Hyderabad: పసిడి లావాదేవీలకు ‘ఆల్ ఇన్ వన్ గోల్డ్ ఏటీఎం’
ABN, Publish Date - May 04 , 2025 | 04:16 AM
బంగారు నాణేలను విక్రయించే ఏటీఎంను ఇప్పటికే అందుబాటులోకి తెచ్చిన గోల్డ్ సిక్కా సంస్థ.. మరిన్ని సదుపాయాలతో అధునాతన ఏటీఎంను ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతోంది.
త్వరలోనే అందుబాటులోకి తేనున్న గోల్డ్ సిక్కా సంస్థ
బేగంపేట, మే 3 (ఆంధ్రజ్యోతి): బంగారు నాణేలను విక్రయించే ఏటీఎంను ఇప్పటికే అందుబాటులోకి తెచ్చిన గోల్డ్ సిక్కా సంస్థ.. మరిన్ని సదుపాయాలతో అధునాతన ఏటీఎంను ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతోంది. బంగారం లావాదేవీలకు సంబంధించి అనేక సేవలను అందించే ‘గోల్డ్ మెల్టింగ్ ఏటీఎం’ను త్వరలోనే హైదరాబాద్లోని బేగంపేటలో ప్రారంభించనున్నట్లు గోల్డ్ సిక్కా లిమిటెడ్ ఎండీ, సీఈవో తరూజ్ తెలిపారు. శనివారం బేగంపేటలోని సంస్థ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ‘గోల్డ్ మెల్టింగ్ ఏటీఎం’ పని చేసే వివరాలతో కూడిన పోస్టర్ను గోల్డ్ సిక్కా ప్రతినిధులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా తరూజ్ మాట్లాడారు. ఈ ఏటీఎం ద్వారా బంగారాన్ని కొనడం, అమ్మడం, మార్చడం, లీజుకు ఇవ్వడం, డిజిటైజ్ చేయడం, నగదుగా మార్చుకోవడం, బంగారు ఆభరణాలను కొనుగోలు చేయడం వంటి సేవలను పొందవచ్చని తెలిపారు.
బంగారు రుణాలు మినహా అన్ని సేవలను ఇది అందిస్తుందని చెప్పారు. 2022లో బేగంపేటలో తాము ప్రారంభించిన ‘గోల్డ్ రియల్ టైమ్ ఏటీఎం’ ఎంతో ఆదరణ పొందిందని పేర్కొన్నారు. దాని కంటే మెరుగైన ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ‘గోల్డ్ మెల్టింగ్ ఏటీఎం’ పని చేస్తుందని వివరించారు. వినియోగదారులు బంగారం అమ్మేటప్పుడు ఏటీఎంలో డిపాజిట్ చేసిన వెంటనే ఆధార్, ఐడీ కార్డును వెరిఫై చేస్తుందని చెప్పారు. బంగారం స్వచ్ఛతను పరీక్షించి, దాని విలువను స్ర్కీన్పై చూపిస్తుందని చెప్పారు. ఆ విలువ వినియోగదారులకు అంగీకారమైతే.. ఆ మొత్తాన్ని వారి బ్యాంక్ ఖాతాలో జమ చేస్తుందని తెలిపారు. పాత బంగారాన్ని ఇచ్చి కొత్త బంగారాన్ని తీసుకునే సదుపాయం కూడా ఉందన్నారు. ఒక ఏటీఎం ఖర్చు రూ.40 లక్షలు అని, దేశ వ్యాప్తంగా 100 ఏటీఎంలు ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు.
ఇవి కూడా చదవండి..
ఈ తప్పులు చేయకుంటే హైదరాబాద్ జట్టు గెలిచేది..కానీ చివరకు
హైదరాబాద్ ఓటమి, గుజరాత్ ఘన విజయం
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..
Updated Date - May 04 , 2025 | 04:16 AM