Mithun Chakraborty: తిక్క రేగిందంటే బ్రహ్మోస్ క్షిపణుల వర్షం కురిపిస్తాం.. బిలావల్కు మిథున్ చక్రవర్తి వార్నింగ్
ABN, Publish Date - Aug 12 , 2025 | 02:04 PM
యుద్ధం తప్పదంటూ పాక్ నేత బిలావల్ భుట్టో చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేత మిథున్ చక్రవర్తి ఘాటుగా స్పందించారు. తిక్క రేగితే బ్రహ్మోస్ క్షిపణులను వరుస పెట్టి ప్రయోగిస్తామంటూ హెచ్చరించారు.
ఇంటర్నెట్ డెస్క్: భారత్తో యుద్ధం రావొచ్చంటూ పిచ్చి ప్రేలాపనలు చేసిన పాక్ నేత బిలావల్ భుట్టోపై బీజేపీ నేత మిథున్ చక్రవర్తి మండిపడ్డారు. తిక్కరేగిందంటే మిసైళ్ల వర్షం కురిపిస్తామని హెచ్చరించారు.
‘ఇలాంటి వ్యాఖ్యలకు మాకు తిక్క రేగిందంటే వరుస పెట్టి బ్రహ్మోస్ క్షిపణులను ప్రయోగిస్తాము’ అంటూ గట్టి వార్నింగ్ ఇచ్చారు. భారత డ్యాములు కూల్చేస్తామంటూ పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ చేసిన వ్యాఖ్యలపై కూడా మిథున్ చక్రవర్తి తనదైన శైలిలో ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘140 కోట్ల మంది మూత్ర విసర్జన కోసం డ్యామ్ కట్టే ఆలోచనలో ఉన్నాము. ఆ తరువాత డ్యామ్ గేట్లు తెరిస్తే భారీ సునామీ వస్తుంది. ఇదంతా బిలావల్ను ఉద్దేశించి అన్నాను. పాక్ ప్రజలపై నాకు ఎలాంటి కోపం లేదు’ అని మిథున్ చెప్పారు.
అమెరికా మద్దతు లభించడమో మరొకటో తెలీదు కానీ గత కొద్ది రోజులుగా పాక్ నేతలు మళ్లీ పిచ్చి ప్రేలాపనలు మొదలెట్టారు. అమెరికా వేదికగా పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ అణు హెచ్చరికలు చేశారు. తమ దేశ ఉనికికి ముప్పు వచ్చిన పక్షంలో తమతో పాటు సగం ప్రపంచం అంతమైపోతుందంటూ ఉన్మాదంతో ఊగిపోయారు.
ఈ క్రమంలో పీపీపీ పార్టీ నేత బిలావల్ భుట్టో కూడా రెచ్చిపోయారు. ప్రధాని మోదీకి వ్యతిరేకంగా పాక్ ప్రజలు ఏకం కావాలని పిలుపునిచ్చారు. యుద్ధం మినహా మరో ప్రత్యామ్నాయం లేని పరిస్థితి భారత్ కల్పిస్తోందంటూ అన్యాయంగా బెదిరింపులకు దిగారు. పాక్తో ఘర్షణల్లో ఓటమి కారణంగానే భారత్ సింధు నదులపై డ్యామ్ల నిర్మాణానికి నడుం కట్టిందని అన్నారు.
పహల్గాం దాడి తరువాత భారత్ పాక్కు బుద్ధి చెప్పేందుకు బహుళ అంచెల వ్యూహం ప్రయోగించింది. అటు ఆపరేషన్ సిందూర్తో ఉగ్రమూకలను మట్టి కరిపించడంతో పాటు సింధు నదీ జలాల పంపిణీ ఒప్పందాన్ని కూడా నిలుపుదల చేసింది. ఇరు దేశాల మధ్య స్నేహసంబంధాల ఆధారంగా ఒప్పందం కుదుర్చుకున్న విషయాన్ని అప్పట్లో భారత్ పేర్కొంది. తమపై పాక్ అకారణంగా విషం చిమ్ముతున్న నేపథ్యంలో ఒప్పందాన్ని కొనసాగించలేమని స్పష్టం చేసింది.
ఇవి కూడా చదవండి
జస్టిస్ వర్మ నోట్ల కట్టల ఉదంతం కీలక మలుపు.. అభిశంసన తీర్మానాన్ని స్వీకరించిన లోక్సభ స్పీకర్
గతేడాది 2.17 లక్షల ఫేక్ కరెన్సీ నోట్ల పట్టివేత.. లోక్సభలో కేంద్ర మంత్రి వెల్లడి
For More National News and Telugu News
Updated Date - Aug 12 , 2025 | 02:15 PM