Gulzar House Fire Incident: గుల్జార్ హౌస్ ప్రమాదంపై ఎఫ్ఐఆర్ నమోదు
Hydra Demolitions: హైడ్రా కూల్చివేతలు షూరూ.. టెన్షన్ టెన్షన్
Read Latest Telangana News And Telugu News
Updated Date - May 20 , 2025 | 04:29 AM