Konda Surekha: కాంగ్రెస్లో మేం ఉండాలా? కొండా దంపతులా?
ABN, Publish Date - Jun 23 , 2025 | 04:03 AM
సొంత పార్టీ నేతలతో మంత్రి కొండా సురేఖ, కొండా మురళీధర్రావు దంపతుల వివాదం కాంగ్రెస్ పెద్దల వద్దకు చేరింది.
మురళి వ్యాఖ్యలపై కాంగ్రెస్ కార్యకర్తల్లో ఆగ్రహం
మీనాక్షి నటరాజన్కు వరంగల్ ఎమ్మెల్యేల ఫిర్యాదు
క్రమశిక్షణ తప్పితే ఎంతటివారైౖనా చర్యలే: మీనాక్షి
రేపు క్రమశిక్షణ కమిటీ భేటీ
వరంగల్/హైదరాబాద్, జూన్ 22 (ఆంధ్రజ్యోతి): సొంత పార్టీ నేతలతో మంత్రి కొండా సురేఖ, కొండా మురళీధర్రావు దంపతుల వివాదం కాంగ్రెస్ పెద్దల వద్దకు చేరింది. కొండా దంపతుల తీరును నిరసిస్తూ ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆదివారం హైదరాబాద్లో ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ను, టీపీసీసీ క్రమశిక్షణ సంఘం చైర్మన్ మల్లు రవిని వేర్వేరుగా కలిసి ఫిర్యాదు చేశారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్ అందుబాటులో లేకపోవడంతో ఫోన్లో సమాచారం అందించి, వాట్సాప్ ద్వారా ఫిర్యాదు చేశారు. ఈ నెల 19న రాహుల్గాంధీ జన్మదినం సందర్భంగా వరంగల్లో నిర్వహించిన సభలో మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి.. సొంత పార్టీ ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, రేవూరి ప్రకా్షరెడ్డిలపై చేసిన అనుచిత వ్యాఖ్యలను వారి దృష్టికి తీసుకెళ్లారు. గతంలో మంత్రి సురేఖ, ఎమ్మెల్యే ప్రకా్షరెడ్డి మధ్య జరిగిన ఆడియో సోషల్ మీడియాలో వైరల్ కావడం, గీసుకొండ పోలీ్సస్టేషన్లో మంత్రి ఎస్హెచ్వో సీట్లో కూర్చున్న విషయాలను ప్రధానంగా మీనాక్షి దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది. ‘‘వారిని కట్టడి చేయకపోతే పార్టీకి తీవ్ర నష్టం జరుగుతుంది. పార్టీలో వారు ఉండాలా? మేము ఉండాలో చెప్పండి’’ అని ఎమ్మెల్యేలు వ్యాఖ్యానించినట్లు సమాచారం. దీంతో ఈ విషయాన్ని పీసీసీ చీఫ్తో చర్చిస్తామని, జిల్లాతో సంబంధం లేని వ్యక్తులతో టీపీసీసీ ఆధ్వర్యంలో కమిటీ వేసి విచారణ చేయిస్తామని, ఆ కమిటీ నివేదిక ఆధారంగా కార్యాచరణ ఉంటుందని మీనాక్షి నటరాజన్ చెప్పినట్లు తెలిసింది. ఆమెను కలిసిన వారిలో ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్రెడ్డి, కడియం శ్రీహరి, రేవూరి ప్రకా్షరెడ్డి, గండ్ర సత్యనారాయణరావు, కేఆర్.నాగరాజుతోపాటు ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, వరంగల్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ తదితరులు ఉన్నారు.
మీనాక్షితో మల్లు రవి భేటీ..
టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి ఆదివారం రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్తో సమావేశమయ్యారు. కొన్ని రోజులుగా పార్టీలో చోటుచేసుకుంటున్న ఘటనలకు సంబంధించి అందిన ఫిర్యాదులపై వారు చర్చించినట్లు తెలిసింది. మంత్రి కొండా సురేఖ, కొండా మురళి దంపతుల తీరుపై వరంగల్ జిల్లా ఎమ్మెల్యేలు చేసిన ఫిర్యాదుతోపాటు రాష్ట్రంలోని పలు నియోజకవర్గాల్లో నాయకుల క్రమశిక్షణ ఉల్లంఘనలకు సంబంధించిన వచ్చిన ఫిర్యాదులపైనా వీరు చర్చించినట్లు సమాచారం. క్రమశిక్షణ పాటించని నేతలపై చర్యలు తీసుకోకపోతే.. మున్ముందు మరింతగా రెచ్చిపోయి విమర్శలు చేస్తూ పార్టీని బలహీనపరిచే ప్రమాదం ఉందని మీనాక్షి నటరాజన్ అన్నట్లు తెలిసింది. క్రమశిక్షణ ఉల్లంఘించిన వారిని మందలించడంతోపాటు అవసరమైతే షోకాజ్ జారీ చేసి వివరణ కోరాలని ఆమె సూచించినట్లు సమాచారం. ఈ విషయంపై మంగళవారం క్రమశిక్షణ కమిటీ సమావేశం నిర్వహించాల్సిందిగా మీనాక్షి నటరాజన్ సూచించారని మల్లు రవి తెలిపారు.
కొండా కౌంటర్ అటాక్..?
వరంగల్కు చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలు, ఎంపీ, ఎమ్మెల్సీతోపాటు పలువురు నేతలు మీనాక్షి నటరాజన్కు, క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవికి తమపై ఫిర్యాదు చేసిన నేపథ్యంలో.. తగిన సమాధానం ఇచ్చేందుకు కొండా దంపతులు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. సోమవారం క్యాబినెట్ భేటీ జరగనుండడతో తనపై ఎమ్మెల్యేలు దుష్ప్రచారం చేస్తున్నారంటూ సీఎం రేవంత్రెడ్డికి, ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివా్సరెడ్డికి చెప్పనున్నట్లు సమాచారం. అవసరమైతే మీనాక్షి నటరాజన్ను కూడా కలిసే యోచనలో ఉన్నట్లు తెలిసింది.
ఇవి కూడా చదవండి..
మీ దుంపలు తెగా.. చైనాను మించిపోయారు కదరా.. ఆమ్లెట్ ఎలా చేస్తున్నాడో చూడండి..
అర్ధరాత్రి టెంట్లో కొత్త జంటలు.. సమీపానికి వెళ్లిన సింహాలు.. చివరకు..
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated Date - Jun 23 , 2025 | 04:03 AM