CM Chandrababu Tour In Dubai: దుబాయ్లో సీఎం చంద్రబాబు తొలి రోజు పర్యటన..
ABN, Publish Date - Oct 23 , 2025 | 11:36 AM
మూడు రోజుల విదేశీ పర్యటనలో భాగంగా సీఎం చంద్రబాబు నాయుడు దుబాయ్ చేరుకున్నారు. తొలి రోజు ఆయన చేపట్టిన పర్యటన సూపర్ సక్సెస్ అయింది. ఈ పర్యటనలో భాగంగా వివిధ కంపెనీల చైర్మన్లు, భారత రాయబార కార్యాలయ ప్రతినిధులతో సీఎంచంద్రబాబు బృందం సమావేశమైంది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దుబాయ్ పర్యటన బిజీ బిజీగా సాగుతోంది. తొలి రోజు పర్యటనలో భాగంగా సీఐఐ భాగస్వామ్య సదస్సు రోడ్ షోలో సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సదస్సుకు వివిధ కంపెనీల ప్రతినిధులు భారీగా హాజరయ్యారు. రాష్ట్రంలో పెట్టుబడులకు విస్తృత అవకాశాలున్నాయని.. అవసరమైతే విధానాల్లో మార్పులు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని సీఎం చంద్రబాబు ప్రకటించారు.
రాష్ట్రంలో లాజిస్టిక్స్, గిడ్డంగులు ఏర్పాటుపై ప్రతిపాదనలు పరిశీలించాలని ఈ సందర్భంగా షరాఫ్ గ్రూప్ను సీఎం చంద్రబాబు కోరారు. దుగరాజుపట్నంలో నౌకా నిర్మాణ కేంద్రం ఏర్పాటులో భాగస్వామ్యం కావాలంటూ సీఎం చంద్రబాబు చేసిన ప్రతిపాదనకు ట్రాన్స్ వరల్డ్ గ్రూప్ సానుకూలంగా స్పందించింది.
ఈ సందర్భంగా ఆ సంస్థ చైర్మన్తో సీఎం సమావేశమై.. రాష్ట్రానికి సుదీర్ఘంగా ఉన్న తీర ప్రాంతంతోపాటు ఓడరేవుల అంశాన్ని ఆయనకు సీఎం చంద్రబాబు వివరించారు. దీంతో ట్రాన్స్ వరల్డ్ గ్రూప్ సానుకూలంగా స్పందించింది.
రాజధాని అమరావతి నిర్మాణంలో భాగస్వాములు కావాలని దుబాయ్లోని ప్రముఖ రియాల్టీ సంస్థ శోభా గ్రూప్ ప్రతినిధులను సీఎం చంద్రబాబు కోరారు. ఈ నేపథ్యంలో అమరావతిలో ప్రపంచస్థాయి గ్రంథాలయ నిర్మాణానికి రూ. 100 కోట్ల విరాళానని ప్రకటించింది. ఈ సంస్థ చైర్మన్ పీఎన్సీ మేనన్ను సీఎం అభినందించారు.
తిరుపతిలో క్యాన్సర్ సెంటర్ ఏర్పాటుకు బుర్జిల్ హెల్త్ కేర్ అంగీకారించింది.
ఇక విశాఖపట్నం వేదికగా నవంబర్ 14, 15 తేదీల్లో నిర్వహించనున్న భాగస్వామ్య సదస్సుకు రావాలంటూ వారిని సీఎం చంద్రబాబు ఆహ్వానించారు.
దుబాయ్, అబుదాబిల్లోని భారత రాయబారి కార్యాలయ ప్రతినిధులతో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు.
సీఎం చంద్రబాబు మూడు రోజుల పాటు దుబాయి, అబుదాబి, యూఏఈలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో సీఎం చంద్రబాబు వెంట మంత్రులు బీసీ జనార్దన్ రెడ్డి, టీజీ భరత్తోపాటు పలువురు ఉన్నతాధికారులు ఉన్నారు.
అలాగే దుబాయ్ ఫ్యూచర్ మ్యూజియంను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బృందం సందర్శించింది. దీనిని లివింగ్ మ్యూజియంగా రూపొందించారు.
అంతరిక్షం, వాతావరణం, ఆరోగ్యం, విద్య, వైద్యం, ఏఐ తదితర రంగాల్లో భవిష్యత్ ఆవిష్కరణలు ఏ విధంగా ఉండబోతున్నాయనేది టెక్నాలజీని వినియోగించి మ్యూజియంలో ప్రదర్శనలు చేస్తున్నట్లు దుబాయ్ ఉన్నతాధికారులు సీఎం చంద్రబాబు బృందానికి వివరించారు.
అలాగే ఫ్యూచర్ జర్నీ పేరుతో ఏర్పాటు చేసిన ఎక్సీపీరియన్స్ జోన్ను సైతం సీఎం చంద్రబాబు బృందం సందర్శించింది.
ఈ పర్యటనలో భాగంగా రాష్ట్రాభివృద్ధి కోసం వీలైనంత ఎక్కువ మంది పారిశ్రామికవేత్తలతో సీఎం చంద్రబాబు సమావేశం కానున్నారు.
Updated Date - Oct 23 , 2025 | 11:47 AM