Operation Sindoor: పాకిస్థాన్ గుండెల్లో బాంబులు పేల్చిన భారత్
ABN, Publish Date - May 12 , 2025 | 08:16 PM
Operation Sindoor: ఆపరేషన్ సిందూర్లో బలగాలు ఎంతో ధైర్యాన్ని ప్రదర్శించాయని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. మన సైన్యం చూపిన తెగువకు సెల్యూట్ చేస్తున్నానన్నారు.
న్యూఢిల్లీ, మే 12: ఆపరేషన్ సిందూర్లో బలగాలు ఎంతో ధైర్యాన్ని ప్రదర్శించాయని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. మన సైన్యం చూపిన తెగువకు సెల్యూట్ చేస్తున్నానన్నారు. ఈ సందర్భంగా భారత సైన్యానికి, శాస్త్రవేత్తలకు సెల్యూట్ చేస్తున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించారు. అమాయక పౌరులను ఉగ్రవాదులు పొట్టన పెట్టుకున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆపరేషన్ సిందూర్ అనంతరం ప్రధాని మోదీ సోమవారం న్యూఢిల్లీలో జాతినుద్దేశించి ప్రసంగించారు.
మన దేశం వీరత్వాన్ని చాటుకుందన్నారు. మన మహిళల సిందూరాన్ని దూరం చేస్తే.. ఏమవుతుందో చూపించామని చెప్పారు. ఉగ్రవాదులు కలలో కూడా ఊహించని దెబ్బ కొట్టామన్నారు. పాకిస్థాన్లోని ఉగ్ర శిబిరాలు ధ్వంసం చేశామని వివరించారు. అలాగే ఉగ్రవాద కేంద్రాలను సైతం ధ్వంసం చేశామని ఆయన పేర్కొన్నారు. 100 మంది కరుడుగట్టిన ఉగ్రవాదులను సైతం హతమార్చామని ప్రధాని మోదీ సోదాహరణగా వివరించారు.
ఉగ్రవాదులపై దాడులకు సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చామని గుర్తు చేశారు. సైన్యం చేసిన దాడికి పాకిస్థాన్ సైతం నివ్వెర పోయిందన్నారు. పాకిస్థాన్ నిఘా, సాంకేతికత భారత్ ముందు తేలిపోయిందని పేర్కొన్నారు. ఉగ్రవాదులను నియంత్రించాల్సిన పాక్ మనపై ఎదురు దాడి చేసిందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పాకిస్థాన్ మన స్కూల్స్, ఆస్పత్రులు, గురుద్వారాలను టార్గెట్ చేసిందని వివరించారు. పాకిస్థాన్ డ్రోన్లు, మిస్సైల్స్ కూల్చివేశామని ప్రధాని మోదీ తెలిపారు.
పాక్ మిస్సైల్స్ భారత్లోకి రాలేకపోయాయన్నారు. మనం మాత్రం పాకిస్థాన్ గుండెల్లో బాంబులు పేల్చామని చెప్పారు. పాకిస్థాన్లోని ఎయిర్బేస్లను సైతం ధ్వంసం చేశామన్నారు. మన దెబ్బకు పాకిస్థాన్ విలవిలలాడిపోయిందని ప్రధాని మోదీ గర్వంగా చెప్పారు. భారత్ను ఎదుర్కో లేక ప్రపంచ దేశాల సాయాన్ని పాకిస్థాన్ కోరిందని ఈ సందర్భంగా ప్రధాని మోదీ గుర్తు చేశారు.
పాకిస్థాన్ చర్యలను బట్టే మన చర్యలు ఉంటాయని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. పాకిస్థాన్ ఎలాంటి దుస్సాహసానికి పాల్పడ్దా తిప్పికొడతామన్నారు. పాక్ అణు బ్లాక్ మెయిలింగ్ను ఎట్టి పరిస్థితుల్లో సహించబోమని తెలిపారు. త్రివిధ దళాలు అన్ని విధాలుగా సిద్ధంగా ఉన్నాయని పేర్కొన్నారు. ఉగ్రవాదం అంతానికి అన్నిరకాల వ్యూహాలతో సిద్ధంగా ఉన్నామని ప్రధాని మోదీ ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు. పాక్ తోక జాడిస్తే తీవ్ర పరిణామాలు తప్పవంటూ ఆ దేశాన్నిహెచ్చరించారు. భారత్ ఎప్పుడూ శాంతినే కోరుకుంటుందని ప్రధాని మోదీ స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి..
AP SSC Supplimentary Exams hall tickets: టెన్త్ సప్లిమెంటరీ పరీక్షల హాల్టికెట్లు విడుదల
Operation Sindoor: మళ్లీ అడ్డంగా దొరికిన పాక్..
Operation Sindoor: పాక్ ఎయిర్ బేస్ల ధ్వంసం.. వీడియోలు విడుదల
Operation Sindoor: పాక్ దాడులను సమర్థంగా తిప్పికొట్టాం: ఎయిర్ మార్షల్ ఎ.కె. భార్తీ
Encounter: ఎన్కౌంటర్లో మావోయిస్టులకు భారీ దెబ్బ
For National News And Telugu News
Updated Date - May 12 , 2025 | 08:42 PM