Hyderabad Airport: హైదరాబాద్ ఎయిర్ పోర్టు రికార్డు
ABN, Publish Date - Jun 18 , 2025 | 05:25 AM
హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం సరికొత్త రికార్డు సృష్టించింది. ఎయిర్పోర్టు ప్రారంభమైన తర్వాత గత నెల అత్యధిక మంది ప్రయాణికులు రాకపోకలు సాగించారు.
గత నెల 27.91 లక్షల మంది ప్రయాణికులు
పురోగతిలో ఢిల్లీ విమానాశ్రయం కంటే ముందంజ
(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డిజిల్లా ప్రతినిధి): హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం సరికొత్త రికార్డు సృష్టించింది. ఎయిర్పోర్టు ప్రారంభమైన తర్వాత గత నెల అత్యధిక మంది ప్రయాణికులు రాకపోకలు సాగించారు. ప్రయాణికుల పురోగతిలో ఢిల్లీ కంటే హైదరాబాద్ విమానాశ్రయం ముందంజలో ఉంది. హైదరాబాద్ ఎయిర్పోర్టు నిర్వాహణ సంస్థ జీఎంఆర్ మంగళవారం తమ ఆధ్వర్యంలో నడుస్తున్న ఐదు విమానాశ్రాయలకు సంబంధించి మే నెలలో పురోగతిపై ఓ ప్రకటనను విడుదల చేసింది. గత నెల ఐదు విమానాశ్రయాల నుంచి కోటి మంది ప్రయాణికులు రాకపోకలు సాగించినట్లు జీఎంఆర్ సంస్థ వెల్లడించింది.
ఏప్రిల్ నెలతో పోలిస్తే మే నెలలో జీఎంఆర్ విమానాశ్రాయాల్లో సగటు ప్రయాణికుల పురోగతి 0.8శాతంగా ఉంది. హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం అత్యధికంగా 15.3ు పురోగతి నమోదైంది. అదే సమయంలో ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయ ప్రయాణికులు 4.5ు మేర తగ్గడం గమనార్హం..! మే నెలలో శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రికార్డుస్థాయిలో 27,91,217 మంది దేశీయ, అంతర్జాతీయ ప్రయా ణికులు రాకపోకలు సాగించారు. ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈ సంఖ్య 62,49,600గా నమోదైంది. హైదరాబాద్ విమానాశ్రయం నుంచి కొత్త సర్వీసులను ప్రారంభించడం కూడా ప్రయాణికుల సంఖ్య పెరగడానికి కారణమని తెలుస్తోంది.
రోజూ లక్షకు చేరువలో..
హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం రోజువారీ ప్రయాణికుల సంఖ్య దాదాపు లక్షకు చేరువైంది. ప్రస్తుతం రోజుకు 95వేల నుంచి 97వేల మం ది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. హైదరాబాద్ విమానాశ్రయం నుంచి దేశంలోని 74 ప్రాం తాలకు, విదేశాల్లోని 21 ప్రాంతాలకు ప్రతిరోజూ సగటున 620 విమానాలు నేరుగా సేవలందిస్తున్నాయి.
Updated Date - Jun 18 , 2025 | 05:25 AM