Jurala project: జురాలకు వరద పోటు
ABN, Publish Date - May 30 , 2025 | 05:26 AM
వానాకాలానికి ముందే ఈ ఏడాది కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. రాష్ట్రంలోని జలాశయాలకు వరద పోటెత్తుతోంది. వనపర్తి, గద్వాల జిల్లాల సరిహద్దులోని జూరాల ప్రాజెక్టుకు గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈసారి మే నెలలోనే వరద వచ్చింది.
ప్రాజెక్టుకు భారీగా చేరుతున్న వరద
నేటి ఉదయానికి లక్ష క్యూసెక్కులు
దిగువకు 83 వేల క్యూసెక్కుల నీరు
8 12 గేట్లు ఎత్తి దిగువకు 83 వేల క్యూసెక్కుల విడుదల
హైదరాబాద్, అమరచింత/ధరూరు/దోమలపెంట, మే 29 (ఆంధ్రజ్యోతి): వానాకాలానికి ముందే ఈ ఏడాది కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. రాష్ట్రంలోని జలాశయాలకు వరద పోటెత్తుతోంది. వనపర్తి, గద్వాల జిల్లాల సరిహద్దులోని జూరాల ప్రాజెక్టుకు గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈసారి మే నెలలోనే వరద వచ్చింది. ఎగువన ఉన్న ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జురాల ప్రాజెక్టుకు గురువారం ఒక్కసారిగా 40 వేల క్యూసెక్కుల నీరు వచ్చి చేరింది. దీంతో అప్రమత్తమైన అధికారులు సాయంత్రం 6 గంటలకు ప్రాజెక్టు 10 గేట్లను ఎత్తి 66 వేల క్యూసెక్కుల నీటిని వదిలేశారు. ఆ తర్వాత మరో 2 గేట్లను కూడా ఎత్తారు. మొత్తం 12 గేట్లను ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. శుక్రవారం ఉదయానికి మరో లక్ష క్యూసెక్కుల వరద నీరు జూరాల ప్రాజెక్టుకు చేరే అవకాశం ఉందని తెలిసింది. కాగా, గురువారం రాత్రి తొమ్మిది గంటల నాటికి అధికారులు వెల్లడించిన గణాంకాల ప్రకారం.. జూరాల ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం 9.6 టీఎంసీలు కాగా ప్రస్తుతం 4.864 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఇన్ఫ్లో 99 వేల క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 83,616 క్యూసెక్కులు ఉండగా నెట్టెంపాడు వద్ద మరో 1500 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. ఇక, శ్రీశైలం ప్రాజెక్టుకూ వరద పోటెత్తుతోంది. శ్రీశైలం డ్యామ్కు ఎగువన ఉన్న సుంకేసుల నుంచి 4,379 క్యూసెక్కులు, జూరాల నుంచి 66,000 క్యూసెక్కులు విడుదల చేస్తుండగా శ్రీశైలం ప్రాజెక్టులో ప్రస్తుతం 22,527 క్యూసెక్కుల ఇన్ ఫ్లో ఉన్నది. గడిచిన 24 గంటల వ్యవధిలో ప్రాజెక్టు ఎడమ గట్టు జలవిద్యుత్ కేంద్రంలో 7,582 క్యూసెక్కుల నీటిని ఉపయోగించి 3.338 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేశారు. ఇక, కృష్ణా బేసిన్లో ఎగువన ఉన్న ఆల్మట్టి ప్రాజెక్టుకు 70 వేల క్యూసెక్కుల వరద వచ్చిచేరింది. మరో నాలుగురోజుల పాటు ఆల్మట్టి, జూరాలకు వరద ఇదే విధంగా వస్తుందని కేంద్ర జలవనరుల సంఘం(సీడబ్ల్యూసీ) సమాచారం ఇచ్చింది. కాగా, ముందుగానే వచ్చిన వరదల వల్ల తెలుగు రాష్ట్రాల ఉమ్మడి జలాశయాలైన శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల్లో నిల్వలు పెరుగుతున్నాయి. దీంతో ఇరు రాష్ట్రాల మధ్య రెండు నెలలుగా నెలకొన్న తాగునీటి వివాదాలకు తెరపడనుంది.
తీరందాటిన తీవ్ర వాయుగుండం
విశాఖపట్నం, అమరావతి, మే 29 (ఆంధ్రజ్యోతి): వాయువ్య బంగాళాఖాతంలో కొనసాగిన వాయుగుండం ఉత్తరంగా పయనించే క్రమంలో గురువారం తీవ్ర వాయుగుడంగా బలపడింది. ఆ తరువాత ఉత్తర ఈశాన్యంగా పయనించి బంగ్లాదేశ్, పశ్చిమబెంగాల్ మధ్య తీరం దాటింది. ఇది రానున్న 12 గంటల్లో మరింత బలహీనపడుతుందని వాతావరణ శాఖ తెలిపింది. మరోవైపు ఛత్తీ్సగఢ్, ఒడిశా, పశ్చిమబెంగాల్, బంగాళాఖాతంలో మరిన్ని ప్రాంతాలు, ఈశాన్య భారతంలో మిగిలిన ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించాయి. రానున్న రెండు రోజుల్లో బిహార్ వరకు రుతుపవనాలు విస్తరించనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది.
జలాశయం పూర్తి నీటినిల్వ గతేడాది నిల్వ ప్రస్తుత నిల్వ ఇన్ఫ్లో
(టీఎంసీల్లో) (టీఎంసీల్లో) (టీఎంసీల్లో) (క్యూసెక్కుల్లో)
ఆల్మట్టి 129.72 22.19 41.70 70,000
నారాయణ పూర్ 37.64 19.27 23.57 1000
జూరాల 9.66 3.73 6.42 99,000
తుంగభద్ర 105.79 3.34 12.33 7799
శ్రీశైలం 215.81 31.83 39.03 22,527
నాగార్జునసాగర్ 312.02 122.85 135.95 7591
పులిచింతల 45.77 0.42 25.44 -
జైక్వాడి 102.73 29.87 48.91 258
సింగూరు 29.91 14.74 16.99 -
నిజాంసాగర్ 17.80 4.85 5.84 434
శ్రీరాంసాగర్ 80.50 10.17 12.56 3310
ఎల్లంపల్లి 20.18 5.21 8.41 679
ఈ వార్తలు కూడా చదవండి
కేసీఆర్ కుటుంబం మరో కొత్త సినిమా.. యెన్నం సెటైరికల్ కామెంట్స్
గద్దర్ అవార్డుల ప్రకటన.. విజేతలు వీరే
Read Latest Telangana News And Telugu News
Updated Date - May 30 , 2025 | 05:26 AM