KTR: మాటల్లో కాదు చేతల్లో చూపండి
ABN, Publish Date - Apr 19 , 2025 | 05:01 AM
కంచగచ్చబౌలి భూముల అంశంలో మాటలతో సరిపెట్టకుండా.. అక్కడ జరిగిన అక్రమాలపై దర్యాప్తు జరిపించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రధాని నరేంద్ర మోదీని కోరారు.
కంచ గచ్చిబౌలి భూముల అంశంపై విచారణ జరిపించండి
పర్యావరణ పరిరక్షణపై చిత్తశుద్ధి నిరూపించుకోండి
ప్రధాని మోదీకి కేటీఆర్ డిమాండ్
హైదరాబాద్, ఏప్రిల్ 18 (ఆంధ్రజ్యోతి) : కంచగచ్చబౌలి భూముల అంశంలో మాటలతో సరిపెట్టకుండా.. అక్కడ జరిగిన అక్రమాలపై దర్యాప్తు జరిపించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రధాని నరేంద్ర మోదీని కోరారు. పర్యావరణ పరిరక్షణపై చిత్తశుద్ధిని చాటుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఎక్స్లో శుక్రవారం ఓ పోస్టు చేశారు. కంచగచ్చిబౌలి అంశం వందల ఎకరాల పర్యావరణ విధ్వంసం మాత్రమే కాదని, రాష్ట్ర ప్రభుత్వం చేసిన రూ.10వేల కోట్ల ఆర్థిక మోసమని కేటీఆర్ పేర్కొన్నారు. ఆ భూములు కేంద్రంగా జరిగిన ఆర్థిక అక్రమాలపై విచారణ చేపట్టి.. తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ ఒక్కటికాదని నిరూపించాలని కోరారు.
కంచగచ్చిబౌలి భూములు తనఖాతో రూ.10,000 కోట్ల మేర జరిగిన ఆర్థిక కుంభకోణంపై దర్యాప్తు చేపట్టాలని సీబీఐ, ఆర్బీఐ, సెబీ, సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆర్గనైజేషన్ తదితర సంస్థలకు తాము ఇప్పటికే ఫిర్యాదు చేశామని కేటీఆర్ పేర్కొన్నారు. కంచగచ్చిబౌలి భూముల అంశంలో ఆర్థిక అవకతవకలు జరిగాయని సుప్రీంకోర్టుకు చెందిన సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ కూడా నిర్ధారించిందని, కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ చేయాలని సూచించిందని కేటీఆర్ తెలిపారు. నగరాలు వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో పర్యావరణ పరిరక్షణ అత్యంత ప్రాధాన్యం కలిగిన అంశమని అన్నారు. వ్యవస్థలను మోసం చేసి పర్యావరణ విధ్వంసం చేసిన రేవంత్రెడ్డి లాంటి నాయకులను ప్రజల ముందు నిలబెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. కంచ గచ్చిబౌలిలో రూ.10వేలకోట్ల ఆర్థిక అక్రమాలపై ప్రధాని తక్షణమే చర్యలు తీసుకోవాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.
Updated Date - Apr 19 , 2025 | 05:01 AM