Joe Root On Ball Change: ఇదో తలతిక్క పని.. అంపైర్లపై రూట్ సీరియస్!
ABN, Publish Date - Jul 12 , 2025 | 03:19 PM
బంతి మార్పు వివాదంపై ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ స్పందించాడు. ఇదేం తలతిక్క పని అంటూ అతడు సీరియస్ అయ్యాడు. రూట్ ఇంకా ఏమన్నాడంటే..
లార్డ్స్ వేదికగా భారత్-ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న మూడో టెస్ట్లో ప్లేయర్ల ఆట కంటే కూడా బంతి మార్పు అంశం చర్చనీయాంశంగా మారింది. ఈ సిరీస్లో వాడుతున్న డ్యూక్ బాల్స్ త్వరగా ఆకారాన్ని కోల్పోతున్నాయి అంటూ ఇరు జట్ల ఆటగాళ్లు సీరియస్ అవుతున్నారు. రెండో రోజు ఇంగ్లండ్ ఇన్నింగ్స్ సమయంలో 10 ఓవర్ల లోపే బంతి ఆకారం మారిపోయింది. దీంతో బంతిని మార్చాలని కోరగా అంపైర్లు సరిగ్గా వ్యవహరించకపోవడంతో భారత కెప్టెన్ శుబ్మన్ గిల్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. తాజాగా ఈ వ్యవహారంపై ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ స్పందించాడు. ఇదో తలతిక్క పని అన్నాడు. రూట్ ఇంకా ఏం చెప్పాడంటే..
కరెక్ట్ కాదు..
‘బంతిని మార్చాలని అనుకుంటే ప్రతి 80 ఓవర్లకు మూడేసి చాలెంజ్లు ఇవ్వాలి. ఇది సరైన మార్గంగా కనిపిస్తోంది. అంతేగానీ తయారీదారులను ఏమీ అనలేం. బంతి మార్పు కోసం ఆటను ఆపడం కరెక్ట్ కాదు. కొన్నిసార్లు బంతి ఆకారం మారిపోవడం సహజమే. దీనిపై చర్చలు అనవసరం’ అని రూట్ చెప్పుకొచ్చాడు. ఈ వివాదం మీద భారత బ్యాటింగ్ దిగ్గజం సునీల్ గవాస్కర్ కూడా స్పందించాడు. బంతి మార్పు అంశం ఇండియాలో గనుక జరిగి ఉంటే బ్రిటీష్ మీడియా తప్పకుండా రాద్ధాంతం చేసి ఉండేదన్నాడు గవాస్కర్.
పరిష్కరించాల్సిందే..
బంతి ఆకారం త్వరగా మారిపోవడం సరికాదని.. ఈ బంతుల్లో సమస్య ఉందన్నాడు ఇంగ్లండ్ వెటరన్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్. ప్రతి ఇన్నింగ్స్లో బంతి మారుస్తున్నారని, డ్యూక్ బాల్స్లో ఉన్న సమస్యను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలని అతడు కోరాడు. 10 నుంచి 15 ఓవర్లకు ఒకసారి బంతిని మార్చుకుంటూ పోతే కుదరదని.. కనీసం 80 ఓవర్ల వరకు ఒకే బంతితో ఆడించేలా ప్లాన్ చేయాలని దిగ్గజ బౌలర్ సూచించాడు.
ఇవీ చదవండి:
టీమిండియాకు అశ్విన్ వార్నింగ్!
మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Jul 12 , 2025 | 03:22 PM