అంతర్రాష్ట్ర గజదొంగ సలీమ్ ఖురేషి అరెస్టు
ABN, Publish Date - Jun 13 , 2025 | 03:30 AM
ఏపీ, తెలంగాణ సహా పలు రాష్ట్రాల్లో 200కుపైగా దొంగతనాలకు పాల్పడిన హైదరాబాద్ వాసి మహ్మద్ సలీమ్ ఖురేషి (51)ని విశాఖపట్నం పోలీసులు అరెస్టు చేశారు.
ఏపీ, తెలంగాణ సహా పలు రాష్ట్రాల్లో 200కుపైగా దొంగతనాలు
మహారాష్ట్రలో అరెస్టు చేసిన విశాఖ పోలీసులు
మహారాణిపేట(విశాఖపట్నం), జూన్ 12 (ఆంధ్రజ్యోతి): ఏపీ, తెలంగాణ సహా పలు రాష్ట్రాల్లో 200కుపైగా దొంగతనాలకు పాల్పడిన హైదరాబాద్ వాసి మహ్మద్ సలీమ్ ఖురేషి (51)ని విశాఖపట్నం పోలీసులు అరెస్టు చేశారు. ఆ వివరాలను విశాఖ నగర పోలీసు కమిషనర్ శంఖబ్రత బాగ్చీ గురువారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. సలీమ్ ఖురేషి తన గ్యాంగ్ తో కలిసి ఏపీలో 5 (విశాఖలో 3, గుంటూరులో 2), తెలంగాణలో 65, మహారాష్ట్రలో 35, రాజస్థాన్, గుజరాత్లలో ఒక్కొక్కటి, కర్ణాటకలో ఆరు సహా 200కుపైగా దొంగతనాలకు పాల్పడినట్టు సీపీ తెలిపారు. 2001లో ముంబైలో గ్యాంగ్స్టర్ చోటారాజన్ ఇంట్లో పది కోట్ల విలువైన బంగారు వస్తువులు, వజ్రాలను దొంగిలించాడన్నారు. మహారాష్ట్రకు చెందిన మయూర్ జాదవ్ అలియాస్ వసీం అబ్దుల్ షేక్, పఠాన్ అనే మరో ఇద్దరితో కలిసి గత 3 నెలల వ్యవధిలో విశాఖలోని పాండురంగపురంలో రెండిళ్లలో, వాల్తేర్ అప్ల్యాండ్స్లోని ఒక ఇంటిలో దొంగతనానికి పాల్పడ్డాడన్నారు.
బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారని, డీసీపీ, ఏసీపీ, ఏడీసీపీ క్రైమ్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం దర్యాప్తు ప్రారంభించి, సీసీ ఫుటేజి ఆధారంగా నిందితుడి ఫొటోను దేశంలోని అన్ని ప్రాంతాలకు పంపినట్టు తెలిపారు. తద్వారా అతను అంతరాష్ట్ర నేరస్థుడు సలీం ఖురేషీగా గుర్తించామన్నారు. అతని కుటుంబ సభ్యులకు సంబంధించిన 20 సెల్ఫోన్ల డేటా రికార్డుల ఆధారంగా నిందితుడు మహారాష్ట్రలో ఉన్నట్టు గుర్తించి, అక్కడకు వెళ్లి అరెస్టు చేసినట్టు తెలిపారు. అతడి నుంచి సుమారు రూ.25 లక్షల విలువైన బంగారు ఆభరణాలు, వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్నామన్నారు. మయూర్ జాదవ్, పఠాన్ తప్పించుకున్నారని, వారి కోసం గాలిస్తున్నామని తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి..
కూలిన విమానంలో గుజరాత్ మాజీ సీఎం.. ఆయన చివరి ఫొటో ఇదే..
లోపం ఉందని ముందే చెప్పినా.. పట్టించుకోని ఎయిర్ ఇండియా
For National News And Telugu News
Updated Date - Jun 13 , 2025 | 03:30 AM