Real Estate Auction: హౌసింగ్ ఆస్తుల వేలం
ABN, Publish Date - Jun 30 , 2025 | 03:07 AM
రాష్ట్ర ప్రభుత్వం వనరుల సమీకరణలో భాగంగా హౌసింగ్ బోర్డు పరిధిలో ఉన్న పలు ఆస్తులను వేలం వేసే దిశగా దృష్టి సారించింది. ఇప్పటికే పలుచోట్ల ఉన్న ఆస్తులను వేలం వేస్తుండగా.. తాజాగా మరికొన్ని ఆస్తులనూ వేలం వేయాలని నిర్ణయించింది.
వనరుల సమీకరణకు ప్రభుత్వ నిర్ణయం
కేపీహెచ్బీ కాలనీ ఫేజ్-4, ఎస్ఆర్ నగర్, నాంపల్లిలోని ప్లాట్ల వేలానికి రంగం సిద్ధం
రూ.539 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా
5న క్యాబినెట్ ఆమోదం.. త్వరలో వెలువడనున్న ఉత్తర్వులు
హైదరాబాద్, జూన్ 29 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం వనరుల సమీకరణలో భాగంగా హౌసింగ్ బోర్డు పరిధిలో ఉన్న పలు ఆస్తులను వేలం వేసే దిశగా దృష్టి సారించింది. ఇప్పటికే పలుచోట్ల ఉన్న ఆస్తులను వేలం వేస్తుండగా.. తాజాగా మరికొన్ని ఆస్తులనూ వేలం వేయాలని నిర్ణయించింది. ఈ మేరకు బోర్డు పరిధిలో హైదరాబాద్ కూకట్పల్లి హౌసింగ్ బోర్డు కాలనీ ఫేజ్-4లో ఉన్న పలు ఓపెన్ ప్లాట్లను వేలం వేసేందుకు పచ్చజెండా ఊపింది. ఇందుకు ఈ నెల 5న జరిగిన భేటీలో క్యాబినెట్ కూడా ఆమోదం తెలిపింది. దీంతో ఆ ప్లాట్లను వేలం వేసేందుకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. కేపీహెచ్బీ కాలనీ ఫేజ్-4తోపాటు ఎస్ఆర్నగర్, నాంపల్లిలో ఉన్న పలు ఆస్తుల వేలంతో ప్రభుత్వానికి సుమారు రూ.539 కోట్ల ఆదాయం సమకూరుతుందని అంచనా వేస్తున్నారు. అయితే మంత్రివర్గ సమావేశంలో ఆమోదం తెలిపినప్పటికీ.. ఇంకా అధికారిక ఉత్తర్వులు రావాల్సి ఉంది. ధరలకు సంబంధించిన వివరాలను ప్రభుత్వానికి పంపడంతో.. వాటిని ఖరారు చేశాక ఉత్తర్వులు జారీ చేయనున్నట్టు తెలిసింది.
ఆ ఉత్తర్వులు వచ్చేవరకు వేలానికి అవసరమైన ప్రణాళికలను అధికారులు సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే హౌసింగ్ బోర్డు పరిధిలో ఉన్న పలు ఖాళీ స్థలాలు, భూములను వేలం వేస్తున్నారు. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా బోర్డు పరిధిలో ఉన్న ఓపెన్ ప్లాట్లను పలు విభాగాలుగా విభజించారు. ఏ ప్రాంతంలో ఎన్ని ప్లాట్లు ఉన్నాయి? ఒక్కో ప్లాటు ఎన్ని చ దరపు గజాల్లో ఉంది? అనే వివరాలతో నివేదికలు రూపొందించారు. ఆయా ప్లాట్ల వేలానికి సంబంధించి కూడా ప్రాథమికంగా కొన్ని ధరలను నిర్దేశించుకున్నారు. ప్లాట్లు ఉన్న ప్రాంతాలు, అక్కడ ప్రస్తుతం ఉన్న మార్కెట్ ధరలు, ప్రైవేటు మార్కెట్లో జరుగుతున్న క్రయ విక్రయ ధరలను బేరీజు వేసుకుని ప్రాథమిక ధరలను నిర్ణయిస్తూ, వేలం వేస్తున్నారు. ఇప్పటివరకు కేపీహెచ్బీ ఫేజ్-7లో 18 ఓపెన్ ప్లాట్లను, చింతల్, నిజాంపేట సహా మరికొన్ని ప్రాంతాల్లో ఉన్న ఓపెన్ ప్లాట్లు, స్థలాలను వేలం వేశారు.
వేలం వేయనున్న ఆస్తుల వివరాలు..
కేపీహెచ్బీ కాలనీ ఫేజ్-4లో సర్వే నం.1009లో ఉన్న 7.33 ఎకరాలు. వేలంతో సుమారు రూ.392 కోట్లు రావచ్చని అంచనా.
కేపీహెచ్బీ కాలనీ ఫేజ్-4లో సర్వే నంబరు 1009లో ఉన్న 4,598 చదరపు గజాలు, 2,420 చదరపు గజాలతో ఉన్న రెండు ఓపెన్ ప్లాట్లు. వేలంతో దాదాపు రూ.73 కోట్లు రావచ్చని అంచనా.
ఎస్ఆర్నగర్లో ఉన్న కమ్యూనిటీ హాల్ను వేలం వేయనున్నారు. దీనికి రూ.53 కోట్లు వచ్చే అవకాశం ఉంటుందని అంచనా.
నాంపల్లిలోని ఎంజే రోడ్లో ఉన్న 1,148 చదరపు గజాల ఖాళీ స్థలాన్ని వేలం వేయనున్నారు. దీనికి రూ.23 కోట్లు రావచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.
Updated Date - Jun 30 , 2025 | 03:07 AM