Bandi Sanjay: సైబర్ చెర నుంచి నలుగురికి విముక్తి
ABN, Publish Date - Apr 23 , 2025 | 04:46 AM
మంచి ఉద్యోగం వస్తుందని బ్రోకర్ల మాటలు నమ్మి మయన్మార్ వెళ్లి.. అక్కడ బలవంతంగా సైబర్ క్రైమ్లు చేస్తూ చిక్కుపోయిన నలుగురు తెలుగు యువత కేంద్ర మంత్రి బండి సంజయ్ చొరవతో స్వరాష్ట్రాలకు చేరుకున్నారు.
బర్మాలో బందీలుగా తెలుగు యువత
బండి సంజయ్ చొరవతో స్వదేశానికి
హైదరాబాద్, ఏప్రిల్ 22 (ఆంధ్రజ్యోతి): మంచి ఉద్యోగం వస్తుందని బ్రోకర్ల మాటలు నమ్మి మయన్మార్ వెళ్లి.. అక్కడ బలవంతంగా సైబర్ క్రైమ్లు చేస్తూ చిక్కుపోయిన నలుగురు తెలుగు యువత కేంద్ర మంత్రి బండి సంజయ్ చొరవతో స్వరాష్ట్రాలకు చేరుకున్నారు. వీరిలో ముగ్గురు తెలంగాణ వారు కాగా, ఒకరు ఏపీ వ్యక్తి. కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆదేశాల మేరకు బండి సంజయ్ ప్రత్యేక చొరవ తీసుకుని వీరిని స్వదేశానికి రప్పించారు. బ్యాంకాక్లో మంచి జాబ్ ఉందని, ప్రతి నెలా రూ.లక్షల జీతం వస్తుందని బ్రోకర్ ఆశ చూపడంతో బాధితులు మోసపోయారు. ఇదే విషయమై రంగారెడ్డి జిల్లా కోహెడకు చెందిన రాకేశ్రెడ్డి మాట్లాడారు. ‘‘మా ప్రాంతంలో ఉండే యశ్నాథ్గౌడ్ బ్యాంకాక్లో మంచి ఉద్యోగం ఉందని ఆశ చూపాడు. జగిత్యాలలోని బ్రోకర్ల ఏజెంట్(టీం లీడర్) వంశీ కృష్ణ వద్దకు తీసుకువెళ్లాడు. వంశీకృష్ణ నన్ను ఇంటర్వ్యూ చేశాడు. బ్యాంకాక్కు 200 కి.మీ దూరంలో జాబ్ అని చెప్పి తీసుకుపోయారు.
అక్కడికిపోతే రోజుకు 16 గంటల పని. అది సైబర్ క్రైమ్. ఆ పని చేయకపోతే భోజనం పెట్టేవారు కాదు. 5 నెలలు ఆ కంపెనీలో పనిచేశా. అలాంటి పనిచేయడం ఇష్టంలేక మొండికేశా. దీంతో వాళ్లు నా పాస్పోర్ట్ గుంజుకున్నారు. అన్నం పెట్టకుండా హింసించారు. అయినా వినకపోవడంతో మేం దొంగతనంగా ఆ దేశానికి వచ్చామని ఆర్మీ వాళ్లకు పట్టించారు. వాళ్లు మమ్మల్ని జైల్లో వేశారు. ఇటీవల మయన్మార్ నుండి వందలాది మంది నాలాంటి బాధితులను కేంద్ర మంత్రి బండి సంజయ్ స్వదేశానికి రప్పించారని తెలుసుకుని నా కుటుంబసభ్యులకు సమాచారమిచ్చా. మా నాన్న యాదిరెడ్డి లేఖ రాసిన వెంటనే బండి సంజయ్ స్పందించి మమ్మల్ని స్వదేశానికి రప్పించేందుకు చర్యలు తీసుకున్నారు. బండి సంజయ్కి మా కుటుంబమంతా రుణపడి ఉంటుంది’’ అని రాకేశ్రెడ్డి పేర్కొన్నారు. రాకేశ్రెడ్డితోపాటు కోహెడకు చెందిన శివశంకర్, కరీంనగర్ జిల్లాకు చెందిన కనూరి గణేశ్, ఆంధ్రప్రదేశ్కు చెందిన ఆకుల గురు యువకిశోర్ స్వదేశానికి తిరిగి వచ్చారు. సైబర్ క్రైం వెట్టి చాకిరీ చేస్తున్న వారందరినీ త్వరలోనే స్వదేశానికి రప్పిస్తామని బండి సంజయ్ తెలిపారు.
ఇవి కూడా చదవండి
Falaknuma Crime News: వివాహమైన మూడు రోజులకే రౌడీషీటర్ దారుణ హత్య.. ఏం జరిగిందంటే
CM Revanth Praised Women: సన్నబియ్యంతో సహపంక్తి భోజనం.. మహిళకు సీఎం అభినందనలు
Read Latest Telangana News And Telugu News
Updated Date - Apr 23 , 2025 | 04:46 AM