Bandi Sanjay: ‘మోదీ కానుక’గా 20 వేల సైకిళ్లు
ABN, Publish Date - Jul 05 , 2025 | 04:18 AM
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తన పుట్టిన రోజు(జూలై 11) సందర్భంగా కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో 20 వేల సైకిళ్లు పంపిణీ చేయనున్నారు.
కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో
పంపిణీ చేయనున్న బండి సంజయ్
11న తన పుట్టినరోజు సందర్భంగా టెన్త్ విద్యార్థులకు కేంద్ర మంత్రి బహుమతి
హైదరాబాద్, జూలై 5: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తన పుట్టిన రోజు(జూలై 11) సందర్భంగా కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో 20 వేల సైకిళ్లు పంపిణీ చేయనున్నారు. నియోజకవర్గ పరిధిలోని ప్రభుత్వ, రెసిడెన్షియల్ పాఠశాలల్లోని పదో తరగతి విద్యార్థులకు ‘మోదీ కానుక’ పేరిట సైకిళ్లు ఇవ్వనున్నారు. విద్యార్థులతోపాటు పంచాయతీలు, మునిసిపాలిటీలు, మండలాల వారీగా మరికొందరికి కూడా సైకిళ్లు అందించనున్నారు. ఒక్కో సైకిలు ధర రూ.4,000 కాగా.. సైకిల్పై ప్రధాని మోదీ ఫొటో ముద్రించి ఉంటుంది.
కాగా, కరీంనగర్ జిల్లాలో 3,096 మంది, రాజన్న సిరిసిల్లలో 3,841, జగిత్యాల 1,137, సిద్దిపేట 783, హనుమకొండ 491 కలిపి మొత్తం 9,348 పదో తరగతి విద్యార్థులకు సైకిళ్లు ఇవ్వనున్నారు. ఇదికాక, కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలో 66 డివిజన్లు ఉండగా.. ఒక్కో డివిజన్కు 50 సైకిళ్లు ఇవ్వనున్నారు. నియోజకవర్గంలోని ప్రతీ మండలానికి 100 చొప్పున సైకిళ్లు ఇస్తారు. హుజూరాబాద్, జమ్మికుంట, హుస్నాబాద్, సిరిసిల్ల, వేములవాడ, చొప్పదండి, కొత్తపల్లి మున్సిపాలిటీల పరిధిలో ఒక్కో వార్డుకు 50 సైకిళ్లు ఇవ్వనున్నారు. ఇప్పటికే 5,000 సైకిళ్లు సిద్ధమవ్వగా.. జూలై 8 లేదా 9 తేదీల్లో పంపిణీని ప్రారంభించనున్నారు.
Updated Date - Jul 05 , 2025 | 11:18 AM