IND vs ENG Strategies: తిరుగులేని స్కెచ్.. ఒక్క సెషన్లో ఖేల్ఖతం.. మ్యాచ్ మనదే!
ABN, Publish Date - Jul 04 , 2025 | 03:07 PM
ఎడ్జ్బాస్టన్ టెస్ట్లో దుమ్మురేపుతోంది టీమిండియా. దాదాపుగా ప్రతి సెషన్లోనూ ఆధిపత్యం కనబరుస్తూ వస్తున్న గిల్ సేన.. మూడో రోజూ డామినేషన్ నడిపించాలని చూస్తోంది.
ఎడ్జ్బాస్టన్ టెస్ట్లో తప్పక గెలవాలని చూస్తోంది భారత్. అందుకు తగ్గట్లే మ్యాచ్ను సూపర్బ్గా షురూ చేసింది. బ్యాటింగ్కు దిగి మొదటి ఇన్నింగ్స్లో ఏకంగా 587 పరుగుల భారీ స్కోరు చేసింది. ఆ తర్వాత 25 పరుగులకే 3 వికెట్లు తీసి ఇంగ్లండ్ను తీవ్ర కష్టాల్లోకి నెట్టింది. మూడో రోజును 77/3 స్కోరు వద్ద ముగించింది ఆతిథ్య జట్టు. నాలుగో రోజు నిర్ణయాత్మకంగా మారింది. ఈ రోజు కనీసం రెండు సెషన్లలో ఆధిపత్యం కనబర్చినా మ్యాచ్ భారత్దేననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అదే సమయంలో జట్టుకు 3 వ్యూహాలను సూచిస్తున్నారు విశ్లేషకులు. వీటిని గానీ పాటిస్తే మ్యాచ్ మనదేనని ధీమాగా చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం..
చాన్స్ ఇవ్వొద్దు..
బెన్ స్టోక్స్ నేతృత్వంలోని ఇంగ్లండ్ జట్టు బజ్బాల్తో దుమ్మురేపుతోంది. ఓటమో, గెలుపో మ్యాచ్లో ఫలితం తేలాలనే ఉద్దేశంతోనే ఆడుతూ వస్తోంది. గత 34 మ్యాచుల్లో కేవలం 2023లో జరిగిన యాషెస్ టెస్ట్ను మాత్రమే డ్రా చేసుకుంది ఇంగ్లండ్. ఆ లెక్కన ప్రస్తుత మ్యాచ్లోనూ ఆ టీమ్ రిజల్ట్ కోసమే ఆడుతుంది. కాబట్టి ఆ జట్టును ఎక్కడికక్కడ నిలువరిస్తూ పోవాలి. ఒకవైపు బౌలర్లు టైట్ లెంగ్త్స్ బౌలింగ్ చేస్తూ, మరోవైపు ఫీల్డర్లు పరుగులు నియంత్రించుకుంటూ ఆతిథ్య జట్టును గుక్క తిప్పుకోకుండా చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.
గిరగిరా తిప్పుతూ..
భారత స్కోరుకు ఇంగ్లండ్ ఇంకా 500 పరుగుల దూరంలో ఉంది. కాబట్టి పేసర్లతో పాటు స్పిన్నర్లతో ఎక్కువగా అటాక్ చేయాల్సిన అసవరం ఉంది. పరుగులు పోయినా ఫర్వాలేదు ఒక ఎండ్ నుంచి జడేజా, మరో ఎండ్ నుంచి సుందర్ బంతులు సంధిస్తూ పోవాలని నిపుణులు చెబుతున్నారు. నాథన్ లయన్, యాష్లే గైల్స్ లాంటి విదేశీ స్పిన్నర్లు ఇంగ్లండ్ గడ్డపై వికెట్ల పండుగ చేసుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయి. కాబట్టి ఇవాళ స్పిన్నర్లతో దాడి చేయించాలని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు.
విడగొట్టాలి..
ఇంగ్లండ్ 25 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. ఆ సమయంలో క్రీజులోకి అడుగుపెట్టిన హ్యారీ బ్రూక్ (30 నాటౌట్).. జో రూట్ (18 నాటౌట్)తో కలసి జట్టును రక్షించాడు. మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడాడు. ఆఖర్లో దూకుడు పెంచి పరుగులు రాబట్టాడు. ఇప్పటికే నాలుగో వికెట్కు 52 పరుగులు జోడించారు రూట్-బ్రూక్. ఈ ప్రమాదకర జంటను ఎంత త్వరగా పెవిలియన్కు పంపితే టీమిండియాకు అంత మంచిది. వీళ్లు గానీ ఔట్ కాకపోతే ఇంగ్లండ్ కమ్బ్యాక్ ఇవ్వడమే కాదు.. ఫలితాన్ని శాసించే స్థితికి చేరుకున్నా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. పై మూడు వ్యూహాలు పాటిస్తే ఒక్క సెషన్లోనే ఇంగ్లండ్ ఖేల్ఖతం అని నిపుణులు చెబుతున్నారు. మరి.. భారత్ ఏం చేస్తుందో చూడాలి.
ఇవీ చదవండి:
మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Jul 04 , 2025 | 03:11 PM